
యాంకర్ శ్యామల.. చిత్ర పరిశ్రమలో క్లీన్ ఇమేజ్ ఉంది. ఆమె యాంకర్గా బాగా రాణిస్తున్నారు. ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. పర్సనల్ విషయాలో అప్పట్లో వార్తల్లో నిలిచిన ఆమె ఇటీవల కాలంలో యాంకర్గా మెప్పిస్తుంది. అడపాదడపా సినిమాల్లోనూ మెరుస్తుంది. ఇలా సినిమాల్లో బిజీగా ఉన్న శ్యామల ఇటీవల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఏపీ ఎన్నికల సమయంలో ఆమె కామెంట్స్ దుమారం రేపాయి.
యాంకర్ శ్యామల వైసీపీకి సపోర్ట్ చేసింది. ఆ పార్టీ నాయకులకు సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించింది. ముఖ్యంగా జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆమె పిఠాపురంలో ప్రచారం నిర్వహించింది. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపుకోసం ఆమె ఎంతో శ్రమించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. పవన్ చేసిన సేవ చూడలేని, ఆయనలో ఆవేశం ఎక్కువ అని, అరవడం మాత్రమే చూశానని సేవ చేయడం చూడలేదని చెప్పింది. ప్రచారంలో ఇంకా డోస్ పెంచి మాట్లాడింది.
కానీ ఎన్నికల ఫలితాలు రివర్స్ వచ్చాయి. అధికార వైసీపీ ఘోర పరాజయం చెందింది. కేవలం 11 సీట్లకే పరిమితమయ్యింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 గెలుపొంది సంచలన విజయం సాధించారు. పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్.. వంగా గీతపై విజయం సాధించారు. అదే సమయంలో పవన్ జనసేన పార్టీ 21 సీట్లు పోటీ చేస్తే మొత్తం గెలవడం విశేషం. దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల తలొగ్గింది. ఓటమిని అంగీకరిస్తూ వీడియో విడుదల చేసింది. అంతేకాదు తనని కొందరు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, చాలా భయంగా ఉందని వాపోయింది. తాను తప్పుగా మాట్లాడలేదని, ఉన్నదే మాట్లాడానని, ఎవరిని వ్యక్తిగతంగా కామెంట్ చేయడం తన ఉద్దేశ్యం కాదని, అలా తాను వ్యాఖ్యానించలేదని, రాజకీయంగా మాత్రమే తాను విమర్శలు చేసినట్టు చెప్పింది. కానీ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, భయమేస్తుందని చెప్పింది యాంకర్ శ్యామల.
ఇందులో యాంకర్ శ్యామల మాట్లాడుతూ, వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త, వైసీపీ కుటుంబానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది. `ఓడిపోయాం కానీ.. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గెలిచినప్పుడు ఏనాడూ విజయ గర్వంతో విర్రవీగలేదు. ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు. అలాగే ఈసారి వైఎస్ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని.. మీ అందరి మద్దతుతో గెలుస్తారు. మనం అందరం ఆయన వెంట నడిస్తే మంచి ప్రభుత్వంగా ఏర్పాటవుతాం. ఎప్పటికీ జగన్ అన్నతోనే ఉంటా. ఈ ఐదేళ్లు ఏపీకి మంచి జరగాలని కోరుకుంటున్నా` అని చెప్పింది శ్యామల.
ఈ సందర్భంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, బీజేపీ నాయకులకు శ్యామల అభినందనలు తెలిపింది. ఇందులో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పింది. `కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. ఒక రకంగా భయమేస్తోంది. మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది. అలా అని మీకు నచ్చంది నాకు నచ్చిందని నేను బతకడానికి వీల్లేదంటే చాలా అన్యాయం. దయచేసి ఏదీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను ఎవరినీ వ్యక్తిగతంగా అనలేదు. ఎవరిపై వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదు. మీరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించేందుకు ఎంత చేయాలో అంత చేశా, అప్పుడు కూడా ఉన్నదే చెప్పాను. లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా` అని వెల్లడించింది శ్యామల. ఈ వీడియోపై టీడీపీ జనసేన కార్యకర్తలు స్పందించి కౌంటర్లు వేస్తున్నారు. సింపతీ గేమ్ ఆడుతుందని కౌంటర్లు వేస్తున్నారు. ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు అభిమానులు.