India Beat Zimbabwe: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తుపాన్ హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.
మయాంక్ స్పీడ్, వైభవ్ సిక్సర్లు.. తొలి T20I లో జింబాబ్వే ఖేల్ ఖతమ్
హరారే లో జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
జింబాబ్వే విధించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేయడంతో ఛేజింగ్ చాలా ఈజీ అయిపోయింది.
25
చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. మైదానంలో అడుగుపెట్టినప్పటి నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ క్రమంలో వైభవ్ ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో (15 సంవత్సరాల 118 రోజులు) హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో 1989లో సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 213 రోజులు) నెలకొల్పిన రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.
Maiden international fifty 👏
Vaibhav Sooryavanshi becomes the youngest batter ever to score a T20I half-century 🫡
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను భారత ఫాస్ట్ బౌలర్లు తీవ్రంగా ఒత్తిడిలోకి నెట్టారు. రెండేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మయాంక్ యాదవ్ తన పేస్ పవర్తో తొలి బంతికే వికెట్ తీసి షాక్ ఇచ్చాడు. మయాంక్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు ప్రిన్స్ యాదవ్ (2/19), అశోక్ శర్మ కూడా అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడంతో జింబాబ్వే 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో వెస్లీ మాధెవెరె (39), మరుమాని (27) కొద్దిగా పోరాడటంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగలిగింది.
Blowing through the top order early on 🔥
Mayank Yadav is awarded the Player of the Match for an outstanding powerplay spell on his comeback 🌟
126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ (1) త్వరగానే అవుట్ అయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. వైభవ్ అవుటైన తర్వాత ఇషాన్ కిషన్ (35 పరుగులు, 24 బంతుల్లో) వేగంగా పరుగులు సాధించాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 27 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తిలక్ వర్మ (5 నాటౌట్) సింగిల్ తీసి విజయాన్ని అందించాడు. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు 8వ మ్యాచ్ లలో లభించిన తొలి T20I విజయం ఇది కావడం గమనార్హం.