
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో సాగర్ విషయం మొత్తం నర్మదకు తెలిసిపోతుంది. 20 లక్షల ఏం చేశావని గట్టిగా నిలదీస్తుంది నర్మద. దాంతో సాగర్ ఆ 20 లక్షలు, రైస్ మిల్లులో ఐదు లక్షలు కలిపి జాబ్ కొన్నానని చెబుతాడు. దాంతో కోపం వచ్చి లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది నర్మద. ‘నీ జాబ్ గురించి మా ఆఫీసు వాళ్ళు అడిగినప్పుడు నీలో తడబాటు, డబ్బు గురించి మీ నాన్న అడిగినప్పుడు టెన్షన్ చూస్తే నాకు డౌట్ వచ్చింది. అందుకే బ్యాంకులో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ ని అడిగి కన్ఫామ్ చేసుకున్నాను. సిగ్గుతో తలదించుకోవడం కాదు.. నువ్వు చేసిన దానికి నీ మీద నువ్వే ఉమ్మేసుకో. వనజగారు ఇచ్చిన డబ్బులు ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం? ఆల్రెడీ అమూల్య విషయంలో ఆ వనజా వాళ్ళు ఎంత పెద్ద గొడవ చేసారో నీకు తెలుసు. పరువు పోయి మీ నాన్నగారు చావు అంచులు దాకా వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళు డబ్బులు కొట్టేసిన దొంగ అని మాట్లాడతారు. మరొకసారి పరువు పోతే మీ నాన్నగారు ప్రాణాలతో ఉంటారా? డబ్బు తీసుకునేటప్పుడు ఇవేవీ గుర్తుకు రావా? సిగ్గులేదా? వాళ్లకి ఇవ్వాల్సిన 20 లక్షలని ఏ విధంగా ఇద్దామనుకుంటున్నావు? ఏ ధైర్యంతో ఆ డబ్బులు ముట్టుకున్నావ్? నీకు బుద్ధి జ్ఞానం లేదా? నేను ఫోర్స్ చేయడం వల్ల నువ్వు రైస్ మిల్లు వదిలేసి జాబ్ చేస్తున్నావని మీ వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేనే ఆ డబ్బుతో నీకు జాబ్ కొనిచ్చానని నన్ను ఇంకా అపార్థం చేసుకుంటారు. నేను పుట్టింటిని వదిలేసుకుని వచ్చాను. కానీ చివరికి నువ్వు మెట్టినిల్లు కూడా లేకుండా చేశావు. ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను’ అని కోపంగా బట్టలు తీసి సూట్ కేసులో సర్దుకుంటూ ఉంటుంది నర్మద.
సాగర్ ఎంతో ప్రయత్నం చేసి నర్మదను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ నర్మద ఆగదు. దానితో సాగర్ నువ్వు గుమ్మం దాటిన మరుక్షణమే నేను ప్రాణాలు తీసుకుంటాను అని అంటాడు. దానితో నర్మద ఏంటి? బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అడుగుతుంది. ‘డబ్బులు కోసం మా నాన్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇప్పటికే టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఈ కష్ట సమయంలో నాకు అండగా ఉండాల్సిన నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే.. నేను ఏ ధైర్యంతో బతకాలి. ఈ సమస్య నుంచి బయటపడడానికి నాకు చావు తప్ప ఇంకేమీ ఆప్షన్ లేదు’ అని అంటాడు సాగర్. తెలిసో తెలియకో తప్పు చేశాను.. ప్రస్తుతం నేను బతికి ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంది అంటూ నర్మద కాళ్లు పట్టుకుంటాడు సాగర్. ఈ గండం నుంచి నన్ను బయట పడేయని ప్రాధేయపడతాడు. నర్మద కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. సాగర్ మాత్రం ఆ సమస్య నుంచి బయట పడేయమని అడుగుతూనే ఉంటాడు.
ఇక్కడ నుంచి సీన్ ధీరజ్ దగ్గరికి మారుతుంది. ఆస్పత్రిలో ఎమర్జెన్సీ అని ధీరజ్ స్నేహితులు కార్ తీసుకొని వెళతారు. కారు ఇంకా తీసుకురాలేదేంటి అనుకుంటూ ఉంటాడు ధీరజ్. కారు తీసుకెళ్లిన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ధీరజ్కు టోకరా వేసి కారు భలే తెచ్చామని మాట్లాడుకుంటారు. సెంటిమెంటల్ ఫెలో, అమ్మానాన్న అంటే అప్పు చేసి మరీ డబ్బు ఇస్తాడు అని మాట్లాడుకుంటారు. అదే సమయంలో ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాడు. కానీ వారు ఫోను కావాలనే లిఫ్ట్ చేయరు. తర్వాత వాళ్లు ఫోన్ స్విచాఫ్ చేసేస్తారు. దాంతో ధీరజ్ కంగారు పడుతూ ఉంటాడు. ప్రేమ అదే సమయంలో అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతుంది. ‘ఆ కిషోర్ గాడు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి కారును తీసుకెళ్లాడు.. మొదట అమ్మ నాన్నకి బాలేదని చెప్పాడు, వాడు రానీ చెబుతాను’ అంటాడు ధీరజ్. ప్రేమ ‘వాడు వెధవని తెలిసి కూడా.. వాడి అబద్దాలు నమ్మి కారిచ్చావు కదా.. నీకు బుద్ధి లేదు’ అని తిడుతుంది. దీంతో ధీరజ్, ప్రేమ కాసేపు గిల్లికజ్జాలు పెట్టుకొని చిన్న చిన్న గొడవలు పడతారు.
