INDvsENG: లంచ్ బ్రేక్ ముందు రోహిత్ శర్మ అవుట్... ఇంగ్లాండ్ జట్టుకి ఊరట...

First Published Aug 5, 2021, 5:44 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు రెండో రోజు తొలి సెషన్‌లో పూర్తి ఆధిక్యం కనబర్చింది. ఓవర్ నైట్ స్కోరు 21/0 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ శుభారంభం అందించారు...

రెండో ఆట ప్రారంభం నుంచి ఎంతో జాగ్రత్తగా ఆడుతూ, అప్పుడప్పుడూ బౌండరీలు సాధిస్తూ బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ నిర్మించారు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్...

తొలి వికెట్‌కి 97 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్... 37 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేశారు. 2007లో దినేశ్ కార్తీక్, వసీం జాఫర్ తర్వాత 25 ఓవర్ల కంటే ఎక్కువగా బ్యాటింగ్ చేసిన భారత ఓపెనింగ్ జోడీగా నిలిచారు...

ఇన్నింగ్స్ ప్రారంభంలోనే జిడ్డు బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లకు విసుగు తెప్పించారు భారత ఓపెనర్లు. దీంతో వికెట్ల కోసం చకోర పక్షిలా ఎదురుచూసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలోపే రెండు రివ్యూలను కోల్పోయింది...

లంచ్ బ్రేక్‌కి ముందు భారీ షాట్‌కి ప్రయత్నించిన రోహిత్ శర్మ, సామ్ కుర్రాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 107 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసిన రోహిత్, బౌన్సర్‌కి భారీ షాట్‌ ఆడాలని ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు.

మయాంక్ అగర్వాల్ గాయపడడంతో అనుకోకుండా ఓపెనింగ్ ప్లేస్‌ని దక్కించుకున్న కెఎల్ రాహుల్, 124 బంతుల్లో 8 ఫోర్లతో 48 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు...

8 ఏళ్ల క్రితం వేసిన వివాదాస్పద ట్వీట్ల కారణంగా ఓ టెస్టు మ్యాచ్‌ నిషేధానికి గురై, ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఓల్లీ రాబిన్‌సన్‌కే తొలి వికెట్ దక్కడం విశేషం.

లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 86 పరుగుల దూరంలో ఉన్న భారత జట్టు, రెండు, మూడో సెషన్‌లో చేసే పరుగులను బట్టి టీమిండియాకి దక్కే ఆధిక్యం ఆధారపడి ఉంది. 

click me!