ఆ ఐదింటికీ పునాది పడింది నేడే.. మే 26తో ముంబైకి ప్రత్యేక అనుబంధం.. అదే రిపీట్ అయితే..!

First Published May 26, 2023, 12:47 PM IST

IPL 2023 Playoffs: ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌పుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్..  ఇప్పటివరకు ఐదు ట్రోఫీలను నెగ్గింది.  రోహిత్ సేనకు మే 26తో ప్రత్యేక అనుబంధముంది. 

ఇండియన్  ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ నుంచి  ఇప్పటివరకూ   ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో  ఆడటమే గాక  భారత క్రికెట్ జట్టుకు  ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఇచ్చిన జట్టు ముంబై ఇండియన్స్. సచిన్ టెండూల్కర్, జయసూర్య, రికీ పాంటింగ్,  షాన్ పొలాక్, లసిత్ మలింగ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు  ముంబైకి ఆడారు. 

ఇదే క్రమంలో ముంబై కూడా భారత జట్టుకు  జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను  ఇచ్చింది.  దేశవాళీలో రాణించినా  పైన పేర్కొన్న ముగ్గురికీ  తమ  నైపుణ్యాన్ని చాటడానికి అవకాశమిచ్చింది ముంబై ఇండియన్స్ అన్నది జగమెరిగిన సత్యం.  

అయితే ఐపీఎల్ లో  అత్యంత నాణ్యమైన జట్టుతో ఆడినా ఆ  టీమ్ కు 2013 దాకా ఒక్క ట్రోఫీ కూడా లేదు. వరుసగా ఐదు సీజన్ల పాటు నిరాశే ఎదురైంది.   కానీ  2013 లో సారథ్య పగ్గాలను  రోహిత్ కు అప్పగించడంతో ముంబై కథ మారింది.  ఈ సీజన్ తర్వాత ముంబై.. ఐపీఎల్ లో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా ఏకంగా ఐదు ట్రోఫీలను  సొంతం చేసుకుంది.  

కాగా  ఐపీఎల్ లో ముంబై విజయప్రస్థానానికి తొలి అడుగు (ఫస్ట్ ట్రోఫీ) పడింది నేడే. సరిగ్గా పదేండ్ల క్రితం  మే 26న ముంబై ఇండియన్స్ కు ఐపీఎల్ లో ఫస్ట్ ట్రోఫీ గెలుచుకునే అవకాశం దక్కింది. ఈడెన్ గార్డెన్  (కోల్కతా) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన రోహిత్ సేన.. తమ ఖాతాలో తొలి టైటిల్ ను అందుకుంది.  ఆ తర్వాత  ఇక చరిత్రే. 2015, 2017, 2019, 2020 లలో ముంబై విజయాలను అందుకుంది.  

అయితే ఫస్ట్ ఎప్పటికైనా బెస్ట్  అన్నట్టు..  2013 ఐపీఎల్ ఫైనల్లో  ముంబై - చెన్నైల మధ్య జరిగిన ఫైనల్ కూడా ఆసక్తికరంగా సాగింది.  ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో  9 వికెట్లు కోల్పోయి  148 పరుగులే చేసింది. కీరన్ పొలార్డ్..  32 బంతులలో 7 బౌండరీలతో 60 పరుగులు చేసి ముంబైని ఆదుకున్నాడు.  బ్రావోకు 4 వికెట్లు దక్కాయి. 

అనంతరం చెన్నై..  20 ఓవర్లలో  9 వికెట్లు కోల్పోయి 125 పరుగులే చేయగలిగింది.   చెన్నై జట్టులో రైనా, బద్రీనాథ్, జడేజాలతో పాటు మరో ఇద్దరు డకౌట్ అయ్యారు.   కెప్టెన్ ధోని ఒక్కడే.. 45 బంతుల్లో 3 బౌండరీలు, 9 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కానీ  చెన్నైని గెలిపించలేకపోయాడు.  ఫలితంగా ముంబై.. 23 పరుగుల తేడాతో గెలిచింది. 

ఈ క్రమంలో ముంబై సారథి రోహిత్ శర్మ.. అత్యంత పిన్న వయసు (26)లో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన  సారథిగా నిలిచాడు. అప్పటిదాకా ట్రోఫీ గెలిచిన షేన్ వార్న్, గిల్‌క్రిస్ట్, ధోని, గంభీర్ ల వయసు రోహిత్ కంటే ఎక్కువే. ఇక నేడు అదే రోహిత్ సేన.. ఐపీఎల్ -16 లో తమకు ఇష్టమైన ప్రత్యర్థి చెన్నైను ఢీకొనాలంటే  గుజరాత్ టైటాన్స్ తో జరిగే  రెండో క్వాలిఫయర్ లో గెలవాల్సి ఉంటుంది.  

click me!