ధోనికి ఇదే చివరి సీజన్..? అని ఫ్యాన్స్తో పాటు క్రికెట్ విశ్లేషకుల మధ్య చర్చోపచర్చలు సాగుతున్న వేళ.. చెన్నై సారథి ఐపీఎల్ -16 ఫైనల్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొద్దిరోజుల్లో 42వ బర్త్ డే జరుపుకోనున్న ధోనిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సీజన్ లో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ద్వారా అయినా తర్వాతి సీజన్ లో ధోనిని ఆడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీని ద్వారా ధోని కేవలం బ్యాటింగ్ చేస్తే సరిపోతుంది. వికెట్ కీపర్ గా మరో ఆటగాడికి ఛాన్స్ ఇస్తే ధోనికి ఏ ఇబ్బందీ ఉండదని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
Image credit: Sandeep Rana
అయితే దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం మరోలా స్పందించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ధోనికి అంతగా సూట్ కాదని.. అతడు కెప్టెన్ గా ఉంటేనే చెన్నైకి మేలని అభిప్రాయపడ్డాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అనేది బౌలర్, బ్యాటర్ లకు వర్తిస్తుందని.. ధోనివంటివాడికి కాదని అన్నాడు.
ఓ టీవీ షోలో జరిగిన చర్చా కార్యక్రమంలో వీరూ మాట్లాడుతూ.. ‘ఒక క్రికెటర్ కు 40 ఏండ్లు దాటిన తర్వాత కూడా క్రికెట్ ఆడటం పెద్ద కష్టమేమీ కాదు. ఈఏడాది ధోని తన సామర్థ్యం మేరకు ఆడలేదు. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న అతడు దానిని మరింత పెద్దది చేసుకోదలుచుకోలేదు.
ధోని ఈ సీజన్ లో ఎక్కువగా ఆఖరి రెండు ఓవర్లు ఉండగానే బ్యాటింగ్ కు వచ్చాడు. గట్టిగా లెక్కబెడితే ఈ సీజన్లో అతడు ఎదుర్కున్న బంతులు 50 కంటే మించి ఉండవు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ధోనికి పనికిరాదు. ఎందుకంటే అతడు చెన్నైకి కెప్టెన్సీ కోసమే ఆడుతున్నాడు. చెన్నై టీమ్ కు సారథిగా అతడు తప్పకుండా టీమ్ లో ఉండాలి. కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే చేసేవారికే ఇంపాక్ట్ రూల్ వర్తిస్తుంది.
మాహీ 20 ఓవర్లు కచ్చితంగా క్రీజులో ఉండాలి. కెప్టెన్ కానప్పుడు ధోని ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి మాత్రం ఏం ఉపయోగం. అలాంటి సందర్భాల్లో ధోని సీఎస్కేకు మెంటార్ గానో కోచ్ గానో లేదా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గానో సేవలందిస్తే బెటర్..’ అని వీరూ అభిప్రాయపడ్డాడు.