
నో కెమెరాలు, నో బాడీగార్డ్స్, నో హడావుడి! చేతిలో ఒక ట్రాలీ బ్యాగ్, సాధారణ జీన్స్ అండ్ స్కై-బ్లూ షర్ట్. బెంగళూరు 'నమ్మ మెట్రో'లో ప్రయాణిస్తున్న ఈయనను చూస్తే పక్కా ఐటీ ఎంప్లాయ్నో లేక బిజినెస్ ట్రావెలరో అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఒకప్పుడు మైదానంలో పవర్ ఫుల్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన టీమిండియా పేస్ గుర్రం, 'మైసూర్ ఎక్స్ప్రెస్' జవగల్ శ్రీనాథ్ ఈయన.
తాజాగా ఆయన బెంగళూరు మెట్రోలో సాదాసీదాగా ప్రయాణిస్తూ కనిపించిన ఒక పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి హంగులు లేకుండా, ఒక కామన్ మ్యాన్లా ఆయన వెళ్తున్న తీరు నెటిజన్లను, క్రికెట్ లవర్స్ న విపరీతంగా ఆకట్టుకుంటోంది.
నెట్లో చక్కర్లు కొడుతున్న ఆ ఫొటోలో శ్రీనాథ్ మెట్రో కోచ్లో నిలబడి ఉన్నారు. ఆయన పక్కనే ఒక చిన్న ట్రాలీ బ్యాగ్ ఉంది. బ్లూ జీన్స్, లైట్ బ్లూ షర్ట్ వేసుకుని చాలా సాధారణంగా కనిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఎన్నో విజయాలు అందించిన ఒక స్టార్ క్రికెటర్, 2003 వరల్డ్ కప్ ఫైనల్ వరకూ టీమిండియాను నడిపించిన గ్రేట్ ప్లేయర్ ఇలా ఏమాత్రం ఈగో లేకుండా సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే ఈ ఫొటో సరిగ్గా ఏ రోజు తీశారనేది స్పష్టంగా తెలియకపోయినా, ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. శ్రీనాథ్ సింప్లిసిటీకి కనెక్ట్ అయిన అభిమానులు లైక్స్, కామెంట్లతో రీపోస్ట్లు చేస్తున్నారు.
ఈ ఫొటో చూసిన అభిమానులు శ్రీనాథ్ వినయానికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. "క్రికెట్లో ఎంతో సాధించినా, బయట మాత్రం ఎంత సింపుల్గా ఉన్నారో చూశారా!" అని కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన కొందరు యూజర్లు స్పందిస్తూ.. "శ్రీనాథ్ను ఇలా నగరంలో చాలాసార్లు చూశాం. ఆయన ఎప్పుడూ ఎలాంటి సెక్యూరిటీ లేదా హడావుడి లేకుండానే తిరుగుతారు" అని తమ అనుభవాలను పంచుకున్నారు.
మరికొందరైతే కర్ణాటక క్రికెటర్ల సంస్కృతిని గుర్తుచేసుకున్నారు. "రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్, జవగల్ శ్రీనాథ్.. ఈ జనరేషన్ కర్ణాటక ప్లేయర్లంతా ఒకే టైప్.. ఎంత సక్సెస్ వచ్చినా గ్రౌండెడ్గా, సింపుల్గా ఉండడమే వీళ్ల స్పెషాలిటీ" అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
శ్రీనాథ్ సింప్లిసిటీ వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో (2022లో) కూడా ఆయన మైసూరు రైల్వే స్టేషన్లో వీపుపై ఒక చిన్న బ్యాగ్ వేసుకుని రైలు కోసం సాధారణ ప్రయాణికుడిలా వేచి చూస్తున్న పిక్ ఒకటి లింక్డిన్, ఎక్స్లలో వైరల్ అయ్యింది. సెలబ్రిటీ హోదా ఉన్నప్పటికీ, ఒక సాధారణ పౌరుడిలా జీవితాన్ని గడపడం ఆయనకు అలవాటేనని అభిమానులు అంటున్నారు.
హాసన్ జిల్లాలో 1969 ఆగస్టు 31న జన్మించిన శ్రీనాథ్, క్రికెట్లోకి రాకముందు ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1991 ఆస్ట్రేలియా టూర్తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, కపిల్ దేవ్ రిటైర్మెంట్ తర్వాత భారత పేస్ రంగానికి ప్రధాన ఆయుధంగా మారారు.
జవగల్ శ్రీనాథ్ టీమిండియా తరఫున 67 టెస్టులు, 229 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 236 వికెట్లు తీయగా, వన్డేల్లో ఏకంగా 315 వికెట్లు పడగొట్టారు. వన్డేల్లో 300కి పైగా వికెట్లు తీసిన ఏకైక భారత పేస్ బౌలర్ శ్రీనాథ్ కావడం విశేషం. టెస్టుల్లో కపిల్ దేవ్ తర్వాత 200 వికెట్ల మార్కు దాటిన రెండో ఇండియన్ పేసర్ కూడా ఆయనే.
1992, 1996, 1999, 2003.. ఇలా నాలుగు ఐసీసీ వన్డే వరల్డ్ కప్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన శ్రీనాథ్, ప్రపంచకప్లలో మొత్తంగా 44 వికెట్లు పడగొట్టారు. 2003 వరల్డ్ కప్ తర్వాత ఆయన అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు.
ప్లేయర్గా రిటైర్ అయినప్పటికీ, శ్రీనాథ్ ఆట నుంచి పూర్తిగా దూరం కాలేదు. టీవీ కామెంటేటర్గా, ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో సేవలు అందించారు. ఆ తర్వాత 2006లో ఐసీసీ మ్యాచ్ రెఫరీగా బాధ్యతలు చేపట్టారు. 2010లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రెఫరీగా ప్రమోట్ అయ్యి, ఇప్పటివరకు వందలాది అంతర్జాతీయ మ్యాచ్లకు రెఫరీగా వ్యవహరించారు.
సెలబ్రిటీ లైఫ్ను ప్రదర్శించకుండా, తన పని తాను చేసుకుంటూ నగరంలో ఒక సాదాసీదా పౌరుడిలా ప్రయాణించిన ఈ మైసూర్ ఎక్స్ప్రెస్ పిక్, ఇప్పుడు స్పోర్ట్స్ లవర్స్ కు ఒక మంచి రిమైండర్లా నిలిచింది.