2004లో టీమిండియా, పాక్-A టీమ్‌తో ఓడిపోయింది! ఇప్పుడేమో ఇలా తయారైంది... - పాక్ మాజీ కెప్టెన్..

First Published Oct 17, 2022, 5:24 PM IST

2023 ఆసియా కప్‌కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసింది. అయితే భారత జట్టు, పాక్ గడ్డ మీద అడుగుపెట్టలంటే భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంటుంది. దీంతో కేంద్రం ఈ విషయంపై ఎలా స్పందిస్తుంది, టీమిండియా.. ఒకటిన్నర దశాబ్దం తర్వాత పాక్‌లో అడుగుపెడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది...

చివరిసారిగా 2004లో పాకిస్తాన్‌లో పర్యటించింది టీమిండియా. ఈ పర్యటనలో ఐదు వన్డేలు, మూడు టెస్టులు ఆడింది. 1999 కార్గిల్ వివాదం తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ఇదే. 2003 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్, వన్డే సిరీస్‌లో 3-2 తేడాతో, టెస్టు సిరీస్‌ని 2-1 తేడాతో పరాజయం పాలైంది...

india vs pakistan 2003

అయితే పాక్‌లో అడుగుపెట్టిన తర్వాత పాకిస్తాన్-A టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. పాక్ ఏ టీమ్ చేతుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు, ఆ తర్వాత వన్డే, టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకుని సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చింది...

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 335 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 75, సచిన్ టెండూల్కర్ 76 పరుగులు చేయగా రాహుల్ ద్రావిడ్ 69 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

అయితే ఈ లక్ష్యాన్ని 24 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, పర్యాటన జట్టుకి షాక్ ఇచ్చింది పాకిస్తాన్ ఏ టీమ్. తాఫీక్ ఉమర్ 104, ఇమ్రాన్ నజీర్ 32 బంతుల్లో 65 పరుగులు చేశాడు. నజీముల్లా 35, ఫైసల్ ఇక్బాల్ 50, ఖైసిర్ అబ్బాస్ 38 పరుగులు చేశారు...

‘టీమిండియా 2004లో పాకిస్తాన్‌కి వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ A టీమ్ చేతుల్లో వాళ్లు ఓడిపోయారు. ఇప్పటికీ ఆ మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది. ఇమ్రాన్ నజీర్ ఆడిన ఇన్నింగ్స్ చాలా స్పెషల్. గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టును A టీమ్ ఓడించిందంటే అప్పుడు రిజర్వు బెంచ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు...

సౌతాఫ్రికా టూర్‌కి పాకిస్తాన్ A టీమ్స్‌తో కలిసి వెళ్లాను. అండర్ 19 టూర్లు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు అవేమీ లేవు. దీనికి ఎవరు బాధ్యులు. ఈ సిస్టమ్‌లో ఇన్ని మార్పులు తీసుకొచ్చింది ఎవరు? ఎవరిని నిందించాలి... ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ సమాధానాలు చెప్పే వాళ్లే కనిపించడం లేదు..’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.. 

click me!