Kaikala Satyanarayana: కైకాల విలన్‌గా మారడానికి కారణం ఎవరో తెలుసా?.. ఛాన్స్ ఇచ్చి తీసేశారు..

First Published Dec 23, 2022, 8:12 AM IST

అందరూ నటుడయ్యే లక్షణాలు ఉన్నాయని అంటున్నారు, అవకాశం ఇస్తున్నారు. చివర్లో పక్కన పెట్టేస్తున్నారని మదన పడ్డారు.  ఎన్ని తిరస్కారాలు ఎదురయినా  ప్రయత్నాలు ఆపలేదు కైకాల. 

కైకాల సత్యనారాయణ విలన్‌గానే బాగా సుపరిచితులు. నెగటివ్‌ రోల్స్ తోనే పాపులర్‌ అయ్యాడు. రియల్‌ లైఫ్‌లోనూ విలన్‌గానూ ఆడియెన్స్ మదిలో ముద్ర వేసుకున్నారు. ఒకానొక సమయంలో మహిళలు కైకాలని చిదరించుకునే స్థాయిలో ఆయన తన విలనిజం పండించారు. విలనిజానికి కొత్త అర్థాన్నిచ్చారు. ఆడియెన్స్‌ మదిలో విలన్‌గా ముద్ర వేసుకున్నాడంటే నటుడిగా ఆయన సక్సెస్‌ అయినట్టే.  విలన్‌ పాత్రల విషయంలో కైకాలకి వందకి వెయ్యి మార్కులు పడతాయని చెబితే అతిశయోక్తి కాదు. 

విలన్‌ పాత్రలతోపాటు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హాస్య పాత్రలు కూడా చేశారు కైకాల. కానీ విలన్‌గానే ఆడియెన్స్ లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా పీక్‌లో ఉన్న సమయంలో విలన్‌గా మెప్పించిన ఆయన ఆ తర్వాత క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీకి దగ్గరయ్యే ప్రయత్నంచేశాడు. పాత్రల ఎంపికలో మార్పు చూపించి అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించిన నటుడిగా నిలిచాడు. అయితే కైకాలకి మాత్రం అవకాశాల విషయంలో చాలా స్ట్రగుల్స్ పడ్డారు. గుర్తింపు, పేరు, సినిమాల్లో అవకాశాలు అంత సులువుగా రాలేదు. దాని కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. 

అసలు కైకాలకి నటుడవ్వాలన్న కోరిక ఎప్పుడు ఎక్కడ మొదలైందంటే, ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ గా పిలవబడుతున్న గుడివాడ కాలేజ్ లో చదువుతున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన నాటకాన్ని చూసినప్పుడు కైకాల సత్యనారాయణకి నటుడి అవ్వాలన్న ఆసక్తి ఏర్పడిందట. అయితే క్లాస్ మేట్ కె.ఎల్. ధర్గార్ మద్రాస్ లో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమయంలో దర్శక, నిర్మాత ఎల్వీప్రసాద్ కొత్తవాళ్లతో సినిమా చేస్తున్నారు. మద్రాస్ లో ఒక నెల రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుని వస్తే సినిమా అవకాశం వస్తుంది అని ఉత్తరం రాసి పంపించారు. అది చూసి సంతోషంతో ఎగిరి గెంతేసి మద్రాస్ బయలుదేరారు సత్యనారాయణ. అక్కడ ఎల్వీప్రసాద్ ని కలిశారు. ఆయన కైకాలను చూసి నీకు నటుడయ్యే లక్షణాలు ఉన్నాయి అని అన్నారు. అయితే మేము సినిమా మొదలుపెట్టడానికి రెండు నెలలు పడుతుంది, అప్పుడు రండి అని అన్నారు.

కైకాల వెనక్కి వెళ్లిపోకుండా, మద్రాస్ లోనే ఉండి అవకాశాల కోసం తిరిగారు. అలా తిరుగుతుండగా, కెబి.తిలక్ `ఎం.ఎల్.ఏ` అనే సినిమా తీస్తున్నారు. సత్యనారాయణను చూసి సెకండ్ హీరోగా అవకాశం ఇస్తా అన్నారు. కానీ ఆయన్ని కాదని, వేరే వ్యక్తికి ఇచ్చారు. `భూకైలాస్` సినిమాలో కూడా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇలా అవకాశాలు రావడం, ఇక షూటింగ్ కి వెళ్తున్నా అనగా వేరే వాళ్ళకి అవకాశాలు వెళ్లిపోవడం జరిగేది. అందరూ నటుడయ్యే లక్షణాలు ఉన్నాయని అంటున్నారు, అవకాశం ఇస్తున్నారు. చివర్లో పక్కన పెట్టేస్తున్నారని మదన పడ్డారు. 
 