ఇక్కడ నుంచి సీన్ సేనాపతి ఇంటికి మారుతుంది. ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది సేనాపతి భార్య రేవతి. అమూల్య కూడా అక్కడికి వస్తుంది. ఆశగా తన పుట్టింటి వైపు చూస్తూ ఉంటుంది. అమూల్య అలా నిల్చుని పుట్టింటి వైపు చూడడం వల్లి చూసి భయపడుతుంది. ‘పుట్టింటి వైపు అలా చూస్తుందేటి? అందరిని పిలిచి నా గురించి చెప్పేస్తుందా’ అనుకుంటుంది. ఎలాగైనా అమూల్యతో మాట్లాడాలి, తన మనసులో ఏమనుకుంటోంది, తాళిబొట్టు వేసుకోమన్న ఐడియా ఎవరిచ్చారో కనుక్కోవాలి.. అని అమూల్య దగ్గరికి వస్తుంది.
వల్లి తెలివిగా రేవతిని లోపలికి పంపించి అమూల్యతో మాట్లాడుతుంది. ముగ్గు వేస్తూ మాట కలుపుతుంది. ‘ముగ్గు గోల పక్కన పెట్టు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అమూల్య. ఇంట్లో ఎలా ఉంది? ఏం జరుగుతుంది?’ అని అడుగుతుంది. ‘ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు నన్ను తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్లిపోయావు’ అంటుంది అమూల్యం. దానికి వల్లి ‘అలా గట్టిగా మాట్లాడకు. ఎవరైనా వింటే నా కాపురం కూలిపోద్ది. నేను ఏమైనా కావాలని చేశానా... అందరం కలిసే కదా అనుకుని వెళ్ళాము. ఆ బండోడు అలా చేస్తాడని నాకేం తెలుసు’అంటుంది వల్లి.
‘అవును అమూల్య.. నీకు వాడంటే అసలు ఇష్టం లేదు కదా, నీ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు కదా, మరి పెళ్లి ఎలా జరిగింది? నువ్వే ఇష్టంతో చేసుకున్నావా? ఎందుకు చేసుకున్నారు? ఈ పెళ్లి దీని వెనుక అసలు ఎవరున్నారు?’ అని అడుగుతుంది వల్లి. అదే సమయానికి ప్రేమ వీరిని చూస్తుంది. వల్లిని గట్టిగా పిలిచి ‘ఏంటి అమూల్యతో ఏం మాట్లాడుతున్నావ్? ఆ గీత దాటి ఎందుకు వెళ్లావు? నువ్వు ఏ రేంజ్ లో తనను ముగ్గులోకి దించావో మాకు తెలుసు. ముగ్గు నేర్పించాల్సిన అవసరం లేదు’ అని చెబుతుంది ప్రేమ. దీంతో వల్లి అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్లిపోతుంది.
తర్వాత ప్రేమ ‘ఆ వల్లీ ఏం అడుగుతోంది’ అని అమూల్యని ప్రశ్నిస్తుంది. ‘అదే వదిన ఈ పెళ్లి ఎలా చేసుకున్నావు? ఎందుకు చేసుకున్నావు? అని అడుగుతుంది’ అంటుంది అమూల్య. అప్పుడు ప్రేమ ‘నువ్వు తాళిబొట్టు మెడలో వేసుకున్న సంగతి దానికి చెప్పావంటే మొత్తం గందరగోళం అయిపోతుంది. మామయ్య, ధీరజ్ కి చెప్పేస్తుంది. వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో అని నాకు టెన్షన్ గా ఉంది. ఎవరికి చెప్పినా కూడా వల్లికి మాత్రం చెప్పకు. సమయం వచ్చినప్పుడు దానంతట అదే బయటపడుతుంది’ అని చెబుతుంది.
తర్వాత అమ్మ నాన్న ఎలా ఉన్నారని అడుగుతుంది అమూల్య. ‘మామయ్య గారు బాగానే ఉన్నారు. అన్ని సర్దుకుపోతాయి. నువ్వేం టెన్షన్ పడకు. ముందు ఆ ఇంట్లో జాగ్రత్తగా ఉండు. మా అన్నయ్య ఏదో ఒకటి నీపై ప్లాన్ చేస్తాడు. నీకు ఏదైనా జరిగిందంటే అప్పుడు మీ అమ్మ నాన్న బాధపడతారు. వాళ్ళ చేతిలో నీకేం జరగకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది’ అని చెబుతుంది ప్రేమ. ఈలోపు ధీరజ్ గాభరగా పడుతూ ఫోన్లో మాట్లాడుతూ బయటికి వస్తాడు. ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి ఏమైందని అడుగుతుంది. నా ఫ్రెండ్స్ కారుతో చెట్టు గుద్దేశారట అని చెబుతాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.