ఛతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజా అవుట్, ఇషాంత్ శర్మకు రెస్ట్... మూడో టెస్టు బరిలో ఆ ఇద్దరు...

First Published Aug 22, 2021, 1:30 PM IST

రెండో టెస్టులో గెలిచి, టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించిన టీమిండియా... మూడో టెస్టులో మూడు మార్పులతో బరిలో దిగబోతున్నట్టు టాక్ వినబడుతోంది. మొదటి రెండు టెస్టుల్లో అద్భుతమైన ఆధిపత్యం చూపించినా... మూడో టెస్టులో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతోందట టీమిండియా...

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఫెయిల్ అయిన ఛతేశ్వర్ పూజారా, మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 13 బంతుల్లో మూడు ఫోర్లతో 12 పరుగులు చేసి ఆకట్టుకున్నా.. వర్షం కారణంగా ఐదో రోజు ఆట సాధ్యం కాలేదు..

రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరిన ఛతేశ్వర్ పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవడానికి 35 బంతుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది...

206 బంతులు ఎదుర్కొన్న పూజారా, 4 ఫోర్లతో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ జిడ్డు బ్యాటింగ్‌తో ఇంప్రెస్ కాని టీమిండియా మేనేజ్‌మెంట్, అతన్ని మూడో టెస్టు నుంచి పక్కనబెట్టాలని యోచిస్తోందట...

పూజారా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ లేదా పృథ్వీషాను ఆడించాలని ఆలోచిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఈ ఇద్దరూ...రెండో టెస్టులో మూడో రోజు నుంచి స్టేడియంలో మ్యాచ్ చూస్తూ కనిపించారు...

ఫామ్‌లో లేని పూజారాను ఆడించి, మరోసారి ఇబ్బంది పడేకంటే... ఫామ్‌లో ఉన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరినో ఒకరిని ఆడిస్తే, మంచి రిజల్ట్ దక్కుతుందని భావిస్తోంది టీమిండియా...

అలాగే బ్యాటింగ్‌లో రాణిస్తున్నా గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వికెట్ తీయలేకపోయిన రవీంద్ర జడేజా స్థానంలో భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడడం ఖాయంగా కనిపిస్తోంది...

రెండో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఆడాల్సి ఉన్నా, ఆఖరి నిమిషంలో అతనికి తుదిజట్టులో చోటు దక్కలేదు. మూడో టెస్టులో జడేజా స్థానంలో అశ్విన్ ఆడబోతున్నాడని, రెండు టెస్టుల్లో భారత ఫాస్ట్ బౌలర్లకు దొరకని జో రూట్‌ను నిలువరించేందుకు అశ్విన్‌ను అస్త్రంగా వాడాలని భావిస్తోందట బీసీసీఐ...

అలాగే రెండో టెస్టులో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్న భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు కూడా మూడో టెస్టులో విశ్రాంతి ఇవ్వనున్నారట... 

ఇషాంత్ శర్మ స్థానంలో తొలి టెస్టులో ఆకట్టుకున్న స్వింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను తిరిగి జట్టులోకి తేవాలని టీమిండియా భావిస్తోందట. 

శార్దూల్ ఠాకూర్ రీఎంట్రీతో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా పటిష్టంగా మారుతుందని ఆలోచిస్తోందట విరాట్ సేన...

click me!