Gunturkaaram
సూపర్ స్టార్ మహేష్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో చాలా గ్యాప్తో `గుంటూరు కారం` చిత్రం రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. అన్ని కమర్షియల్ అంశాల మేళవింపుతో సినిమా సాగుతుందని ట్రైలర్ని చూస్తే అర్థమవుతుంది. మాస్, క్లాస్, సెంటిమెంట్, ఎమోషన్స్, లవ్, రొమాన్స్, కామెడీ ఇలా అన్నీ మిక్స్ చేసి తాళింపు వేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. దీనితో సంక్రాంతి సినిమా అనిపించుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కాపీ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. యద్దనపూడి సులోచనారాణి రాసిన `కీర్తి కిరీటాలు` నవలకు కాపీ అంటూ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే దీనిపై టీమ్ రియాక్ట్ కాలేదు. కానీ ట్రైలర్ రావడంతో ఇది కచ్చితంగా `కీర్తి కిరీటాలు` నవల కాపీనే అని అంటున్నారు క్రిటిక్స్. సోషల్ మీడియాలో పుస్తక ప్రియులు సైతం దీన్ని ప్రూవ్ చేస్తున్నారు. ఇదే ఆధారాలు అంటూ నవలలోని అంశాలను ఎత్తిచూపుతూ, ట్రైలర్లోని అంశాలకు పోలుస్తూ అసలు నిజాన్ని బట్టబయలు చేస్తున్నారు.
ఇంతకి `కీర్తి కిరీటాలు` నవలలో ఏం చెప్పారు? త్రివిక్రమ్ `గుంటూరు కారం`లో ఏం చూపించాడు అనేది చూస్తే.. ఈ నవల కథలో.. రాజ్యలక్ష్మి ప్రముఖ గాయని, ఆమె విదేశాల్లో ఇరవై ఏళ్ళు ఉండి, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత పెంపుడు కొడుకు కిషోర్ ని తీసుకుని హైదరాబాద్ వచ్చేస్తుంది రాజ్యలక్ష్మి. ఆమె రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నిస్తుంటుంది. ఇక స్వర్ణ నృత్య కారిణి. ఆమె తల్లి ఇందిరాదేవి ప్రఖ్యాత నర్తకి. ఇందిరాదేవీ, రాజ్యలక్ష్మి స్నేహితులు. ఫ్రెండ్ కూతురుని చూసి ఆమెని తన అసలు కొడుకు తేజాకి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తుంది. తేజా చిన్నప్పుడే తనకు దూరం అవుతాడు. దీంతో ఊర్లో తాత వద్ద పెరుగుతాడు. చదువు పెద్దగా అబ్బరు.
స్వర్ణని తేజాకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల కొడుకుకి దగ్గర కావచ్చనేది ఆమె అభిప్రాయం. ఆ ప్రయత్నాల్లో ఉంటుంది. అయితే స్వర్ణ తన పెంపుడు కొడుకు కిషోర్తో చనువుగా ఉంటుంది. అది రాజ్యలక్ష్మికి నచ్చదు. ఇందిరాదేవికి ఈ విషయం తెలిసినా ఏమాత్రం పట్టించుకోకుండా, కూతురు కిషోర్ తో సన్నిహితంగా మెలగడాన్ని ప్రోత్సహిస్తుంది. చదువు లేకుండా ఎక్కడో పల్లెటూళ్ళో ఉంటున్న తేజాని పెళ్లి చేసుకోవడం స్వర్ణ భవిష్యత్తుకి అడ్డంకి అవుతుందన్నది ఆమె భయం. పైగా, కిషోర్ స్వర్ణ నాట్య ప్రదర్శనలకి ఎంతో సాయం చేస్తూ ఉంటాడు. ఆమెని ప్రముఖ నర్తకిగా చూడాలన్నది అతని కోరిక కూడా.
