ఒకవేళ ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కలిగిస్తే..? టీమిండియా పరిస్థితేంటి..!

First Published Nov 8, 2022, 6:58 PM IST

T20 World Cup 2022: తుది అంకానికి చేరుకున్న టీ20 ప్రపంచకప్  లో ఇంకా మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలున్నాయి.  సూపర్-12లు ముగిసిన నేపథ్యంలో ఇక రెండు సెమీస్ లు ఒక ఫైనల్ మాత్రమే మిగిలాయి. ఇందులో ఒక సెమీస్ భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరగాల్సి ఉంది. 

సుమారు మూడు వారాలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్.. చివరి దశకు చేరుకున్నది. ఈ టోర్నీలో ఇక మిగిలినవి మూడు మ్యాచ్ లే. సెమీఫైనల్స్ కు చేరిన భారత్ - ఇంగ్లాండ్, న్యూజిలాండ్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరగాల్సి ఉంది. బుధవారం న్యూజిలాండ్ - పాకిస్తాన్, గురువారం ఇండియా-ఇంగ్లాండ్ మధ్య  మ్యాచ్ జరుగనుంది. 

తొలి సెమీస్ సంగతి పక్కనబెడితే రెండో సెమీస్ లో తలపడబోయే ఇండియా-ఇంగ్లాండ్  మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అడిలైడ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ మీద  ఎవరి అంచనాలు వారికున్నాయి. రెండు పటిష్ట జట్ల మధ్య హోరాహోరి పోరు జరగడం  ఖాయమే. 

అయితే ఈ ప్రపంచకప్ లో  సూపర్-12 మ్యాచ్ లకు అంతరాయం కలిగించి  పలు అగ్ర జట్లకు షాకిచ్చి, సమీకరణాలు మార్చిన వరుణుడు  సెమీస్ లో  అడ్డుకుంటే..? ఇండియా - ఇంగ్లాండ్ మ్యాచ్ కు వర్షం వల్ల అంతరాయకం కలిగితే ఏంటి పరిస్థితి..?  లీగ్ దశలో మాదిరిగా చెరో పాయింట్ ఇచ్చే ఆప్షన్ ఇక్కడ లేదు. 

నవంబర్ 10న అడిలైడ్ లో ఇండియా - ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగాల్సి ఉంది.  గురువారం గనక మ్యాచ్ ప్రారంభమయ్యాక వర్షం కురిస్తే ఇరు జట్ల అభిమానులు చింతించాల్సిన పన్లేదు. ఎందుకంటే  సెమీస్, ఫైనల్స్ కు రిజర్వ్ డే ఉంది. 10న వర్షం పడితే 11న మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. 

ఒకవేళ 11న కూడా ఇదే సీన్ రిపీట్ అయితే మాత్రం కష్టమే. అప్పుడు వరుణుడు శాంతించి ఓ  మూడు గంటలు  ఆడుకోవడానికి టైమ్ ఇస్తే అప్పుడు మ్యాచ్ ను 10 ఓవర్లకు కుదించి ఆడిస్తారు. కానీ శుక్రవారం కూడా ఎడతెరిపి లేని వర్షం కురిసి అసలు మ్యాచ్  మొదలయ్యే పరిస్థితులు కూడా లేకుంటే మాత్రం అప్పుడు మ్యాచ్ ను రద్దు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. 

ఇలా జరిగితే మాత్రం  అది టీమిండియాకే ప్లస్ కానుంది.  రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకుంటే అప్పుడు ఫలితాన్ని గ్రూప్ లో పాయింట్లు, నెట్ రన్ రేట్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఆ విధంగా చూస్తే  ఇంగ్లాండ్ కంటే భారత్ నే విజయం వరించడం ఖాయం.   

గ్రూప్-2లో టాపర్ అయిన భారత్ లీగ్ దశలో ఐదు మ్యాచ్ లు ఆడి నాలుగు విజయాలు సాధించి  8  పాయింట్లతో ఉంది. కానీ ఇంగ్లాండ్ మాత్రం.. ఐదు మ్యాచ్ లలో 3 గెలిచి ఒకటి ఓడి (ఒకటి వర్షం వల్ల రద్దు) ఏడు పాయింట్లు మాత్రమే  సాధించింది. నెట్ రన్ రేట్ కూడా ఇంగ్లాండ్ (+0.473) కంటే ఇండియా +1.319) కే ఎక్కువుంది.  ఇలా చూసినా ఇండియాదే విజయం. మరి మ్యాచ్ ను వరుణుడు అడ్డుకుంటాడా..? లేక సజావుగా సాగనిచ్చి గ్రౌండ్ లోనే ఫలితం తేలుస్తాడా..? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. 

click me!