INDvsENG: మూడో టెస్టులో కోహ్లీ సేన చిత్తు, ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్

First Published Aug 28, 2021, 5:19 PM IST

మూడో టెస్టులో టీమిండియా పోరాటం ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు, ఇన్నింగ్స్ 76 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు, సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది.

నాలుగో రోజు ఉదయం సెషన్‌లోనే వరుస వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు... ఓవర్‌నైట్ స్కోరు 215/2 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా, అదే స్కోరు వద్ద ఛతేశ్వర్ పూజారా వికెట్‌ కోల్పోయింది. 

189 బంతుల్లో 15 ఫోర్లతో 91 పరుగులు చేసిన పూజారా, 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు... ఛతేశ్వర్ పూజారా 90ల్లో అవుట్ కావడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 2017లో 92 పరుగులకి అవుట్ అయ్యాడు ఛతేశ్వర్ పూజారా.. 

విరాట్ కోహ్లీ బౌండరీతో టెస్టుల్లో 26వ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఇంగ్లాండ్‌లో విరాట్‌కి ఇది ఆరో హాఫ్ సెంచరీ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత కెప్టెన్‌గా ధోనీ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ... 

వరుసగా రెండు ఫోర్లు బాది జోరు మీదున్నట్టుగా కనిపించిన విరాట్ కోహ్లీ, రాబిన్‌సన్ బౌలింగ్‌లో మరోసారి షాట్ ఆడబోయి జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 

237 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా.  కోహ్లీ, రహానే వికెట్లను వరుస ఓవర్లలో కోల్పోయిన టీమిండియా, ఆ తర్వాతి ఓవర్‌లో రిషబ్ పంత్ వికెట్‌ను కోల్పోయింది. ఏడు బంతులు ఆడిన రిషబ్ పంత్, కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత మొయిన్ ఆలీ బౌలింగ్‌లో మహ్మద్ షమీ క్లీన్‌బౌల్డ్ కావడంతో 254 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా... ఆ తర్వాత ఇషాంత్ శర్మ కూడా 2 పరుగులకే పెవిలియన్ చేరాడు.

215/2 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు వరుస వికెట్లు కోల్పోయి 257/8 వద్దకు చేరుకుంది. ఓల్లీ రాబిన్‌సన్‌ ఐదు వికెట్లు తీశాడు...

ఓవర్టన్ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదిన రవీంద్ర జడేజా 24 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...  ఆ తర్వాత సిరాజ్ కూడా డకౌట్ కావడంతో 278 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది.

ఇంతకుముందెప్పుడూ టెస్టు సిరీస్‌లో మూడో టెస్టు ఓడని విరాట్ కోహ్లీ టీమ్, తొలిసారి ఆ రికార్డును బ్రేక్ చేసింది. 2018లో లార్డ్స్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో మ్యాచ్‌ను ఓడిన విరాట్ కోహ్లీ, మళ్లీ మూడేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పైనే ఆ చెత్త రికార్డు నమోదుచేశాడు.

click me!