Sai Sudarshan
GT vs RR IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ మరోసారి ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారీ విజయాన్ని అందుకుంది. సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ టీమ్ పై ఏకంగా 58 పరుగుల తేడాతో గుజరాత్ విజయాన్ని అందుకుంది.
ఐపీఎల్ 2025 23వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడింది. బుధవారం (ఏప్రిల్ 9) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కు ఈ సీజన్లో ఐదు మ్యాచ్ల్లో ఇది ఇది నాలుగో గెలుపు. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది. కాగా, గత 5 మ్యాచ్ల్లో రాజస్థాన్కు ఇది మూడో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆర్ఆర్ ఏడో స్థానంలోకి చేరుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మొదట ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. భారీ టార్గెట్ లో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాజస్థాన్ వరుస రెండు విజయాల పరంపరకు అహ్మదాబాద్లో బ్రేక్ పడింది.
గుజరాత్ ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ సూపర్ నాక్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే, జోస్ బట్లర్ 36, షారుక్ ఖాన్ 36 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2, తీక్షణ 2 వికెట్లు తీసుకున్నారు.
భారీ టార్గెట్ ఛేదనలో రాజస్థాన్ కు మంచి శుభారంభం లభించలేదు. జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 6 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సంజూ శాంసన్ 41, రియాన్ పరాగ్ 26, హిట్మేయర్ 52 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు కానీ, జట్టుకు విజయాన్ని అందించే వరకు క్రీజులో నిలబడలేకపోయారు.
గుజరాత్ గెలుపులో హీరోగా సాయి సుదర్శన్
గుజరాత్ గెలుపులో యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ హీరోగా నిలిచాడు. మరోసారి అద్బుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అతను 53 బంతుల్లో 82 పరుగుల ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్లో అతనికి ఇది మూడో హాఫ్ సెంచరీ. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో సాయి సుదర్శన్ రెండవ స్థానానికి చేరుకున్నాడు. అతను 5 మ్యాచ్ల్లో 273 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని సగటు 54.60, 151.67 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. మొత్తంగా 16 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు.
గత రెండు మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లను రాజస్థాన్ ఓడించింది. ఈ సీజన్లో ఆర్ఆర్ కు ఇది మూడో ఓటమి. దీనికి ముందు, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు, గుజరాత్ వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్ చేతిలో తొలి మ్యాచ్ ఓడిన తర్వాత, వారు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్లను ఓడించింది.