శార్దూల్ ఠాకూర్‌కి షాక్... కేకేఆర్‌కి ట్రేడ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్! కోల్‌కత్తా నుంచి ఆ నలుగురు అవుట్...

First Published Nov 14, 2022, 4:09 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడి, 2022 టోర్నీలో చోటు దక్కించుకోలేకపోయిన భారత ప్లేయర్లలో శార్దూల్ ఠాకూర్ ఒకడు. బ్రిస్బేన్ టెస్టు తర్వాత పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా, మ్యాచ్ టర్నర్‌గా పేరు తెచ్చుకున్న శార్దూల్ ఠాకూర్... ఫామ్ కోల్పోయి టీమిండియాలో చోటు కూడా కోల్పోయాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10 కోట్ల 75 లక్షల భారీ ధర దక్కించుకున్న శార్దూల్ ఠాకూర్‌ని వదిలించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

Shardul Thakur-Deepak Chahar

ఐపీఎల్ 2021 సీజన్‌లో 21 వికెట్లు తీసి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు శార్దూల్ ఠాకూర్. దీంతో శార్దూల్‌ని మెగా వేలంలో రూ.10.75 కోట్ల భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. డేవిడ్ వార్నర్‌ని రూ.6.25 కోట్లకు కొన్న ఢిల్లీ, శార్దూల్ ఠాకూర్‌ కోసం దాదాపు అంతకి రెండింతలు పెట్టింది...

Image Credit: Instagram

అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో 15 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, 9.79 ఎకానమీతో పరుగులు సమర్పించాడు. బ్యాటుతో 10 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కి వచ్చిన శార్దూల్ ఠాకూర్, 120 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇంతకుముందు ఏ సీజన్‌లోనూ శార్దూల్ ఠాకూర్ 20 పరుగులు కూడా చేయకపోవడం విశేషం...

అయితే శార్దూల్ ఠాకూర్ నుంచి ఇంకా ఎంతో ఆశించిన ఢిల్లీ క్యాపిటల్స్, అతన్ని కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ట్రేడ్ చేసుకుంది. శార్దూల్ ఠాకూర్ కోసం ఏకంగా నలుగురు పాత ప్లేయర్లను బయటికి పంపేందుకు సిద్ధమైంది కేకేఆర్. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఇద్దరు భారత ప్లేయర్లు బయటికి వెళ్లబోతున్నట్టు సమాచారం...

స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో పాటు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌లను కోల్‌కత్తా నైట్‌రైడర్స్, 2023 మినీ వేలానికి విడుదల చేయబోతుంది. 2020 సీజన్‌లో 17 వికెట్లు తీసి వెలుగులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి, 2021 సీజన్‌లో 18 వికెట్లు తీశాడు. 2022 సీజన్‌లో వరుణ్ చక్రవర్తిని రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది కేకేఆర్. అయితే ఈసారి అతను 8 మ్యాచులు ఆడి 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు...

venkatesh Iyer

ఐపీఎల్ పర్ఫామెన్స్‌తో లక్కీగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన వరుణ్ చక్రవర్తి, అందులోనూ ఒక్క వికెట్ తీయలేక అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అలాగే ఐపీఎల్ 2021 సీజన్‌లో కేకేఆర్ రాత మార్చిన వెంకటేశ్ అయ్యర్‌ని కూడా రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది కోల్‌కత్తా...

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్, 10 మ్యాచుల్లో 370 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారీ అంచనాలతో అయ్యర్‌ని అట్టిపెట్టుకుంది కేకేఆర్. అయితే 2022లో 12 మ్యాచుల్లో కలిపి 182 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు వెంకటేశ్  అయ్యర్...

అలాగే నాలుగు సీజన్లులగా కేకేఆర్ తరుపున ఆడుతున్న ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ని కూడా మినీ వేలానికి విడుదల చేయబోతుంది షారుక్ టీమ్. 2020 వేలంలో రూ.15.5 కోట్లకు ప్యాట్ కమ్మిన్స్‌ని కొన్న కేకేఆర్, 2022 సీజన్ మెగా వేలంలో రూ.7.25 కోట్లకు అతన్ని దక్కించుకుంది.  2022లో 5 మ్యాచుల్లో 63 పరుగులు చేసిన కమ్మిన్స్, 7 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు...
 

అలాగే యంగ్ పేసర్ శివమ్ మావి కూడా ఆరు సీజన్లుగా కేకేఆర్ తరుపున ఆడుతున్నాడు. 2022 మెగా వేలంలో శివమ్ మావిని రూ.7.25 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్. వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావిలను వేలానికి విడుదల చేయాలని నిర్ణయించుకుంది కేకేఆర్..

అలాగే బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు సామ్ బిల్లింగ్స్, ఐపీఎల్ ఆడకూడదని డిసైడ్ అయ్యాడు. దీంతో కేకేఆర్ పర్సులో రూ.30.5 కోట్లు మిగులుతాయి. దీంతో శార్దూల్ ఠాకూర్‌ని రూ.10.75 కోట్లకు ట్రేడ్ చేసుకున్నా... కేకేఆర్ పర్సులో ఇంకా 19.75 కోట్లు ఉంటాయి... 

click me!