
హీరో రాజశేఖర్ ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. వరుస ఫెయిల్యూర్స్ కారణంగా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హీరోగా చేయలా? లేక క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకోవాలా? అనే డైలామాలో ఉన్నారు. ఆ మధ్య నితిన్ హీరోగా వచ్చిన `ఎక్స్ ఆర్డినరీ మ్యాన్` చిత్రంలో ముఖ్య పాత్రలో నటించారు. పోలీస్ ఆఫీసర్గా నటించి ఆకట్టుకున్నారు. కానీ సినిమా ఆడకపోవడంతో ఆయన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇప్పుడు చాలా సెలక్టీవ్గా వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఓ రీమేక్ మూవీతో రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. తమిళంలో ఆకట్టుకున్న మూవీ రీమేక్ చేస్తున్నారని, అలాగే రెండు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. శర్వానంద్ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్. వీటికి సంబంధించిన అప్ డేట్స్ రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే రాజశేఖర్కి సంబంధించిన ఒక క్రేజీ విషయం బయటకు వచ్చింది. ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భావోద్వేగభరితంగా ఉన్నాయి. తన లైఫ్ అయిపోయిందని, ఇక తాను లేవలేనని, నడవలేనని భావించారట. అంతేకాదు ఇకపై సినిమాలు చేయలేనని అనుకున్నారట. ఓ దశలో చాలా లో అయిపోయారట. ఇంటికే పరిమితమవుతానేమో అని ఆందోళన చెందారట. ఆ సమయంలో డాక్టర్స్ తనని సేవ్ చేశారని, కోలుకునేలా చేశారని చెప్పారు. అంతేకాదు సినిమాపై ఉన్న ఇష్టం, ప్రేమ, అభిమానుల ప్రార్థనల వల్లే తాను మళ్లీ కోలుకున్నానని, సినిమాలు చేయగలుగుతున్నానని వెల్లడించారు. రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ షాక్ గురి చేస్తున్నాయి. మరి ఇంతకి రాజశేఖర్ అలా ఎందుకు అన్నారు. ఆయనకు ఏం జరిగింది? అనేది చూస్తే.
రాజశేఖర్ ఐదేళ్ల క్రితం అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అప్పట్లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో హీరో రాజశేఖర్కి చాలా సీరియస్గా కరోనా ఎటాక్ అయ్యింది. ఆయన చాలా రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా వచ్చింది. జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మికలు కోలుకున్నారు. కానీ రాజశేఖర్ మాత్రం చాలా రోజులు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ మీడియా వెల్లడించింది. అయితే అలాంటి పరిస్థితుల్లో బెడ్పై ఉన్న స్థితిలో రాజశేఖర్ మనసులో కలిగిన ఫీలింగ్స్ ని, ఆయన మదన పడ్డ విషయాలను పంచుకున్నారు.
కరోనా నుంచి కోలుకుని మామూలు స్థితికి వచ్చాక `శేఖర్` అనే సినిమా చేశారు రాజశేఖర్. ఈ సమయంలో గ్రేట్ ఆంధ్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటని వెల్లడించారు. `నేను ఆసుపత్రిలో బెడ్పై ఉన్నప్పుడు ఎక్కడ సినిమా చేయలేనేమో అనుకున్నా. ఇకపై నడవడానికి కూడా కష్టంగా ఉంటది. మనం ఎప్పుడు కోలుకుంటాము. అంతే ఇక మన లైఫ్ అయిపోయిందనుకున్నా. అలాంటి స్థితిలో డాక్టర్లు నన్ను ఎంకరేజ్ చేసిన విధానం, మానసికంగా, శారీరకంగా నన్ను ప్రోత్సహించిన విధానంతో కోలుకున్నాను. మానసికంగా తాను మళ్లీ నార్మల్ కావడానికి చాలా రోజులే పట్టింది. ఫైనల్గా నార్మల్ అయ్యాను. మళ్లీ సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు అంతా హ్యాపీ` అని తెలిపారు రాజశేఖర్. శేఖర్ మూవీ టైమ్లో ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారడం విశేషం.
ఇక తన ఇంట్లో ఎవరి డామినేషన్ ఉంటుందనే విషయాన్ని ఐడ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతూ, బయటకు మాత్రం జీవిత డామినేషన్ ఉంటుందని, ఆమె చెప్పిందే నేను చేస్తానని అనుకుంటారు. కానీ రియాలిటీ అందుకు పూర్తి భిన్నం. నా డామినేషనే ఉంటుంది. నేను అనుకున్నదాన్ని ఆమె చేసి పెడుతుంది. నాకు నచ్చిన సినిమాలే చేస్తాను. నచ్చకపోతే నో చెబుతా. ఇది నచ్చింది. ఇలా కావాలంటే అలా జీవిత చేస్తుంది. దానికి కావాల్సిన అన్నీ ఆమె సమకూరుస్తుంది. ఫ్యామిలీ విషయాలను నేను పట్టించుకోను. అంతా జీవితనే చూసుకుంటుంది. నేను సినిమాలు చేయడం, వర్కౌట్ చేయడం, హాయిగా నిద్రపోవడం మాత్రమే చేస్తాను. డాక్టర్గా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటాను. అంతే తప్ప మిగిలిన అన్ని విషయాలు జీవితనే చూసుకుంటుంది` అని తెలిపారు రాజశేఖర్.