
అండర్ - 19 ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఐపీఎల్ లో మెరిసి సీనియర్ టీమ్ కు సెలెక్ట్ అయిన ఆటగాడు ఇషాన్ కిషన్. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఇషాన్.. బీసీసీఐ ఆదేశాలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. టెస్టు జట్టులో స్థానం కోసం చాలాకాలంగా వేచి చూస్తున్న ఇషాన్.. ఆ అవకాశాన్ని కూడా మిస్ చేసుకునేలా ఉన్నాడు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (ఫిబ్రవరి - మార్చి) లో భాగంగా ఇషాన్ తొలిసారి భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే జట్టులోకి వచ్చినా తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఆంధ్రా వికెట్ కీపర్ కెఎస్ భరత్ నాలుగు టెస్టులు ఆడాడు.
ఇక ఇటీవలే ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అయినా ఇషాన్ కు ప్లేస్ దొరుకుతుందేమో అనుకుంటే ఇక్కడా ఇషాన్ కు చోటు దక్కలేదు. అయితే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా విఫలమైన కెఎస్ భరత్ రెండు ప్రధాన టోర్నీలలో దారుణంగా విఫలం కావడంతో అతడిని పక్కనబెట్టి త్వరలో జరుగబోయే వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా టెస్టులలో ఇషాన్ కిషన్ ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
అయితే విండీస్ టూర్ కు ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఈ గ్యాప్ లో దేశవాళీలో దులీప్ ట్రోఫీ ప్రారంభం కావల్సి ఉంది. ఈ మేరకు ఈస్ట్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీ ఆడాలని జోనల్ సెలక్షన్ కమిటీ కన్వీనర్ దేబశీవ్ చక్రవర్తి ఇషాన్ ను కోరాడట. కానీ ఈ ప్రతిపాదనను ఇషాన్ తిరస్కరించినట్టు సమచారం.
బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్.. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్సీ ఇవ్వనందుకే దులీప్ ట్రోఫీ ఆడటం లేదన్న వాదన కూడా ఉంది. ఇదే విషయమై ఈస్ట్ జోన్ సెలక్షన్ కమిటీ మెంబర్ ఒకరు మాట్లాడుతూ.. ‘ఇషాన్ ఇప్పుడు ఇండియా టీమ్ లో రెగ్యులర్ మెంబర్ అయ్యాడు. అతడు ఈస్ట్ జోన్ కు సారథ్య బాధ్యతలు కావాలనుకున్నాడు. కానీ అభిమన్యు ఈశ్వరన్ ను మా కెప్టెన్సీ ఛాయిస్.
ఈ విషయంలో అభిమన్యు కూడా ఇషాన్ కు ఫోన్ చేసి దులీప్ ట్రోఫీ ఆడాలని సూచించాడు. కానీ అందుకు ఇషాన్ ఒప్పుకోలేదు. దులీప్ ట్రోఫీ వంటి టోర్నీలు ఆడటం తనకు ఇష్టం లేదని చెప్పాడు. అతడు గాయం గురించో మరేదైనా కారణం చెబుతాడని అనుకున్నాం గానీ అతడికి దులీప్ ట్రోఫీ ఆడటం ఇష్టం లేనట్టుంది..’అని తెలిపాడు.
అయితే ఇషాన్ లేకుంటే బెంగాల్ కే చెందిన మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అయినా ఆడతాడమేనని అతడిని సంప్రదించగా.. ‘దులీప్ ట్రోఫీ, ఇతర డొమెస్టిక్ క్రికెట్ అంతా భారత జట్టులో చోటు ఆశించేవాళ్లకు. నేను భారత జట్టుకు ఆడే అవకాశమే లేదు. ఇక ఈ ట్రోఫీ ఆడటంలో అర్థమే లేదు..’అని చెప్పాడట. దీంతో సెలక్టర్లు బెంగాల్ యువ వికెట్ కీపర్, ఇటీవలే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన అభిషేక్ పొరెల్కు ఛాన్స్ ఇచ్చారట..
కాగా.. 38 ఏండ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఇంగ్లాండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్ ఇప్పటికీ అక్కడ కౌంటీ ఛాంపియన్షిప్స్, డిస్ట్రిక్ క్రికెట్ టోర్నీలలో కూడా భాగమవుతున్నాడు. కానీ మన ఐపీఎల్ స్టార్స్ మాత్రం దేశవాళీ అంటేనే నామోషీగా ఫీలవుతుండటం గమనార్హం. అదీగాక టెస్టు క్రికెట్ ఆడాలంటే ఓ యువ ఆటగాడు గానీ, గాయం నుంచి కోలుకుని తిరిగి భారత జట్టులోకి వచ్చే ఆటగాడు గానీ దేశవాళీ అడాలని బీసీసీఐ నిబంధన విధించినా ఇషాన్ మాత్రం వాటిని పెడచెవిన పెట్టాడు.