పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తారు ప్రగతి. అమ్మ, అత్త పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన ఈ తెలుగు యాక్టర్ నటన చాలా సహజంగా ఉంటుంది. ఇక పాత్రకు తగ్గట్టు ఆమె డైలాగ్ డెలివరీ, యాక్సెంట్ అదనపు ఆకర్షణ. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి 130 చిత్రాల వరకూ చేశారు.
ప్రగతి సీరియల్ నటిగా కూడా సత్తా చాటారు. 1998లో బుల్లితెరపై ప్రసారమైన తీర్పు, శ్రీ, 1999 అమ్మ వంటి సక్సెస్ ఫుల్ సీరియల్స్ లో నటించారు. ఆమె నటించిన లేటెస్ట్ సీరియల్ మమతల కోవెల జెమినీలో ప్రసారమైంది.
ఒంగోలుకు చెందిన ప్రగతి కుటుంబం చెన్నైలో సెటిల్ కావడం జరిగింది. దానితో ఆమె అక్కడే చదువుకున్నారు. అలాగే మోడలింగ్ కెరీర్ గా ఎంచుకున్నారు. హీరోయిన్ గా ప్రగతి ప్రయత్నాలు చేస్తుండగా... తమిళ నటుడు, డైరెక్టర్ కే భాగ్యరాజ్ ఆమెకు హీరోయిన్ అవకాశం ఇచ్చారు.
1994లో విడుదలైన 'వీట్ల విశేషంగ' మూవీతో ప్రగతి హీరోయిన్ గా మారారు. ఆ సినిమాలో హీరోగా భాగ్యరాజ్ నటించారు. ఆయనే దర్శకత్వం వహించారు. అదే ఏడాది విజయ్ కాంత్ కి జంటగా 'పెరియ మరుదు' అనే మరో మూవీలో నటించారు.
అనంతరం 1997వరకు ప్రగతి హీరోయిన్ గా మరో మూడు తమిళ్, ఒక మలయాళ చిత్రంలో నటించారు. తర్వాత పెళ్లి చేసుకున్న ప్రగతి సీరియల్స్ వైపు మొగ్గు చూపారు. అలా 1998లో ప్రసారమైన తెలుగు సీరియల్ తీర్పు, అమ్మ సీరియల్స్ తో కమ్ బ్యాక్ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ బాబీ మూవీతో స్టార్ట్ అయ్యింది.
వర్షం ఫేమ్ దర్శకుడు శోభన్ తెరకెక్కించిన బాబీ 2002లో విడుదల కావడం జరిగింది. ఈ మూవీలో మహేష్ (Mahesh babu)తల్లి పాత్ర చేశారు ప్రగతి. అప్పటికి ప్రగతి వయసు కేవలం 25ఏళ్ళు మాత్రమే. అంటే మహేష్ వయసుకు సమానం అన్న మాట. అతి తక్కువ వయసులోనే ఆమె తల్లిపాత్రలు చేయడం మొదలుపెట్టారు.
బాబీ విజయం సాధించకున్నప్పటికీ... తర్వాత ఆమె నటించిన నువ్వే నువ్వే, నువ్వులేక నేనులేను, గంగోత్రి.. ఇలా వరుస హిట్స్ దక్కాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రగతి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో పూజా హెగ్డే (Pooja hegde)తల్లి పాత్ర చేశారు.