ట్రెండింగ్‌లో జస్టీస్‌ కె చంద్రు.. గూగుల్‌ సెర్చ్‌లోనూ టాప్‌.. `జై భీమ్‌` సినిమా ఎంత పనిచేసింది..

First Published Nov 6, 2021, 4:32 PM IST

సూర్య నటించిన `జై భీమ్‌` సినిమా ప్రస్తుతం సౌత్‌లో టాక్‌ ఆఫ్‌ ఇది ఇండస్ట్రీ అయ్యింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సూర్య నటించిన లాయర్‌ చంద్రు పాత్ర మరింతగా పాపులర్‌ అయ్యింది. అది రియల్‌ లైఫ్‌ స్టోరీ కావడంతో ఇంతకి ఆ చంద్రు ఎవరనేది వెతికే పనిలో పడ్డారు సినీ ప్రియులు. 

సూర్య(Suriya) బ్యాక్‌ టూ బ్యాక్‌ సందేశాత్మక చిత్రాలు, ముఖ్యంగా రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమా చేస్తూ ప్రశంసలందుకుంటున్నారు. గతేడాది ఆయన `ఆకాశం నీ హద్దురా` చిత్రంతో మన్ననలు పొందారు. ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన `జై భీమ్‌`(Jai Bhim) చిత్రంలో నటించారు. జస్టిస్‌ కె చంద్రు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. జ్ణానవేల్‌ దర్శకత్వం వహించారు. Suriyaతోపాటు ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌, సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్‌ జోస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 

నవంబర్‌ 2న ఈ సినిమా అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటుంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలందుకుంటుంది. అన్యాయంగా అరెస్ట్ అయి కనిపించకుండా పోయిన తన భర్త ఆచూకి కోసం ఓ గిరిజన మహిళ చేసే న్యాయపోరాటమే ఈ చిత్రం. ఆ మహిళకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వంతో పోరాడిన లాయర్ చంద్రు(K Chandru) జీవితానికి సంబంధించిన కథ ఇది. పర్టిక్యూలర్‌గా ఈ కేసు కోసం చంద్రు చేసిన పోరాటం ప్రధానంగా సాగే చిత్రమిది. 

ఈ సినిమాని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ చిత్రాన్ని, సూర్యని అభినందించారు. సూర్య నటించిన Justice K Chandru ఎవరనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సినీ అభిమానులు. రాజకీయ ప్రముఖులు కూడా చంద్రు గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అదే సమయంలో ప్రస్తుతం జస్టీస్‌ కె చంద్రు ట్రెండింగ్‌ అవుతున్నారు. గూగుల్‌లో బాగా సెర్చ్‌ చేస్తున్న పేర్లలో ఒకరిగా నిలుస్తున్నారు.

కె చంద్రు తమిళనాడుకు చెందిన రిటైర్డ్ జడ్జ్. 1951 మే 8న తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించారు. మద్రాస్‌ హైకోర్ట్ లో ఆయన జస్టీస్‌గా చేసి రిటైర్డ్ అందించారు. రాష్ట్రప్రతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ 2006లో కె చంద్రుని మద్రాస్‌ హైకోర్ట్ కి జస్టీస్‌గా ఎంపిక చేశారు. 2014లో రిటైర్డ్ అయ్యారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు సేవలందించారు. తన ఎనిమిదేళ్ల కాలంలోనే ఆయన ఏకంగా 96వేల కేసులను విచారించి తీర్పు తెలిపారు. ఇలా అత్యధిక కేసులు విచారించిన జడ్జ్ గా రికార్డ్ సృష్టించారు. 

అయితే 1993లో ఆయన లాయర్‌గా ప్రాక్టీసింగ్‌ చేస్తున్న క్రమంలో వాదించిన ఓ కేసుతో పాపులర్‌ అయ్యారు కె. చంద్రు. వామపక్ష భావజాలం కలిగిన ఆయన పేదలకు, గిరిజనుల కోసం పనిచేశారు. పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకుల చేత పీడించబడుతున్న, బాధింపబడుతున్న పేదల కోసం ఆయన పనిచేశారు. ఈ క్రమంలో 1995లో జరిగిన కేసుతోనే `జై భీమ్‌` సినిమాని తెరకెక్కించారు. ఈ కేసులో ఆయన ఏకంగా ప్రభుత్వంతోనే పోరాడారు. ఆ తర్వాత అనేక కేసుల్లో ఆయన స్వచ్చంగా వాదించి న్యాయం జరిగేలా చేశారు. 

అనగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. మానవహక్కుల కోసం డబ్బులు తీసుకోకుండా వాదించి ఎంతో మంది పీడిత వర్గాలకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. తాను వాదించిన తీర్పు ఇచ్చిన వాటిలో ఆలయాల్లో మహిళా పూజారుల నియామకం, కులం, మతంతో సంబంధం లేకుండా సామూహిక శ్మశానాలు వంటివి ఆయన ఇచ్చిన తీర్పుల్లో కీలకమైనవి. 

హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పటికీ.. హంగులు, ఆర్భాటాలకు మాత్రం దూరంగా ఉండేవాడు. తాను ప్రయాణించే కారుకు ఎర్రబుగ్గని తొలగించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. అలాగే వ్యక్తిగత భద్రతను కూడా వదులుకున్నారు. కె చంద్రు రిటైర్డ్‌ సమయంలో కోర్టు అవరణలోనే విడ్కోలు చెప్పి, ప్రభుత్వం ఇచ్చిన కారును వదిలేసి లోకల్‌ ట్రైన్‌లో ఇంటికి వెళ్లారు. అంత సింపుల్‌సిటీ చంద్రు సొంతం. 

 లాయర్‌గా, న్యాయమూర్తిగా తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతో `లిజన్ టు మై కేస్` అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకంలోని ఓ కథనే `జై భీమ్‌` సినిమా స్టోరీ. సూర్య నటనకు, ఈ కథని నమ్మి ఆయన నటించడంతోపాటు నిర్మించడం పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. రియలిస్టిక్‌గా తీశారంటూ అభినందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సినిమా అమెజాన్ ప్రైమ్‌ విజయవంతంగా రన్‌ అవుతుంది. 

also read: Jai Bhim: 'జై భీమ్' మూవీపై సీపీఐ నారాయణ కామెంట్స్..37 ఏళ్ల క్రితం తిరుపతిలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది

also read: `జై భీమ్‌`లో సినతల్లి ఎవరో తెలుసా?.. ఆమె నేపథ్యం, స్టడీస్‌ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

click me!