India T20 captain: టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను తప్పించిన బీసీసీఐ.. తదుపరి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పేరు దాదాపు ఖరారు చేసిందని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే సమయంలో రేసులో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ కూడా ఉన్నారు.
స్కై కెప్టెన్సీకి బీసీసీఐ గుడ్ బై.. రేసులోకి ముగ్గురు యంగ్ ప్లేయర్స్.. ఆ లెఫ్ట్ హ్యాండర్కు జాక్పాట్!
భారత క్రికెట్ బోర్డు (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా మెన్స్ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను తప్పించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ను విజేతగా నిలిపినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్పై వేటు పడటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు.. ప్లేయర్గా కూడా సూర్యకుమార్ యాదవ్ను ఇకపై సెలెక్షన్కు పరిగణించకూడదని బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ల నుంచి టీమిండియాకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఈ రేసులో శ్రేయస్ అయ్యర్ అందరికంటే ముందుండగా.. ముగ్గురు ప్లేయర్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది.
25
సూర్యకుమార్ యాదవ్పై వేటుకు గల కారణాలు ఏమిటి?
రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2024 జూలైలో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా శాశ్వత టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పట్లో ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ 1 బ్యాటర్గా ఉన్న సూర్య.. హార్దిక్ పాండ్యాను వెనక్కి నెట్టి మరీ ఈ పదవి దక్కించుకున్నాడు. సూర్య కెప్టెన్సీలో భారత్ వరుసగా ఎనిమిది ద్విపాక్షిక సిరీస్ విజయాలు, 2025 ఆసియా కప్, అలాగే 2026 టీ20 వరల్డ్ కప్ టైటిల్ను గెలుచుకుంది.
కానీ, ఈ సక్సెస్ వెనుక సూర్య బ్యాటింగ్ ఫామ్ పూర్తిగా పడిపోయింది. 2025 ప్రారంభం నుండి 25 మ్యాచ్ల్లో అతని బ్యాటింగ్ సగటు కేవలం 12.84 గా మాత్రమే ఉంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో కూడా సూర్య ఘోరంగా విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన 13 మ్యాచ్ల్లో కేవలం 270 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో ముంబై టీమ్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఈ ఫామ్ లేమి కారణంగానే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు అతనిపై వేటు వేశారు. న్యూజిలాండ్తో జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్నే సూర్యకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది.
35
కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్ ఫ్రంట్ రన్నర్
సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్త లీడర్ను వెతికే పనిలో పడ్డ సెలెక్టర్లకు శ్రేయస్ అయ్యర్ బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నాడు. ఐర్లాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ నుండి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా శ్రేయస్ అయ్యర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఐపీఎల్లో కెప్టెన్గా సక్సెస్ అయిన అనుభవం, అలాగే అతని బ్యాటింగ్ రికార్డులు శ్రేయస్ అయ్యర్కు అదనపు బలంగా మారాయి. టీ20 ఫార్మాట్లో లాంగ్ టర్మ్ లీడర్షిప్ కోసం చూస్తున్న బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని మేనేజ్మెంట్ భావిస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయాన్ని సూర్యకుమార్కు అధికారికంగా తెలియజేయనున్నారు.
ఒకవేళ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయితే.. వైస్ కెప్టెన్సీ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ముంబై ఇండియన్స్ యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఉన్నారు. ఇషాన్ కిషన్ రీసెంట్గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ టీమ్ను విజేతగా నిలిపాడు. అంతేకాదు, ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ను కూడా అద్భుతంగా నడిపించాడు.
మరోవైపు తిలక్ వర్మ కూడా నిలకడైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ సంజూ శాంసన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నాయి. అక్షర్ పటేల్ను ప్రమోట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ అయ్యర్ కెప్టెన్ అయితే తిలక్ లేదా ఇషాన్ కిషన్లలో ఒకరు వైస్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది.
55
ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ షెడ్యూల్
భారత జట్టు యూరప్ టూర్ జూన్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఐర్లాండ్తో రెండు టీ20లు, ఇంగ్లాండ్తో ఐదు టీ20 మ్యాచ్లు.. మొత్తం కలిపి 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడనుంది. భారత టాప్ ఆర్డర్లో ఇప్పటికే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లు ఉన్నప్పటికీ.. యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్లో కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్ల్లో ఆడే అవకాశం కల్పించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కొత్త కెప్టెన్, కొత్త ప్లేయర్లతో టీమిండియా టీ20ల్లో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది.