Champions Trophy 2025: శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు బ్యాటింగ్ లో రాణించడంతో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను విజయంతో ప్రారంభించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ పై టీమిండియా 6 వికెట్ల తేడాతో తెలిచింది.
భారత జట్టు విజయంలో శుభ్మన్ గిల్ (101 పరుగులు*), మహ్మద్ షమీ (5 వికెట్లు)లు హీరోలుగా నిలిచారు. మొత్తంగా ఈ మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించడంతో భారత్ విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్లో భారత వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల రికార్డులు బ్రేక్ చేశాడు.
వన్డే కెరీర్ లో 8వ సెంచరీ సాధించిన శుభ్ మన్ గిల్
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ ఆరంభం నుంచి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ తన వన్డే క్రికెట్ కెరీర్ లో 8వ సెంచరీని అందుకున్నాడు. గిల్ 129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేసి.. భారత్ ను గెలిపించి అజేయంగా నిలిచాడు.
25 ఏళ్ల గిల్ తన అంతర్జాతీయ కెరీర్లో ఇది 14వ సెంచరీ. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్లో గిల్ సెంచరీ చేశాడు.
సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీలను దాటేసిన గిల్
ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన శుభ్ మన్ గిల్.. భారత్ తరపున అత్యంత వేగవంతమైన 8 వన్డే సెంచరీలు చేసిన ప్రత్యేక క్లబ్ లో చేరాడు. అలాగే, సచిన్, గంభీర్, విరాట్, శిఖర్ ధావన్లను అధిగమించాడు. ఇన్నింగ్స్ ల పరంగా గిల్ భారతదేశం తరపున వన్డేలలో 8 సెంచరీలు పూర్తి చేసిన అత్యంత వేగవంతమైన బ్యాట్స్మన్గా నిలిచాడు. అతను 51 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించాడు.
అంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. అతను 57 ఇన్నింగ్స్లలో ఎనిమిది వన్డే సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ 68 ఇన్నింగ్స్లలో, గౌతమ్ గంభీర్ 68 ఇన్నింగ్స్లలో, సచిన్ టెండూల్కర్ 111 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించారు.
భారత్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్లలో 8 వన్డే సెంచరీలు
51 - శుభ్మన్ గిల్
57 - శిఖర్ ధావన్
68 - విరాట్ కోహ్లీ
98 - గౌతమ్ గంభీర్
111 - సచిన్ టెండూల్కర్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ కు తొలి విజయం
ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫీల్డింగ్ లో కొన్ని తప్పిదాలు చేసినప్పటికీ బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొడుతూ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని ఘనంగా ప్రారంభించింది.
బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్ ముందు నిలబడలేకపోయారు. షమీ 53 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. గిల్ సెంచరీతో 46.3 ఓవర్లలో 231/4 స్కోరుతో భారత్ టార్గెట్ ను ఛేదించింది.