సంక్రాంతి పండగ సందర్భంగా రాబోతున్న మరో మూవీ `అనగనగా ఒక రాజు`. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీకి నిర్మాత నాగవంశీ. ఈ సంక్రాంతి పోటీపై నాగవంశీ స్పందించారు. ఆసక్తికర కామెంట్ చేశారు.
ఈ ఏడాది సంక్రాంతి పండక్కి సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే `ది రాజా సాబ్` విడుదలై మిశ్రమ స్పందనతో రన్ అవుతుంది. మరోవైపు చిరంజీవి `మన శంకర వరప్రసాద్ గారు` మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతుంది. ఇంకోవైపు రవితేజ నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ సైతం యావరేజ్ టాక్ని తెచ్చుకుంది. రేపు బుధవారం ఇంకా రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. నవీన్ పొలిశెట్టి `అనగనగా ఒక రాజు`, శర్వానంద్ `నారి నారి నడుమ మురారీ` చిత్రాలు రాబోతున్నాయి. ఇంతటి తీవ్ర పోటీపై నిర్మాత నాగవంశీ స్పందించారు.
25
మేం ప్రకటించినప్పుడు ఈ పోటీ లేదు- నాగవంశీ
నాగవంశీ మాట్లాడుతూ, ఈ పోటీ తమ సినిమాకి పెద్ద సమస్య కాదని తెలిపారు. అయితే తాము అనుకున్నప్పుడు ఇన్ని సినిమాలు లేవని తెలిపారు. చిరంజీవి సినిమా ఒక్కటి వస్తుందనుకున్నాం. కానీ `ది రాజా సాబ్`, రవితేజ సినిమా, శర్వానంద్ మూవీ ఆ తర్వాత వచ్చాయని తెలిపారు. కాకపోతే వీటికి తమ మూవీ భిన్నమైనది అని తెలిపారు. `గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ఈ సినిమా రూపొందింది. నవీన్ శైలిలో చాలా సరదాగా సినిమా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉంటుంది. సినిమా ఎంత నవ్విస్తుందో.. అదే సమయంలో చివరిలో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫైట్, పాటలు ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన పండగ సినిమా ఇది` అని తెలిపారు నిర్మాత. మిగిలిన చిత్రాలతో తమది చాలా స్పెషల్ అని, ఈ పొలిటికల్ సెటైర్ ట్రెండీగా ఉంటుందని, ముఖ్యంగా యూత్కి కనెక్ట్ అవుతుందన్నారు.
35
జాతిరత్నాలను మించి `అనగనగా ఒక రాజు`-నవీన్ పొలిశెట్టి
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా మారి దర్శకత్వంలో రూపొందిన `అనగనగా ఒక రాజు` మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా బుధవారం(జనవరి 14న) విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ని నిర్వహించారు. ఇందులో హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ, `జాతిరత్నాలు` మూవీ తనకు ఎంతో పేరు తెచ్చిందని, ఇది దాన్ని మించి ఉంటుందని, ఫ్యామిలీకి దగ్గర చేసే సినిమా అవుతుందన్నారు.
`మన తెలుగువారికి సంక్రాంతి అనేది ప్రత్యేకమైన పండుగ. ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి మన వాళ్ళను కలుసుకొని సంతోషంగా ఉంటాం. ఒత్తిడిని పక్కన పెట్టి, పిండి వంటలు తింటూ, నలుగురితో నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటాం. అలాంటి ఎనర్జీనే 'అనగనగా ఒక రాజు'లో చూడబోతున్నారు. మన ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా సినిమా ఉంటుంది. ట్రైలర్ కి వచ్చిన అద్భుతమైన స్పందన సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ట్రైలర్ లో ఉన్న జోక్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒక పర్ఫెక్ట్ పండగ సినిమాలా ఉంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంది. ఇప్పటికే బుకింగ్స్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ తోనే నా గత చిత్రాల ఓపెనింగ్స్ ని దాటేసింది. మీరు ఈ సినిమాపై చూపుతున్న ఆసక్తికి తగ్గట్టుగానే మిమ్మల్ని అలరించేలా ఈ సినిమా ఉంటుంద`ని తెలిపారు. సినిమా స్క్రిప్ట్ లో తాను కూడా భాగమయ్యాయని, బెటర్ మెంట్ చేశానని తెలిపారు. మీనాక్షి పాత్ర అందరికి కనెక్ట్ అవుతుందన్నారు.
55
చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు- మీనాక్షి చౌదరీ
కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, `మేమందరం ఎంతో కష్టపడి పని చేసి ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాము. ఈ సినిమాపై మీ స్పందన కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. మీరు ఈ సినిమాని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చూసినంత సేపు నవ్వుతూనే ఉంటారు` అని తెలిపారు. బాల నటుడు రేవంత్(బుల్లిరాజు) మాట్లాడుతూ, `ఇందులో చాలా మంచి పాత్ర పోషించాను. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో కూడా ఉంటాను. నవీన్ అన్నతో ఏడు బ్లాక్స్ ఉంటాయి. అవి హిలేరియస్గా ఉంటాయని` తెలిపారు.