
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వస్తున్నాడని తెలిస్తే లక్షల సంఖ్యలో అభిమానులు తారక్ ఈవెంట్లకు చేరుకుంటుంటారు. ఎన్టీఆర్ కోసం ఎంత రిస్క్ అయినా చేయడానికి వారు వెనకాడరు. అందుకే తారక్ కూడా ఫ్యాన్స్ ఇబ్బందులు గుర్తించి ఈ మధ్య పెద్దపెద్ద ఈవెంట్లు చేయడం మానేశారు. వరంగల్ లో ఓ అభిమాని మరణం ఎన్టీఆర్ ను కలచివేసింది. దాంతో పెద్ద ఈవెంట్లు నిర్వహించడంలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వార్ 2 ఈవెంట్ లో ప్రస్తావించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు దేశవిదేశాల్లో అభిమానులున్న సంగతి తెలిసిందే. తారక్ కోసం పలు సందర్భాల్లో వారు ఇండియాకు వచ్చిన సంఘటనల గురించి కూడా చూస్తూనే ఉన్నాం.
ఈక్రమంలోనే ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలతో జపాన్ అభిమానుల మనసు దోచేశాడు. జపాన్ లో తారక్ క్రేజ్ అంతా ఇంతా కాదు. జపాన్లో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ఎన్నో సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఎన్టీఆర్ సినిమా అంటే వారు వదలకుండా చూస్తారు. తారక్ ఫ్యాషన్ ను కూడా అక్కడ ఫాలో అవుతారు. ఎన్టీఆర్ మీద వారికి ఎంత అభిమానం ఉందంటే, ఆయన సినిమా చూడటానికి లక్షలు ఖర్చుపెట్టి ఇండియాకు వచ్చేంతగా. రీసెంట్ గా ఓ అభిమాని జపాన్ నుంచి తారక్ సినిమా చూడటం కోసం ఇండియాకు వచ్చింది. అది కూడా ఒక మహిళ సొంత ఖర్చులతో ఇండియాకు వచ్చి, ఎన్టీఆర్ సినిమా చూసి వెళ్లింది. ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా 'వార్-2'ను వీక్షించేందుకు క్రిసో అనే జపనీస్ యువతి జపాన్ నుంచి ఇండియాకు ప్రయాణించింది.
ఇటీవల ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రిసో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ధరించిన టీ-షర్ట్పై ఎన్టీఆర్ ఫొటో ముద్రించబడింది. విమానాశ్రయంలో పలువురు ఆమెను పలకరించగా, తాను ఎన్టీఆర్కు వీరాభిమానినని, ప్రత్యేకంగా 'వార్-2' సినిమా థియేటర్లోనే చూడాలని భారత్కు వచ్చానని వెల్లడించింది.క్రిసో తెలిపిన ప్రకారం, ఇది ఆమెకు తొలిసారి కాదు. గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాల కోసం ఇండియాకు వచ్చానని పేర్కొంది. తారక్ సినిమాలన్నింటిని ప్రేమతో చూస్తానని, ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు కూడా తప్పకుండా భారత్కు వస్తానని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
'ఆర్ఆర్ఆర్' సినిమాతో జపాన్లో ఎన్టీఆర్కు భారీ అభిమాన బేస్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అనంతరం వచ్చిన 'దేవర' సినిమా సమయంలో ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకుని ఎన్టీఆర్ గురించి మాట్లాడిన వీడియోను స్వయంగా ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. ఇప్పుడు 'వార్-2' కోసం మరో అభిమాని దేశం దాటి రావడం ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్ను మళ్లీ రుజువు చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఎన్టీఆర్ అభిమానులు "ఇది ఆయనకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపుకు నిదర్శనం" అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను మరింతగా వైరల్ చేస్తున్నారు.
ఇక భారీ అంచనాల నడుమ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'వార్-2' సినిమా రిలీజ్ అయ్యింది. ఈసినిమాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించారు. బాలీవుడ్ లో, సౌత్ లో భారీ రెస్పాన్స్ ను రాబడుతుందని అనుకున్నారు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను పొందింది. అయినా, ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి సన్నివేశాల కోసం అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.