లక్నో - బెంగళూరు మ్యాచ్ లో భాగంగా జరిగిన విరాట్ కోహ్లీ - గౌతం గంభీర్ ల గొడవ తర్వాత గంభీర్ గత గొడవలపై ఆరాలు తీసేవారు ఎక్కువయ్యారు. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. గంభీర్ కు ఇగో ఎక్కువని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
లక్నో - చెన్నై మధ్య బుధవారం అర్థాంతరంగా ముగిసిన మ్యాచ్ లో భాగంగా ఇర్ఫాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో ఈ ఇద్దరూ ఎదురుపడినప్పుడు ధోనిపై తన అక్కసు వెళ్లగక్కేవాడని, అది తాను కళ్లారా చూశానని పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్-16లో హిందీ కామెంట్రీ చెబుతున్న పఠాన్, లక్నో - ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గౌతం గంభీర్ కేకేఆర్ కు కెప్టెన్ గా ఉన్నప్పుడు ధోని మీద ఫుల్ ఇగోతో ఉండేవాడు. ధోనిని చాలాసార్లు ఐపీఎల్ లో తన స్పిన్నర్లతో ఔట్ చేయించడంలో గంభీర్ సక్సెస్ అయ్యాడు. కేకేఆర్-సీఎస్కే మ్యాచ్ లలో ధోని బ్యాటింగ్ కు వచ్చేప్పుడు అతడి కోసం ప్రత్యేకంగా ఫీల్డ్ సెట్ చేసేవాడు.
2016లో అనుకుంటా. అప్పుడు ధోని రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ కు సారథిగా ఉన్నాడు. అప్పటికే పూణె 74-4తో కష్టాల్లో ఉంది. ఆ సీజన్ లో కేకేఆర్ కు ఆడిన చావ్లా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ధోని బ్యాటింగ్ కు రాగానే గంభీర్, అతడి చుట్టూ ఫీల్డర్లను మొహరించాడు. షకిబ్ అల్ హసన్, సూర్యకుమార్ యాదవ్, యూసుఫ్ పఠాన్ లను ధోని చుట్టే సెట్ చేసేవాడు.
స్పిన్నర్లను ఆడటంలో ఇబ్బందిపడే ధోని.. ఈ మాయలో పడేవాడు. చుట్టూ ఫీల్డర్లు ఉండటంతో అయితే డిఫెండ్ చేయడం లేదా భారీ షాట్ ఆడే క్రమంలో ధోని వికెట్ పారేసుకునేవాడు. ఈ మ్యాచ్ లో ధోని 14 బంతులాడి 5 పరుగులే చేశాడు. నేను నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్నాను. కానీ అప్పుడు ధోని రనౌట్ అయ్యాడు..’ అని చెప్పుకొచ్చాడు.
2011 వన్డే వరల్డ్ కప్ లో గంభీర్ 97 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకొచ్చి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కెప్టెన్ గా క్రెడిట్ అంతా ధోనికే దక్కింది. దీనిపై గంభీర్ గతంలో కూడా ఇదే విషయమై అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే.