ఎంజీఆర్ హీరోగా ఆగిపోయిన సినిమా కోసం విజయకాంత్ని హీరోగా తీసుకోవాలనుకున్నారు. కానీ టీమ్కి ఎంజీఆర్ పెద్ద షాక్ ఇచ్చాడు. తన ఇమేజ్ ఎవరికీ ఇవ్వను అని చెప్పి విజయకాంత్ని పక్కన పెట్టారు. భాగ్యరాజ్కి బంపర్ ఆఫర్ వరించింది.
ఎంజీఆర్ ఒకప్పుడు తిరుగులేని సూపర్ స్టార్గా రాణించిన విషయం తెలిసిందే. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. సీఎంగా విశేష సేవలను అందించారు. అయితే తాను ముఖ్యమంత్రి అయినప్పుడు ఓ సినిమా విషయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ మూవీ తాను హీరోగా నటించగా, అది మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమాని విజయకాంత్తో చేయాలనుకున్నారు. కానీ ఎంజీఆర్ పెద్ద షాక్ ఇస్తూ, విజయకాంత్ని పక్కన పెట్టి భాగ్యరాజ్ని హీరోని చేశాడు. దెబ్బకి ఆయన జీవితమే మారిపోయింది.
24
సీఎంగా బిజీగా ఉన్న ఎంజీఆర్
అసలేం జరిగిందంటే.. ఎంజీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో ఆయన నటిస్తున్న ఓ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నిర్మాతకు భారీ నష్టం వాటిల్లింది. ఆ నష్టం నుంచి నిర్మాతను గట్టెక్కించడానికి ప్రముఖ దర్శకుడు కె. భాగ్యరాజ్ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఆగిపోయిన ఆ చిత్రంలో యాక్షన్ హీరో విజయకాంత్ను పెట్టి పూర్తి చేద్దామని ఆయన సూచించారు. ఈ ప్రతిపాదన చివరికి ఎంజీఆర్ వద్దకు చేరడంతో కథ మొత్తం మలుపు తిరిగింది. అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా ఆగిపోవడం వల్ల నిర్మాతకు రూ.15 లక్షల నష్టం వచ్చిందని భాగ్యరాజ్ తెలుసుకున్నారు. అందుకే, అప్పటికే చిత్రీకరించిన ఎంజీఆర్ సన్నివేశాలకు అనుగుణంగా కొత్త కథ రాసిస్తానని, విజయకాంత్ లాంటి యాక్షన్ హీరోతో సినిమా పూర్తి చేయమని నిర్మాతకు సలహా ఇచ్చారు.
34
విజయకాంత్ కాదు.. నువ్వే హీరో!
ఈ విషయం తెలుసుకున్న ఎంజీఆర్ వెంటనే భాగ్యరాజ్ను పిలిపించి మాట్లాడారు. నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతోనే విజయకాంత్ పేరును సూచించానని భాగ్యరాజ్ వివరించారు. దీనికి ఎంజీఆర్ స్పందిస్తూ, "విజయకాంత్ ఎందుకు, ఆ పాత్ర నువ్వే చేయలేవా? నా ఇమేజ్ను ఇంకెవరికీ ఇచ్చే ప్రసక్తే లేదు" అని తేల్చి చెప్పినట్లు భాగ్యరాజ్ ఓ పాత ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఒకవేళ నువ్వు హీరోగా చేయడానికి సిద్ధంగా ఉంటేనే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందని, లేదంటే దాన్ని పక్కన పడేసి, నిర్మాతకు రావాల్సిన డబ్బులు తానే ఇచ్చేస్తానని ఎంజీఆర్ చెప్పడంతో భాగ్యరాజ్ ఆశ్చర్యపోయారు. ఎంజీఆర్ అంత గట్టిగా చెప్పడంతో, ఆ సినిమాలో హీరోగా నటించడానికి భాగ్యరాజ్ అంగకరించక తప్పలేదు. అదీ సంగతి.
ఎంజీఆర్ ఆదేశాలతో భాగ్యరాజ్ హీరోగా ఆ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కింది. అయితే, భాగ్యరాజ్ సిద్ధం చేసిన కొత్త కథపై ఎంజీఆర్కు మొదట ఓ సందేహం కలిగింది. అసలు కథ ప్రకారం తన సోదరికి ఒక్కడే బిడ్డ అని, కానీ కొత్త కథలో డ్యూయల్ రోల్ ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత భాగ్యరాజ్ పూర్తి కథను వివరించగా, ఎంజీఆర్ సంతృప్తి చెంది సినిమా షూటింగ్ను స్వయంగా ప్రారంభించారు. శ్రీధర్ దర్శకత్వంలో ఎంజీఆర్, నంబియార్, లత ప్రధాన పాత్రల్లో 1977లో మొదలై ఆగిపోయిన 'అణ్ణా నీ ఎన్ దైవమ్' అనే చిత్రమే ఇది. భాగ్యరాజ్ మార్పులతో వచ్చిన ఈ కొత్త చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, ఇతర భాషల్లోనూ రీమేక్ అయింది. ఈ మూవీతో భాగ్యరాజ్ లైఫే మారిపోయింది.