వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి బీసీసీఐ ప్రవేశపెట్టబోతున్న ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ గురించి ఆసక్తికర చర్చ సాగుతున్న క్రమంలో బోర్డు.. ఫ్రాంచైజీలకు మరో షాకిచ్చింది. ఈ రూల్ ప్రకారం.. ప్రతీ జట్టు మ్యాచ్ కు ముందు నలుగురు ప్లేయర్లను సబ్ స్టిట్యూట్స్ గా ప్రకటించాలి. 14 ఓవర్ల ఆట తర్వాత ఈ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా తుది జట్టులోకి తీసుకోవచ్చు.
ఫుట్బాల్, రగ్బీ వంటి గేమ్స్ లో ఈ కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. దీంతో ఈ తరహా ప్రయోగం క్రికెట్ లో కూడా చేసి తద్వారా టీ20కి మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది. వచ్చే సీజన్ నుంచి ఈ కొత్త రూల్ ను తీసుకురాబోతున్నది.
ఇదిలాఉండగా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను కేవలం ఇండియన్ ప్లేయర్స్ కే వర్తింపజేయనున్నదట. ఫారెన్ ప్లేయర్స్ కు ఈ రూల్ వర్తించదు. క్రిక్ బజ్ లో వచ్చిన సమాచారం మేరకు.. ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ ఇండియా ప్లేయర్స్ కు మాత్రమే వర్తిస్తుందని బీసీసీఐ మేనేజర్లు ఫ్రాంచైజీలకు తెలిపారు.
ఈ రూల్ ఓవర్సీస్ ప్లేయర్లకు వర్తించదు అని ఫ్రాంచైజీలకు వివరించారు. అందుకు గల కారణాలను కూడా జట్లకు క్షుణ్ణంగా తెలిపినట్టు సమచారం. నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంచైజీ మ్యాచ్ లో నలుగురు ఫారెన్ ప్లేయర్లను మాత్రమే ఆడించేందుకు అనుమతి ఉంది.
ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ ను అమలుచేస్తే అప్పుడు ఐదుగురు ఫారెన్ ప్లేయర్లను ఆడించినట్టు అవుతుంది. అది నిబంధనలకు విరుద్ధం. అందుకే ఈ రూల్ కేవలం ఇండియన్ క్రికెటర్స్ కే వర్తిస్తుందని బీసీసీఐ ఫ్రాంచైజీలకు వివరించే ప్రయత్నం చేస్తున్నది.
అలా కాకుండా ముగ్గురు ఫారెన్ ప్లేయర్లను తీసుకుంటే అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను వాడుకోవచ్చా..? అని ఫ్రాంచైజీలు ప్రశ్నిస్తుండగా దానిపై బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నది. త్వరలో జరుగనున్న ఐపీఎల్ వేలం తర్వాత దీనిపై పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.