విజయవాడ పక్కనే ఉన్న పల్లెటూళ్ళో తాతగారు వెంకటాచలంతో ఉంటున్న తేజా ఈ ప్రపంచంలో ద్వేషించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది తల్లి రాజ్యలక్ష్మి. ఆమె పేరు వినబడడం కూడా ఇష్టం ఉండదు అతనికి. పెద్దగా చదువుకోని తేజా, ఇంటికి దగ్గరలో ఓ చెక్క బొమ్మల పరిశ్రమ పెట్టి ఊళ్ళో వాళ్లకి ఉపాధి కల్పిస్తూ ఉంటాడు. అనుకోకుండా స్వర్ణ నృత్య ప్రదర్శన చూసి, ఆమె ఎవరో తెలిశాక ఆమె మీద ఇష్టాన్ని పెంచుకుని కూడా లోలోపలే దాచుకున్న తేజా స్వర్ణ-కిషోర్ ల నిశ్చితార్ధం తర్వాత ఆమెని పూర్తిగా మర్చిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రాజ్యలక్ష్మి గతం, స్వర్ణ భవిష్యత్తు ఏమిటన్నవి నవల ముగింపు.
`గుంటూరు కారం` చిత్రంలో కూడా ఇలాంటి సన్నివేశాలే కనిపిస్తున్నాయి. ట్రైలర్ని బట్టి ఇది అర్థమవుతుంది. ఇందులో రమ్యకృష్ణ చిన్నప్పుడు కొడుకు రమణ(మహేష్బాబు)ని వదిలేసి వస్తుంది. రెండో పెళ్లి చేసుకుని ఆమె సిటీకి వస్తుంది. కట్ చేస్తే ఆమె రాజకీయాల్లో రాణిస్తుంటుంది. ట్రైలర్ ప్రారంభంలో మీడియా ప్రతినిధి కొడుకు ప్రస్తావన తీసుకొస్తాడు. ఆ తర్వాత మహేష్బాబు ఓ మార్కెట్ యార్డ్ లో మాస్ ఎంట్రీ ఇస్తాడు. చివర్లో రమ్యకృష్ణని చూసి ఆగిపోతాడు మహేష్బాబు. ఈ సన్నివేశాలు చూస్తుంటే `కీర్తి కిరీటాలు`కి కాపీనే అని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో రాజ్యలక్ష్మి పాత్రలో రమ్యకృష్ణ, తేజా పాత్రలో మహేష్బాబు కనిపిస్తారని, కిషోర్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక స్వర్ణ పాత్రలో శ్రీలీల కనిపిస్తారట. తండ్రి పాత్రలో జయరాం కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.
Guntur Kaaram trailer
అయితే త్రివిక్రమ్.. యద్దనపూడి సులోచనారాణి రచనలకు పెద్ద అభిమాని. ఈ క్రమంలో ఈ నవల నుంచి ఇన్స్పైర్ అయిన ఈ సినిమా చేసి ఉంటాడని అంటున్నారు. అంతేకాదు గతంలో `అ ఆ` సినిమాని కూడా ఆమె `మీనా` నవల ఆధారంగా తీశారనే వార్తలొచ్చాయి. పెద్ద వివాదంగానూ మారింది. ఆ తర్వాత ఆమెతో సెటిల్ చేసుకున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు `గుంటూరు కారం` కూడా ఆమె నవల నుంచే కాపీ కొట్టారని ఇలా స్టోరీతో పోలుస్తూ నిరూపిస్తున్నారు పుస్తక ప్రియులు. పైగా దీనిపై టీమ్ స్పందించకపోవడంతో ఇది నిజమనే వాదనకు బలం చేకూరుతుంది.
ఇదిలా ఉంటే `గుంటూరు కారం` చిత్రంతో.. మమ్ముట్టి నటించిన `రాజ్యమాణిక్యం`తో పోలికలున్నాయని మరికొందరు తెరమీదకు తీసుకొస్తున్నారు. అందులో.. తండ్రి మరణంతో రాజమాణిక్యాన్ని అతడి తల్లి ముత్తులక్ష్మి చిన్నప్పుడే వదిలేస్తుంది. వ్యాపారవేత్త రాజారత్నం పిళ్లైని పెళ్లి చేసుకుంటుంది. తన తల్లిని వెతుక్కుంటూ ఆమె ఇంటికి రాజమాణిక్యం వెళ్తాడు. కానీ కొడుకుని అంగీకరించదు. నిజం తెలుసుకున్న రాజారత్నం పిళ్లై కొడుకుని ఆదరిస్తాడు. ఇది కమర్షియల్ ఎంటర్టైనర్గా 2005లో రూపొంది అక్కడ పెద్ద విజయం సాధించింది. దీంతో ఈ చిత్రంతోనూ `గుంటూరు కారం`కి పోలికలున్నాయని చెబుతున్నారు క్రిటిక్స్. మరి దీనిపై త్రివిక్రమ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.