PBKS vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్.. ఉత్కంఠను రేపుతూ సాగిన ఈ మ్యాచ్ నిజంగానే వాటే మ్యాచ్ అనేలా క్రికెట్ లవర్స్ కు ఫుల్ ట్రిట్ ఇచ్చింది. అదే ఐపీఎల్ 2025లో 31వ మ్యాచ్. ఈ గేమ్ లో పంజాబ్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ హిస్టరీలో అత్యల్ప స్కోర్ ను డిఫెండింగ్ చేసుకోవడంలో సక్సెస్ అయి చరిత్ర సృష్టించింది శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ టీమ్.
IPL 2025లో అభిమానులకు ఇప్పటివరకు ఫోర్లు, సిక్సర్ల ఉత్సాహాన్ని చూశారు. కానీ, పంజాబ్ కింగ్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన తక్కువ స్కోరింగ్ మ్యాచ్లో వికెట్లు పడుతుంటే ట్రిపుల్ డోస్ ఉత్సాహం కనిపించింది. ఓడిపోవడం పక్కా అనుకున్న తక్కువ టోటల్ ను ఢిఫెండ్ చేసుకుని పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో మ్యాచ్ ను గెలుచుకుంది. ఈ విజయంతో పంజాబ్ జట్టు చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బ్యాట్స్మెన్పై ఆకలితో ఉన్న సింహాల మాదిరిగా కేకేఆర్ బౌలర్లు విరుచుకుపడ్డారు. దీంతో పంజాబ్ టీమ్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభు సిమ్రాన్ సింగ్ 30, ప్రియాంశ్ ఆర్య 22, శశాంక్ సింగ్ 18 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు.
కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీశాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు చెరో 2 వికెట్లు పడగొట్టారు. కేకేఆర్ సూపర్ బౌలింగ్ దెబ్బకు పంజాబ్ టీమ్ వరుస వికెట్లు సమర్పించుకుంది. 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, ఈ ఆనందం కేకేఆర్ కు ఎక్కువ సేపు ఉండలేదు. బ్యాటింగ్ సమయంలో ట్రబుల్ లో పడింది.
పంజాబ్ కింగ్స్ కేవలం 111 పరుగులు చేయడంతో ఇంకేముందు కేకేఆర్ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ, ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ తో పాటు అత్యల్ప స్కోర్లను కూడా డిఫెండింగ్ చేసుకున్న చరిత్ర కలిగిన పంజాబ్ మరోసారి అద్భుతం చేసింది.
సూపర్ ఫామ్ లో ఉన్న కోల్కతా బ్యాటర్లను అద్భుతమైన బౌలింగ్ తో పంజాబ్ దెబ్బకొట్టింది. సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. అంగ్క్రిష్ రఘువంశీ 37 పరుగుల ఇన్నింగ్స్ మ్యాచ్కు ప్రాణం పోసింది. రహానె కూడా 17 పరుగులు చేశాడు. కానీ ఈ ఇద్దరి వికెట్ల తర్వాత పంజాబ్ టీమ్ తిరిగి మ్యాచ్ ను తనవైపు లాక్కుంది. వరుస ఓవర్లలో వికెట్లు తీసుకుని కేకేఆర్ ను 95 పరుగులకే ఆలౌట్ చేసింది. యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీసి మ్యాచ్ ను మార్చిపడేశాడు. అతను పంజాబ్ కింగ్స్ టీమ్ లో కింగ్ గా మారాడు.
చరిత్ర సృష్టించిన పంజాబ్
కేకేఆర్ పై గెలుపుతో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. గత మ్యాచ్లో పంజాబ్ హైదరాబాద్ చేతిలో భారీ స్కోర్ చేసి ఓడిపోయింది. కానీ, ఇప్పుడు అయ్యర్ టీమ్ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యల్ప స్కోర్ ను డిఫెండింగ్ చేసుకుంది. అంతకుముందు, 2009 లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండ్ చేసుకున్న 116 పరుగుల రికార్డును బ్రేక్ చేసింది.