
శ్రీలంక పర్యటన కోసం భారత పురుషుల టెస్టు జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. రెండు మ్యాచ్ల ఈ సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగమైన ఈ సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.
టీమిండియా జట్టు శ్రీలంక గడ్డపై కాలుపెట్టే ముందు కొలంబో లో ఆగస్టు 7 నుంచి నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనుంది. రీసెంట్ టైమ్లో టెస్టుల్లో నిరాశాజనక ప్రదర్శన చేసిన భారత్.. ఈ సిరీస్తో మళ్లీ ట్రాక్లోకి రావలని చూస్తోంది.
ఈ స్క్వాడ్లో మెయిన్ హైలైట్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీ. మోచేతి గాయం కారణంగా గత మే నెల నుంచి రెస్ట్ తీసుకున్న జడేజా, మళ్లీ రెడ్ బాల్ క్రికెట్లోకి తిరిగొచ్చాడు. జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత జడేజా భారత జట్టు తరఫున ఆడడం ఇదే తొలిసారి.
అదే సమయంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు నిరాశ ఎదురైంది. తొడ కండరాల గాయం కారణంగా అతడు తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది. అలాగే ఇటీవల ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి కూడా గాయం వల్లే జట్టుకు ఎంపిక కాలేదు. నేషనల్ క్రికెట్ అకాడమీ లో వీరు రీహ్యాబిలిటేషన్లో ఉన్నారు.
వాషింగ్టన్ సుందర్ దూరం కావడంతో మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ను తొలిసారి భారత సీనియర్ టెస్టు జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. 33 ఏళ్ల వయసులో ఈ అన్క్యాప్డ్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్కు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. డొమెస్టిక్ క్రికెట్లో వరుసగా రాణిస్తున్న సారాంశ్కు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించింది. ఇప్పటివరకు 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అతడు 27.3 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లోనూ 14 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలతో 2223 రన్స్ చేశాడు.
2025-26 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున 30 వికెట్లు తీసి, 518 పరుగులు సాధించి దుమ్మురేపాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా 'ఏ' పర్యటనలోనూ ఆల్రౌండ్ ప్రదర్శనతో సెలెక్టర్లను మెప్పించాడు. శ్రీలంక ఏ తో జరిగిన రెండో అన్అఫీషియల్ టెస్టులో 7 వికెట్లు తీసి, నాటౌట్గా 70 రన్స్ స్కోర్ చేసి జట్టు విజయాన్ని అందించాడు. లంక పిచ్లపై ఉన్న అనుభవం అతడికి టీమ్లో చోటు ఖాయం చేసింది.
ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ పేర్లు స్క్వాడ్లో ఉన్నప్పటికీ, వాళ్లు ఆడడం ఫిట్నెస్పైనే ఆధారపడి ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఎడమ మోకాలికి దెబ్బతగిలిన బుమ్రా రెస్ట్లో ఉన్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభిస్తేనే ఈ ఇద్దరూ మ్యాచ్ బరిలోకి దిగుతారు.
ఒకవేళ బుమ్రా ఫిట్నెస్ సాధిస్తే.. మహమ్మద్ సిరాజ్తో కలిసి పేస్ దళాన్ని నడిపిస్తాడు. ఈ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ, పంజాబ్ యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ కూడా ఉన్నారు. లంక గడ్డపై జరిగిన ఇండియా 'ఏ' రెండో టెస్టులో గుర్నూర్ 10 వికెట్లతో చెలరేగడం గమనార్హం.
జట్టు బ్యాటింగ్ విభాగాన్ని చూస్తే.. కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్తో పాటు యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించనున్నారు. రెండో వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ ఎంపికవ్వగా, అదనపు బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ను బెంచ్ పై ఉంచారు. స్పిన్ అటాక్ను అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ నడిపించనున్నారు.
దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత టీమిండియా శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడుతోంది. గతంలో 2015 (2-1), 2017 (3-0)లలో ఇక్కడ సిరీస్లను భారత్ గెలుచుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 48.15 శాతంతో 5వ స్థానంలో, శ్రీలంక 41.67 శాతంతో 6వ స్థానంలో ఉన్నాయి.
శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.
టూర్ షెడ్యూల్:
• తొలి టెస్టు: ఆగస్టు 15-19 (గాలో గాలే ఇంటర్నేషనల్ స్టేడియం)
• రెండో టెస్టు: ఆగస్టు 23-27 (కొలంబోలోని ఎస్ఎస్సీ)