ఇమ్రాన్ ఖాన్‌పై దాడి... మరోసారి తెరపైకి ఆసియా కప్ 2023! మాజీ ప్రధానికే భద్రత లేనప్పుడు...

First Published Nov 4, 2022, 10:16 AM IST

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగిన సంఘటన, మరోసారి పాకిస్తాన్‌లో తీవ్రవాద చర్యల గురించి చర్చ జరిగేలా చేసింది. దాదాపు దశాబ్దన్నర తర్వాత పాక్‌లో పరిస్థితులు కుదురుకుని, ఇంగ్లాండ్, న్యూజిలాండ్,ఆస్ట్రేలియా వంటి దేశాలు పర్యటిస్తున్న సమయంలో జరిగిన దాడి... అక్కడ క్రికెట్‌ భవిష్యత్తును మరోసారి ప్రశ్నార్థకంలోని నెట్టేసింది...

India vs Pakistan

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కి ముందే ఆసియా కప్ 2023 టోర్నీ గురించి చర్చ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో వచ్చే ఏడాది ఆగస్టులో ఆసియా కప్ 2023 టోర్నీ జరగాల్సి ఉంది. పాక్‌లో జరిగే ఈ టోర్నీ గురించి బీసీసీఐ స్పందించిన తీరు... హాట్ టాపిక్ అయ్యింది...

కేంద్ర ప్రభుత్వం చెబితే పాక్‌లో పర్యటించి, ఆసియా కప్ 2023 టోర్నీ ఆడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కామెంట్ చేశాడు. అయితే బీసీసీఐ సెక్రటరీ జై షా మాత్రం పాక్‌లో పర్యటించేది లేదని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 నిర్వహిస్తామని వ్యాఖ్యానించి... పాక్ క్రికెట్ బోర్డుకి షాక్ ఇచ్చాడు...

Imran Khan

పాక్‌లో ఆసియా కప్ 2023 నిర్వహించకపోతే, తాము ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023లో పాల్గొనబోమని పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా కామెంట్ చేయడంతో ఈ టోర్నీ గురించి చాలా పెద్ద చర్చే జరిగింది. తాజాగా మాజీ ప్రధాని, పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన దాడితో పాక్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ జరగడం అసాధ్యంగానే మారింది...

పాక్ మాజీ ప్రధానికే అక్కడ భద్రత లేనప్పుడు, భారత క్రికెటర్లకు ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు టీమిండియా అభిమానులు. ఇంతకుముందు పాక్‌లో పర్యటించిన శ్రీలంక జట్టు పరిస్థితి ఏమైందో క్రికెట్ ప్రపంచం ఇంకా మరిచిపోలేదని, టీమిండియా అలాంటి రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేదని అంటున్నారు...

India vs Pakistan

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత డిసెంబర్‌లో ఇంగ్లాండ్ జట్టు, మరోసారి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు కూడా పాక్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఇమ్రాన్ ఖాన్‌పై దాడి జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ రెండు జట్లు, పాక్‌లో పర్యటించేందుకు ధైర్యం చేస్తాయా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.. 

click me!