సీఎస్కే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా పై దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ అనేది తనతో కాని వ్యవహారమని జడేజాకు త్వరగానే తెలిసొచ్చిందని వ్యాఖ్యానించాడు.
శనివారం రాజస్తాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనంతరం చర్చల్లో భాగంగా గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్-15 ప్రారంభానికి నాలుగు రోజుల ముందు జడేజా కు ఈ ఆఫర్ వచ్చింది. అతడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో రాణించిన జడ్డూ ఇప్పుడెందుకు ఆడటం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు.
అయితే అతడికి కూడా త్వరగానే తెలిసొచ్చినట్టుంది. ఈ పరిస్థితుల్లో చెన్నై కెప్టెన్ గా ఉండటమనేది అంత తేలిక కాదనే విషయాన్ని జడేజా గ్రహించాడు. నాయకత్వం అనేది తనకు సూట్ కాని వ్యవహారమని జడ్డూ భావించినట్టు ఉన్నాడు.
నిత్యం కామ్ గా ఉంటూ కూల్ గా పని కానిచ్చే ధోని తన వెంట ఉన్నాడనే ధైర్యంతో జడేజా దీనికి ఒప్పుకుని ఉండొచ్చు. కానీ పరిస్థితులు మాత్రం అతడికి అనుకూలంగా లేవు. కెప్టెన్సీ అప్పగించిన తర్వాత జడేజా తిరిగి తన పాత (ఆల్ రౌండర్) స్థానానికి న్యాయం చేసే ఆట ఆడతాడని నేను భావిస్తున్నాను..’ అని తెలిపాడు.
ఈ సీజన్ లో 8 మ్యాచులాడిన సీఎస్కే.. 2 విజయాలు, 6 పరాజయాలతో 4 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ముంబై, ఆర్సీబీ మీద విజయాలు సాధించిన ఆ జట్టు.. పంజాబ్, కేకేఆర్, లక్నో, ఎస్ఆర్హెచ్, గుజరాత్ పై ఓడింది. ఆదివారం ఆ జట్టు సన్ రైజర్స్ తొ పోటీ పడనుంది.
ఇక జడ్డూ నిర్ణయంపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘ఇది టీమ్ మేనేజ్మెంట్, జడ్డూ తీసుకున్న నిర్ణయం. ఈ విషయంలో జడ్డూ.. తన ఆటపై దృష్టి పెట్టడానికి కెప్టెన్సీ వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. ధోని కూడా అందుకు ఒప్పుకున్నాడు. ఫ్రాంచైజీ ప్రయోజనాల దృష్ట్యా ధోని తిరిగి సారథిగా ఉండటానికి ఒప్పుకున్నాడు..’ అని చెప్పారు.
కాగా.. రవీంద్ర జడేజా నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘జడేజా నిర్ణయం పట్ల నేను నిజంగా ఒకింత బాధపడుతున్నాను. అయితే ఈ నిర్ణయం అతడి కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపకూడదని ఆశిస్తున్నాను..’ అని అన్నాడు.