రెండు నెలలుగా భారత్ తో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ -16 రెండ్రోజుల క్రితమే ఘనంగా ముగిసింది. సీజన్ ఆరంభం నుంచి ముగిసేదాకా ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగి అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్న ఐపీఎల్.. టీవీ, మొబైల్ వ్యూయర్షిప్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.
అయితే ఐపీఎల్ కు పోటీగా క్రికెట్ క్రేజ్ ఉన్న చాలా దేశాలలో కొత్త లీగ్ లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు ఇటీవలే దక్షిణాఫ్రికాలో సౌతాఫ్రికా 20 (ఎస్ఎ 20) కూడా ప్రాచుర్యం పొందుతోంది. తాజాగా జులై నుంచి అమెరికాలో కూడా మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) ఆరంభం కానున్నది.
ఈ నేపథ్యంలో ఈ లీగ్ ల వల్ల ఐపీఎల్ క్రేజ్ కు ఏమైనా ప్రమాదం వాటిల్లబోతుందా..? అన్న అనుమానాలను ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ కొట్టిపారేశాడు. అసలు ఈ లీగ్ లేవీ ఐపీఎల్ కు పోటీ రావని.. తమకు ఎవరూ పోటీ రానని కుండబద్దలు కొట్టాడు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ తో అరుణ్ ధుమాల్ స్పందిస్తూ... ‘కొత్తగా వచ్చిన లీగ్ లతో పాటు గతంలో ఉన్న లీగ్స్ తో కూడా మాకు ఏ సమస్యా లేదు. మేం వాటిని మా పోటీదారులుగా చూడటం లేదు. కొత్తగా క్రికెట్ లీగ్స్ ను ప్రారంభిస్తున్న క్రికెట్ బోర్డులకు మా (బీసీసీఐ) తరఫున అభినందనలు చెబుతున్నాం.
అవేవీ కూడా ఐపీఎల్ కు దరిదాపుల్లోకి రావు. వాటివల్ల ఐపీఎల్ కు వచ్చిన నష్టమేమీ లేదు..’ అని తెలిపాడు. ఐపీఎల్ -16 తాము అనుకున్నదానికంటే విజయవంతమైందని.. చాలా మ్యాచ్ లు లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ థ్రిల్లర్ లుగా ముగియడంతో చాలా మంది అభిమానులను అలరించినందని చెప్పాడు.
‘ఐపీఎల్ -16 అత్యద్భుత విజయం సాధించింది. ఈ ఏడాది జరిగిన మ్యాచ్ లు చాలా ఉత్కంఠగా ముగిశాయి. చాలా మ్యాచ్ లు లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లే. ఫ్యాన్స్ నుంచి మేం ఆశించినదానికంటే అదనపు రెస్పాన్స్ వచ్చింది. మా బ్రాడ్కాస్టర్లకు కూడా ఊహించని వ్యూయర్షిప్ వచ్చింది.. వాళ్లు (స్టార్, జియో) కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు..’ అని తెలిపాడు.