తేనెటీగల దాడిలో అంపైర్ మరణించగా ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన క్రికెట్ ప్రియులను కలచివేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు దూసుకువచ్చి ఆటగాళ్లు, అంపైర్లపై దాడికి పాల్పడ్డాయి.. ఓ అంపైర్ ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన ఇండియన్ క్రికెట్ లో విషాదాన్ని నింపింది.
24
అసలు ఏం జరిగింది..?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ పట్టణంలో కేడీఎంఏ (KDMA) లీగ్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో భాగంగానే వైఎంసీసీ, ప్యారమౌంట్ జట్లు తలపడ్డాయి... ఈ మ్యాచ్ జరుగుతుండగా తేనెటీగల గుంపు ఒక్కసారిగా మైదానంలోకి ప్రవేశించింది. మైదానంలో క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లతో పాటు అంపైర్లపై దాడి చేశాయి.
లీగ్ టోర్నమెంట్ కావడంతో ఆటగాళ్లు, అంపైర్లు అందరూ జెర్సీల్లోనే ఉన్నారు. రెండు జట్ల ప్లేయర్లు నీలం, ముదురు నీలం రంగు జెర్సీలు ధరించగా అంపైర్లు ఎప్పటిలాగే తెల్లని దుస్తుల్లో ఉన్నాయి. ఈ దుస్తులే కారణమో లేక ఇంకేదైనా కారణం ఉందేమో తెలీదుగానీ తేనెటీగలు ఆటగాళ్ల కంటే అంపైర్లపైనే ఎక్కువగా దాడిచేశాయి. దీంతో అంపైర్లు మాణిక్ గుప్తా, జగదీశ్ శర్మలు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ఆటగాళ్లపై కూడా ఈ తేనెటీగలు దాడిచేయగా గాయపడ్డారు.
34
అంపైర్ మృతి...
తేనెటీగలు అంపైర్లను చుట్టుముట్టగానే ఆటగాళ్లు బ్యాట్లు ఊపుతూ వారిని కాపాడి పెవిలియన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ తేనెటీగలు పెద్దసంఖ్యలో అంపైర్లపై దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 65 ఏళ్ల మాణిక్ గుప్తా ప్రాణాలు కోల్పోయారు. మరో అంపైర్ జగదీశ్ శర్మ తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన అంపైర్, క్రికెటర్లను వెంటనే ఉన్నావ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అంపైర్ మాణిక్ గుప్తా పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను కాన్పూర్లోని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి మార్చారు. అక్కడి నుంచి లక్ష్మీపత్ సింఘానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇలా ఎంత ప్రయత్నించినా అతడి ప్రాణాలు దక్కలేవు... పరిస్థితి విషమించడంతో మాణిక్ గుప్తా మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
దాదాపు 10 నిమిషాల పాటు ఈ తేనెటీగల దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం గాయపడిన అంపైర్ జగదీశ్ శర్మతో పాటు మరికొందరు క్రికెటర్లు కాన్పూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తేనెటీగల దాడిలో మరణించినమాణిక్ గుప్తా కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ లో చాలాకాలంగా అంపైర్ గా సేవలందిస్తున్నారు. అతడి మైదానంలో ఉండగా తేనెటీగల దాడికి గురయి మరణించడంపై ఈ క్రికెట్ అసోసియేషన్ విచారం వ్యక్తం చేసింది. అతడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.