Under 19 Womens T20 World Cup 2025: మన అమ్మాయిలు అదరగొట్టారు. ప్రపంచ వేదికపై భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టారు. వరుసగా రెండో సారి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుని ప్రపంచ విజేతగా నిలిచింది భారత మహిళల అండర్ 19 క్రికెట్ జట్టు.
ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 ట్రోఫీని భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ టైటిల్ను భారత్ వరుసగా రెండోసారి గెలుచుకుంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 52 బంతులు మిగిలి ఉండగానే 11.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసి సులువైన విజయాన్ని నమోదు చేసుకుంది.
అదరగొట్టిన తెలుగమ్మాయి గొంగడి త్రిష
భారత జట్టు ఛాంపియన్ గా నిలవడంతో మన తెలుగమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో బ్యాట్, బాల్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడింది. ఫైనల్ మ్యాచ్ లో గొంగడి త్రిష 33 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేసి భారత జట్టు టాప్ స్కోరర్గా నిలిచింది. సానికా చాల్కే కూడా 22 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడింది.
అంతకుముందు త్రిష (15 పరుగులకు 3 వికెట్లు) నాయకత్వంలోని భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. పరుణికా సిసోడియా (6 పరుగులకు 2 వికెట్లు), ఆయుషి శుక్లా (9 పరుగులకు రెండు వికెట్లు), వైష్ణవి శర్మ (23 పరుగులకు 2 వికెట్లు) కూడా అద్భుతంగా బౌలింగ్ సౌతాఫ్రికాకు షాకిచ్చారు.
ఫైనల్లో భారత్ ముందు నిలబడలేకపోయిన సౌతాఫ్రికా
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో ఏ సమయంలోనూ భారత జట్టుకు సౌతాఫ్రికా పోటీని ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోతూ కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది.
ఆ జట్టులో మైకీ వాన్ వూర్స్ట్ 23 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. జట్టులోని నలుగురు బ్యాట్స్మెన్ మాత్రమే రెండంకెలకు చేరుకోగా, నలుగురు బ్యాట్స్మెన్ ఖాతా తెరవలేకపోయారు. అంతకుముందు 2023లో జరిగిన ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ను ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి భారత్ టైటిల్ను గెలుచుకుంది.
అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన ఇచ్చిన గొంగడి త్రిష
టోర్నీ మొత్తంగా అదరగొట్టిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఫైనల్ మ్యాచ్ లో కూడా తనదైన ఆటతో దుమ్మురేపారు. ఫైనల్ మ్యాచ్ లో త్రిష మరో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో మెరిశారు. భారతదేశం దక్షిణాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండో అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకోవడంతో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్ లో గొంగడి త్రిష అజేయంగా 44 పరుగులు చేయడంతో భారత్ 11.2 ఓవర్లలో 83 పరుగుల లక్ష్యాన్ని చేరుకుని విజయాన్ని అందుకుంది. ఇక బౌలింగ్ సమయంలో కూడా అద్భుతంగా బాల్ తో రాణించింది. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకుంది. ఈ ఐసీసీ టోర్నీలో 7 మ్యాచ్ లను ఆడిన త్రిష మొత్తంగా 309 పరుగులు, 7 వికెట్లు తీసుకుని "ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు"ను గెలుచుకుంది.
అండర్ 19 టీ20 ప్రపంచ కప్ 2025లో భారత జైత్ర యాత్ర ఇదే
1. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది.
2. వర్సెస్ మలేషియా – మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది.
3. వర్సెస్ శ్రీలంక – భారత్ మ్యాచ్లో 60 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది.
4. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
5. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 150 పరుగుల తేడాతో విజయం అందుకుంది.
6. ఇంగ్లండ్ (సెమీ ఫైనల్స్) - భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
7. దక్షిణాఫ్రికా (ఫైనల్) - మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.