Manorama: డైరెక్టర్ పి. వాసు 'చిన్న తంబి' సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు, నటి మనోరమ భర్త చనిపోయారనే షాకింగ్ న్యూస్ తెలిసింది. అయినప్పటికీ, మనోరమ షూటింగ్ ఆపకుండా నటించారట. షాకింగ్ విషయాన్ని ఆయన పంచుకున్నారు.
తమిళ చిత్రసీమలో 'ఆచి' అని ప్రేమగా పిలుచుకునే మనోరమ ఒక సాధారణ నటి కాదు. ఆమె సుమారు 1500కు పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఏకంగా ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఏకైక నటిగా మనోరమ గుర్తింపు పొందారు. తమిళం, తెలుగులోనే కాదు, యావత్ భారత సినీ పరిశ్రమ గర్వించదగ్గ ఈ నటి జీవితంలో జరిగిన ఒక సంఘటన, సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
24
చిన్న తంబి షూటింగ్ టైమ్లో మనోరమ భర్త మరణం
ప్రముఖ దర్శకుడు పి. వాసు ఒక ఇంటర్వ్యూలో ఈ హృదయ విదారక సంఘటనను గుర్తుచేసుకున్నారు. అది 1991వ సంవత్సరం. పి. వాసు, ప్రభు హీరోగా 'చిన్న తంబి' అనే బ్లాక్బస్టర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రకు మనోరమను ఎంపిక చేశారు. సినిమాలోని అత్యంత కీలకమైన, భావోద్వేగమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. సెట్లో అందరూ తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. షూటింగ్ వేగంగా జరుగుతున్నప్పుడు, దర్శకుడు పి. వాసుకు ఒక షాకింగ్ న్యూస్ అందింది. ఆ రోజు మధ్యాహ్నం మనోరమ భర్త చనిపోయారని ఆ వార్త సారాంశం. ఈ విషయం విని పి. వాసు షాక్ అయ్యారు. "ఇలాంటి పరిస్థితుల్లో మనోరమ ఎలా నటించగలరు? వెంటనే షూటింగ్ ఆపి ఆమెను ఇంటికి పంపిద్దాం" అని ఆయన నిర్ణయించుకున్నారు.
34
సీన్ పూర్తి చేసిన వెళ్తాను అని స్పష్టం చేసిన నటి
కానీ, అక్కడ జరిగింది వేరు! భర్త చనిపోయిన విషయం తెలిసినా, మనోరమ ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. తన బాధను మనసులోనే దాచుకుని కెమెరా ముందు నిలబడ్డారు. దర్శకుడు ఆమె దగ్గరకు వెళ్లి విషయం అడిగినప్పుడు, మనోరమ ఏమాత్రం చలించకుండా, "సినిమా క్లైమాక్స్ కోసం పెద్ద సెట్ వేశారు, వందలాది మంది ఆర్టిస్టులు వచ్చారు. నా సొంత విషాదం కోసం సినిమాకు నష్టం రాకూడదు. నేను ఈ సీన్ పూర్తి చేసి వెళ్తాను" అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆ భావోద్వేగ క్లైమాక్స్ సన్నివేశంలో మనోరమ ఎంత అద్భుతంగా నటించారంటే, ఆమె భర్త చనిపోయిన విషయం అక్కడున్న ఎవరికీ తెలియలేదు. ఆ షాట్ పూర్తయి కెమెరా ఆపగానే ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. ఆ రోజు ఆమె అంకితభావాన్ని చూసి చిత్ర యూనిట్ సభ్యులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. "సినిమా కోసమే బతుకుతున్నామని చాలా మంది చెప్పడం విన్నాను, కానీ ఆ రోజు నేను దాన్ని నిజ జీవితంలో చూశాను" అని పి. వాసు భావోద్వేగానికి గురయ్యారు. అన్నాదురై, కరుణానిధి వంటి దిగ్గజాల నాటకాల నుంచి ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ల చిత్రాల వరకు ఆమె తనదైన ముద్ర వేశారు. ఒక కళాకారుడికి కళను మించింది ఏదీ లేదనడానికి 'ఆచి' మనోరమ జీవితమే ఒక నిలువెత్తు సాక్ష్యం.