IPL MI vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 16వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో లక్నో టీమ్ సూపర్ విక్టరీ అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 203/8 పరుగులు చేసింది. భారీ టార్గెట్ బ్యాటింగ్ మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్ 191/5 పరుగులు చేసింది.
లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రెండు టీమ్ లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.
దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మిచెల్ మార్ష్ (60 పరుగులు), ఐడెన్ మార్క్రమ్ (53 పరుగులు) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ ముందు 204 పరుగులు భారీ టార్గెట్ ను ఉంచింది. ఆయుష్ బదోని 30 పరుగులు, డేవిడ్ మిల్లర్ 27 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు.
204 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్ చివరి ఓవర్ వరకు గెలుపు కోసం పోరాడింది. అయితే, శార్ధుల్ ఠాగూర్ 19 ఓవర్ లో సూపర్ బౌలింగ్ వేసి ముంబైని దెబ్బకొట్టాడు. చివరి ఓవర్ లో ముంబై విజయానికి 22 పరుగులు అవసరం కాగా, 9 పరుగులే వచ్చాయి. హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ లో స్ట్రైక్ లో ఉన్నప్పటికీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.
ముంబై ఇండియన్స్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. 17 పరుగులకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. అయితే, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ లు సూపర్ నాక్ లతో మళ్లీ ముంబై ఇండియన్స్ ను తిరిగి గేమ్ లోకి తీసుకువచ్చారు. అయితే, కీలక సమయంలో సూర్య కుమార్ వికెట్ పడటం, తిలక్ వర్మ మెరవకపోవడంతో ముంబై కష్టాల్లో పడింది. తిలక్ వర్మ 25, హార్దిక్ పాండ్యా 28 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
లక్నో బౌలర్లు కీలక సమయంలో సూపర్ బౌలింగ్ తో అదరగొట్టారు. మరీ ముఖ్యంగా శార్ధుల్ వేసిన 19 ఓవర్ లక్నో మ్యాచ్ విన్నింగ్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. చివరి ఓవర్ కూడా అవేష్ ఖాన్ అద్భుతంగా వేశాడు. వీరికి తోడుగా ఎక్కువ పరుగులు ఇవ్వకుండా దిగ్వేష్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. దీంతో లక్నో టీమ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.