కోహ్లీ, రోహిత్‌లు ప్రపంచకప్ తీసుకురాలేరు.. అది అసంభవం : కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

First Published Jan 3, 2023, 5:52 PM IST

టీమిండియా తాజా మాజీ సారథులు   రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు దాదాపు కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఈ ఇద్దరూ ధోని సారథ్యంలో వరల్డ్ కప్ నెగ్గారే తప్ప   ఆ తర్వాత   అది అందని ద్రాక్షగానే మిగిలింది. 

భారత క్రికెట్ జట్టు చివరిసారి 2013లో ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు  ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత   పదేండ్లుగా ప్రతీసారి భారత జట్టు ఐసీసీ టోర్నీలో పాల్గొనడం, ఉత్తచేతులతోనే తిరిగిరావడం ఆనవాయితీగా మారింది.

ధోని వారసుడిగా వచ్చిన విరాట్ కోహ్లీ..  భారత్ కు ఐసీసీ ట్రోఫీ అందిస్తాడని ఆశించినా అతడి వల్ల కాలేదు. కోహ్లీ కాకున్నా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన రోహిత్ శర్మ అయినా భారత్ కు ఐసీసీ ట్రోఫీ బెంగ తీరుస్తాడనుకుంటే అతడూ చేతులెత్తేశాడు. 
 

ఈ ఇద్దరూ కలిసి  భారత్ లో ఈ ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్ లో  భారత్ కు కీలకంగా వ్యవహరించనున్నారు.  జరిగేది భారత్ లోనే కాబట్టి ఈ ఇద్దరు దిగ్గజాల కల  ఈ యేటితో నెరవేరుతుందని టీమిండియా ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. 

అయితే అలాంటిదేమీ జరగదని అంటున్నాడు భారత క్రికెట్ జట్టు  దిగ్గజ సారథి కపిల్ దేవ్. దేశానికి తొలి వన్డే వరల్డ్ కప్ (1983) అందించిన కపిల్.. కోహ్లీ, రోహిత్ లు భారత్ కు ప్రపంచకప్ తీసుకురాలేరని కుండబద్దలు కొట్టాడు. వాళ్లిద్దరి మీద అతిగా ఆధారపడటం మానేస్తే తప్ప టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ దక్కదని తేల్చేశాడు. 
 

ఏబీపీ న్యూస్ తో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ మీరు ప్రపంచకప్ గెలవాలనుకుంటే  హెడ్ కోచ్, సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.  వ్యక్తిగత ఆసక్తులను పక్కనబెట్టి జట్టు  గురించి ఆలోచించాలి.  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఇద్దరు ముగ్గురు ప్లేయర్ల మీద భారం వేసి వాళ్లను వరల్డ్ కప్ తీసుకురమ్మంటే అది జరగని పని... 

మీరు మీ టీమ్ పై పూర్తి నమ్మకముంచాలి. మనకు అసలు అలాంటి టీమ్  ఉందా..?    గుండె మీద చేయి వేసుకుని వీళ్లు మ్యాచ్ ను గెలిపించగలరనే మ్యాచ్ విన్నర్లు ఉన్నారా..? జట్టులో కొందరు బాగా ఆడుతున్నారు.  కానీ ఒకరిద్దరి మీదో ఆధారపడితే ఐసీసీ వంటి టోర్నీలలో రాణించలేం.

కనీసం  జట్టులో ఆరుగురు దాకా మ్యాచ్ విన్నర్లు ఉంటే అప్పుడు ఫలితాలు ఆశించిన విధంగా వస్తాయి. జట్టును అలా తయారుచేయాలి.   విరాట్, రోహిత్ లను వదిలేయండి, యువకులు ముందుకురావాలి. వాళ్లు బాధ్యతలు తీసుకోవాలి...’ అని వ్యాఖ్యానించాడు. 

click me!