2018లో ఆరంగ్రేటం టెస్టులో సెంచరీ చేసిన పృథ్వీషా తర్వాత తొలి టెస్టులోనే సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. అయితే శ్రేయాస్ అయ్యర్ సెంచరీ తర్వాత ‘కరణ్ నాయర్’ పేరు ట్రెండింగ్లో కనిపించింది...
దీనికి కారణం సరిగా ఇదే రోజున భారత బ్యాట్స్మెన్ కరణ్ నాయర్ కూడా టీమిండియా తరుపున టెస్టు ఆరంగ్రేటం చేశాడు. టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన కరణ్ నాయర్కి, ఆ తర్వాత టీమిండియాలో చోటు దక్కకపోవడమే.
2016 నవంబర్ 26న మొహాలీలో జరిగిన మ్యాచ్లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన కరణ్ నాయర్, ఆ తర్వాత మూడో టెస్టులో 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే మ్యాచ్లో కెఎల్ రాహుల్ 199 పరుగుల వద్ద అవుటై, డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు...
ఓవరాల్గా తన మూడో టెస్టు ఇన్నింగ్స్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కరణ్ నాయర్ 381 బంతుల్లో 32 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 79.53 స్ట్రైయిక్ రేటుతో 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు..
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత త్రిబుల్ సెంచరీ మార్కు అందుకున్న రెండో ప్లేయర్ కరణ్ నాయర్...
అంతేకాకుండా తన టెస్టు కెరీర్లో మూడో ఇన్నింగ్స్లో త్రిశతకం బాదిన కరణ్ నాయర్, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాట్స్మెన్గా చరిత్ర క్రియేట్ చేశాడు...
తన తొలి టెస్టు సెంచరీనే త్రిశతకంగా మార్చిన మూడో క్రికెటర్గా, మొదటి భారత బ్యాట్స్మెన్గా నిలిచిన కరణ్ నాయర్, ఆ మ్యాచ్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు...
అయితే త్రిబుల్ సెంచరీ బాదిన తర్వాత కరణ్ నాయర్కి మూడంటే మూడే మ్యాచుల్లో అవకాశం ఇచ్చింది టీమిండియా. ఆ మ్యాచుల్లో సరిగా ఆడలేదని తీసి పక్కనబెట్టేసింది...
ఓవరాల్గా 6 టెస్టుల్లో 374 పరుగులు చేసిన కరణ్ నాయర్, 2017 మార్చిలో ఆస్ట్రేలియాపై ఆఖరి టెస్టు ఆడాడు. కరణ్ నాయర్ లాంటి బ్యాట్స్మెన్కే మళ్లీ అవకాశం ఇవ్వలేదు, కేవలం సెంచరీ చేసిన అయ్యర్కి మరో ఛాన్స్ ఇస్తారా? అంటూ టీమిండియాను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...
వరుసగా విఫలం అవుతున్న అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వంటి ప్లేయర్లను లెక్కలేనన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు, ‘త్రిబుల్ సెంచరీ’ చేసిన కరణ్ నాయర్కి ఎన్ని అవకాశాలు ఇవ్వాలి? కానీ మూడు మ్యాచుల్లో మనోడి భవితవ్యాన్ని తేల్చేసింది బీసీసీఐ...
నాలుగేళ్లుగా టీమ్లో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్న కరణ్ నాయర్కి పట్టిన గతే శ్రేయాస్ అయ్యర్కి పడుతుందని, తర్వాత మ్యాచ్లో విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి... అతని తీసి పక్కనబెడతారని అంటున్నారు నెటిజన్లు..
ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తుండడంతో ప్రస్తుత జట్టులో ఓ ప్లేయర్ను తప్పించాల్సి ఉంటుంది. ఓపెనర్లుగా శుబ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్ సెటిల్ అయిపోగా ఆ తర్వాత పూజారా ఆ ప్లేస్లో పాతుకుపోయాడు...
అజింకా రహానే వైస్ కెప్టెన్ హోదాలో, వృద్ధిమాన్ సాహా లేదా కోన శ్రీకర్ భరత్ వికెట్ కీపర్లుగా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండర్ల హోదాలో జట్టులో ఉండడంతో రెండో టెస్టులో ఎవరి స్థానంలో విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తాడనేది ఆసక్తికరంగా మారింది...