ఎన్ని తిరస్కారాలు ఎదురయినా  ప్రయత్నాలు ఆపలేదు కైకాల. రూమ్ మేట్ తో కలిసి ప్రయత్నాలు చేసేవారు. ఒకరోజు రూమ్ లో కాఫీ తాగుతుండగా కప్పు అడుగు భాగంలో సాలిపురుగు కనిపించింది. దీంతో రూమ్ మేట్స్ కైకాలను హాస్పిటల్ కు వెళ్ళు, సాలిపురుగు విషం చాలా ప్రమాదం అని అన్నారు. కానీ సత్యనారాయణ కంగారుపడలేదు. ఏం కాదులేవయ్యా, ఇవాళ నైట్ పడుకుంటాను. రేపు ఉదయం లేచి బతికాననుకో నటుడిగా జీవిస్తాను, లేదనుకో ఒక పురుగు చచ్చినట్టు అని పోతాను అని అన్నారట కైకాల. కానీ అదృష్టం కొద్ది ఆయనకి ఏమీ కాలేదు. దీంతో ఆయన నటుడిగా రాణించాలనే కసి ఆయనలో పెరిగింది. 

తాను నటిస్తున్న తొలి చిత్రం పూర్తయ్యింది. రిలీజైంది. కానీ ఫ్లాప్ అయ్యింది. దీంతో అంతకు ముందు అవకాశాలు ఇస్తా అన్న వాళ్ళు ముందుకు రాలేదు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. విసిగిపోయిన ఉన్న కైకాలకి విఠలాచార్య గారి రూపంలో ఒక విస్పోటనం లాంటి అవకాశం వచ్చింది. అయితే హీరోగా కాదు, విలన్ గా. ఒక ప్రముఖ సంస్థ నిర్మిస్తున్న 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి' సినిమాలో కైకాలకు వేషం ఇమ్మని రికమండ్ చేశారు. అంతేకాకుండా కైకాలను హీరోగా కాకుండా, విలన్ గా చేయమని సలహా ఇచ్చారు. 
 

తెలుగులో విలన్ పాత్రలు చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. నువ్వు విలన్ గా చేస్తే మంచి పేరు వస్తుంది అని చెప్పారు. కైకాల కూడా విలన్ గా నటిస్తానని చెప్పడంతో విఠలాచార్య ఆలోచించకుండా తన సినిమాలో అవకాశం ఇచ్చారు. కనకదుర్గ పూజా మహిమ సినిమాతో విలన్ గా పరిచయం అయిన కైకాల, ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. `సహస్ర శిరచ్ఛే అపూర్వ చింతామణి`, `మదనకామరాజు కథ`, `అగ్గిపిడుగు` ఇలా ఎన్నో సినిమాల్లో విలన్ గా మెప్పించారు.
 

`అగ్గిపిడుగు` సినిమాలో కైకాల సెకండ్ విలన్ గా నటించారు. ఆ సినిమాలో హీరో ఎన్టీఆర్ కావడం, సినిమా పెద్ద హిట్ అవ్వడం, కైకాలకు క్రేజ్ పెరగడం జరిగిపోయాయి. ఆ తర్వాత బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. అయితే కైకాల నటనకు ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్, ఆయనలో మరో కోణాన్ని ఆవిష్కరించాలని 'ఉమ్మడి కుటుంబం' సినిమాలో సాఫ్ట్ రోల్ లో నటింపజేశారు. దీంతో కైకాల రౌద్రమే కాదు, కరుణ రసాన్ని కూడా అద్భుతంగా పండించగలరని నిరూపించారు. అలా నిరూపించుకునేలా ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు. అలా కైకాల విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిద్యభరితమైన పాత్రలు వేస్తూ మెప్పిస్తూ వచ్చారు. నటనలో ఓ లెజెండ్‌గా ఎదిగారు కైకాల. 
 

click me!