
ఈ సంక్రాంతికి తెలుగులో ఐదు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో శర్వానంద్ హీరోగా వచ్చిన `నారీ నారీ నడుమ మురారి` మూవీ ప్రత్యేకతని సంతరించుకుంది. ఈ సినిమా అన్నింటికంటే చివర్లో విడుదలయ్యింది. కానీ అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. సంక్రాంతికి బాగా నవ్వించిన చిత్రంగా నిలిచింది. ఓ రకంగా చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` కంటే కూడా దీనికే ఎక్కువగా పేరు వచ్చింది. కానీ థియేటర్లు తక్కువగా ఉండటంతో కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి. `నారీ నారీ నడుమ మురారి` మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యిందట. ఇప్పటికీ డీసెంట్ నెంబర్స్ తో రన్ అవుతుంది.
సినిమా విజయం సాధించిన నేపథ్యంలో, హీరో శర్వానంద్ మీడియాతో ముచ్చటించారు. తన సినిమాపై బాలకృష్ణ స్పందించారట. ఆయన ప్రశంసించినట్టు తెలిపారు. తన పేరు నిలబెట్టావని చెప్పారట. `నారీ నారీ నడుమ మురారి` అనేది బాలకృష్ణ సినిమా పేరు. అప్పట్లో సంచలన విజయం సాధించింది. బాలయ్యని ఆడియెన్స్ కి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసింది. తన కెరీర్లో నిలిచిపోయే చిత్రమవుతుంది. అదే పేరుతో ఇప్పుడు శర్వానంద్ `నారీ నారీ నడుమ మురారి` సినిమా చేశారు. హిట్ కొట్టారు. దీనికి వస్తోన్న రెస్పాన్స్ ని చూసి బాలయ్య స్పందించారట. `నారీ నారీ నడుమ మురారి` వంటి గొప్ప సినిమా పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరు నిలబెట్టకపోతే బాగుండదు. నిన్న బాలకృష్ణగారితో మాట్లాడాను. ఎంతో అభినందించారు. `నా పరువు నిలబెట్టావ్ శర్వా` అని అన్నారు. దీంతో నేను ఊపిరి పీల్చుకున్నా` అని తెలిపారు శర్వానంద్.
సినిమా రిజల్ట్ పై స్పందిస్తూ, ప్రతి సినిమా హిట్ కొట్టాలనే కష్టపడి పని చేస్తాం. అనుకున్న రిజల్ట్ రావడం చాలా ఆనందాన్నిచ్చింది. అన్ని సినిమాలు కథ బాగుంటేనే చేస్తాం. అయితే అన్ని కుదిరినప్పుడే అది వర్క్ అవుట్ అవుతుంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో కలిస్తే బడ్జెట్లు పెరగవు. మంచి సినిమాలు బడ్జెట్లో తీయొచ్చు. ప్రతి సినిమా బాగా తీయాలని కూర్చుంటే అన్ని సినిమాలు బాగుంటాయి.
ఈ సంక్రాంతికి చాలా పెద్ద లాంగ్ వీకెండ్స్ కలిసి వచ్చాయి. 23 నుంచి 26 వరకు మళ్లీ పెద్ద వీకెండ్ ఉంది. మేము కంటెంట్ నీ బలంగా నమ్మాము. సంక్రాంతి సీజన్లో ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఆ నమ్మకం మాకు నిజమైంది. ఇప్పుడు థియేటర్స్ పెరుగుతున్నాయి. సినిమాకి చాలా మంచి లాంగ్ రన్ ఉంటుంది. నేను ఒక జానర్ కి పరిమితం అవ్వాలని అనుకోలేదు. ప్రతి సినిమా కొత్తగా చేయాలి కొత్త కథలు చేయాలని తపన ఉంటుంది` అని చెప్పారు శర్వా.
తన ఫిట్నెస్, లుక్పై స్పందిస్తూ, నాకు `జాను` సినిమా సమయంలో యాక్సిడెంట్ జరిగింది. చాలా పెద్ద యాక్సిడెంట్ అది. ఆ తర్వాత నేను బరువు పెరిగాను. `శ్రీకారం`, `ఆడవాళ్లకు జోహార్లు` సినిమాల్లో నేను కాస్త లావుగా కనిపిస్తాను, ఆ లుక్ నాకే నచ్చదు. మనకు మనం నచ్చేలా ఉండాలని సంకల్పంతో మొదట వాకింగ్ చేయడం ప్రారంభించాను. తర్వాత రన్నింగ్, ఆ తర్వాత స్త్రెంత్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేశాను. తర్వాత యోగా చేశాను. అవన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ కి కారణం అయ్యాయి` అని చెప్పారు శర్వానంద్.
కొత్త సినిమాలపై స్పందిస్తూ, `బైకర్`లో రెండు రకాల క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫాదర్ రోల్. దాని కోసం చాలా కష్టపడ్డాను. అవన్నీ కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి ఉపయోగపడ్డాయి. నిజానికి `బైకర్` సినిమా ముందుగా రావాలి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది రాలేదు. ఈ సినిమా ఇండియా మొత్తం గర్వపడే సినిమా అవుతుంది. తెలుగు సినిమా అని కాలర్ ఎగరేసుకొని చెప్పే మూవీ అవుతుంది. దీంతోపాటు సంపత్ నంది దర్శకత్వంలో `భోగి` మూవీ చేస్తున్నా. అలాగే శ్రీను వైట్ల డైరెక్షన్లో ఓ కామెడీ చిత్రం చేస్తున్నా` అని తెలిపారు శర్వానంద్.