2016లో టీ20 వరల్డ్కప్, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు ఓటమి తర్వాత అప్పటిదాకా ఉన్న హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేని అర్ధాంతరంగా ఆ పదవి నుంచి తప్పించి, రవిశాస్త్రిని కొత్త కోచ్గా నియమించింది బీసీసీఐ...
కెప్టెన్ విరాట్ కోహ్లీకి, హెడ్ కోచ్ రవిశాస్త్రికి మధ్య ఏర్పడిన మనస్పర్థలే ఈ నియామకానికి కారణమనే కామెంట్లు కూడా వినిపించాయి.తాజాగా తన ఇంటర్వ్యూ సమయంలో జరిగిన ఓ విషయం గురించి చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి...
‘సౌరవ్ గంగూలీ నాకు ఎప్పటినుంచో తెలుసు. ఇంకా చెప్పాలంటే అతను నా జూనియర్. టైమ్స్ షీల్డ్ టోర్నమెంట్లో దాదా టాటా స్టీల్కి ఆడుతున్నప్పుడు నేను కెప్టెన్గా ఉన్నాను...
భారత జట్టు హెడ్కోచ్ పొజిషన్ కోసం ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో క్రికెట్ అడ్వైసరీ కమిటీ (సీఏసీ)లో సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ సభ్యులుగా ఉన్నారు...
ఆ మీటింగ్కి వచ్చేటప్పుడు నేను హెడ్ కోచ్గా అయితే ఏమేం చేయగలనో ఓ లెటర్ రాసి పెట్టుకున్నా. అయితే కరెక్టుగా ఇంటర్వ్యూ సమయానికి అది ఎక్కడో పడిపోయింది...
కమిటీ ముందు వెళ్లి ఆ విషయం చెప్పడం నాకు చిన్నతనంగా అనిపించింది. అయితే జరిగినదాన్ని దాచడం ఎందుకు... దేన్ని దాచడం నాకు నచ్చదు, ఏది ఉన్నా ముఖం మీదే మాట్లాడతా...
అందుకే వెళ్లి ఆ విషయం చెప్పేశా. అయితే నా గురించి తెలిసిన గంగూలీకి అది నచ్చలేదు. అయితే అది చాలా చిన్న గొడవే. కొందరు ఎప్పుడో జరిగినదాన్ని మనసులో దాచి పెట్టుకుని, అవకాశం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు. నేను అలాంటి వాడిని కాదు...
నాకు విరాట్ కోహ్లీకి మధ్య కూడా గొడవలు వచ్చాయని రాసారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వచ్చే ఇలాంటి వార్తలను నేను అస్సలు పట్టించుకోను. నేను వాటిని చదవను కూడా...
డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగింది అనేది మాకు మాత్రమే తెలుసు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించుకుని రాసుకుంటే, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు...
విరాట్ కోహ్లీ కూడా స్కోరు కార్డుపైన రాసే వాటిని మాత్రమే పట్టించుకుంటాడు. జనాలందరికీ గుర్తుండేది కూడా అదే. ఎవరెన్ని పరుగులు చేశారు, ఎన్ని వికెట్లు తీశారనేది మాత్రమే జనాలకు, ఏ టీమ్కైనా కావాల్సింది...
నాలుగేళ్ల కాలంలో నేను సాధించిన విజయాలు, నాకు సంతృప్తినిచ్చాయి. ఆస్ట్రేలియా టూర్లో, ఇంగ్లాండ్ టూర్లో అద్భుత విజయాలు అందుకున్నాం... అలాగే ఈ కాలంలో జట్టు ఎప్పుడు ఫెయిల్ అయినా వేలేత్తి చూపించింది నన్నే...
టీమిండియా హెడ్కోచ్గా ఉన్నన్నినాళ్లు నేను చేసే ప్రతీపనిని జనాలు, ఎత్తి చూపించారు. ఇప్పుడు నా టైం వచ్చింది. నేను తాపీగా కూర్చొని వాళ్లను చూస్తూ ఆనందిస్తా... విమర్శలను పట్టించుకోకుండా వెళ్తేనే విజయాలు వస్తాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి...