ఐపీఎల్-2022 సీజన్ లో ఆడిన పది మ్యాచుల్లో ఏడు పరాజయాలతో ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇక తర్వాత ఆడబోయే మ్యాచులన్నీ నామమాత్రమే. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ తో ముగిసిన మ్యాచ్ లో కూడా చెన్నై ఓటమి పాలవడంతో ఆ జట్టు ప్లేఆఫ్ సీన్ నుంచి తప్పుకుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. సీఎస్కే ఓటములు, ఆ జట్టు కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీజన్ మొదట్లో ధోని చేసిన తప్పు వల్లే చెన్నైకి ఈ గతి పట్టిందని వీరూ అన్నాడు.
తాజాగా వీరూ ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో మాట్లాడుతూ... ‘ఐపీఎల్-15లో ధోని తప్పుకుని రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పడమే ఈ సీజన్ లో చెన్నై చేసిన మొదటి తప్పు. ఒకవేళ జడేజాకు కెప్టెన్సీ అప్పజెప్పినా అతడిని కొనసాగించాల్సి ఉంచితే బాగుండేది.
కానీ చెన్నై అదీ చేయలేదు. మధ్యలోనే 8 మ్యాచులకే రవీంద్ర జడేజా కు ఉద్వాసన పలికింది. అది చెన్నై చేసిన రెండో తప్పు. ఇక ఈ సీజన్ లో చెన్నై ఆటగాళ్ల ఆటతీరు ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు.
గతేడాది భీకర బ్యాటింగ్ తో దుమ్ము దులిపిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో తొలి భాగంలో పరుగులు చేయడానికే ఇబ్బంది పడ్డాడు. ఒకరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లదీ అదే పరిస్థితి. ఓ మ్యాచ్ లో ధోని (ముంబై ఇండియన్స్ తో) ఆడాడు. అంతే. మిగిలిన మ్యాచులలో అతడు కూడా విఫలమయ్యాడు.
ఈ సీజన్ ను చెన్నై ఓటములతోనే ప్రారంభించింది. భారీ ఆశలు పెట్టుకున్న బ్యాటర్లు చేతులెత్తేశారు. ఒకవేళ ధోని తొలుత వైదొలగకుండా అతడే సారథిగా కొనసాగి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండి ఉండేది. సీఎస్కే ఇన్ని మ్యాచులు ఓడి ఉండేది కాదు..’ అని తెలిపాడు.
బ్యాటర్ల తో పాటు చెన్నై బౌలింగ్ కూడా నామమాత్రంగానే ఉంది. ఈ సీజన్ లో ఆ జట్టులో బ్రావో మినహా గొప్పగా బౌలింగ్ చేసిన బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదు. ఇక స్పిన్ బాధ్యతలు మోసే రవీంద్ర జడేజా, మోయిన్ అలీ లు కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో చెన్నైకి పరాజయాలు తప్పడం లేదు.