
ప్రతిభ ఉండి, ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు డబ్బు సమస్య అడ్డంకి కాకూడదు. అందుకే భారత ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి విద్యా లక్ష్మి ఎడ్యుకేషన్ లోన్' పథకాన్ని తీసుకొచ్చింది. దేశంలోని టాప్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ఈజీగా ఈ లోన్ పొందవచ్చు… ఇందుకోసం ఎలాంటి ఆస్తి పత్రాల హామీ లేదా థర్డ్-పార్టీ గ్యారెంటీ అవసరం లేదు.
విద్యార్థుల ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాలు, ల్యాప్టాప్ వంటి ఖర్చుల ఆధారంగా లోన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. రూ.7.5 లక్షల వరకు ఉన్న లోన్లకు భారత ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది. మెరిట్ లేదా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా సీటు సంపాదించిన విద్యార్థులకు మాత్రమే ఈ లోన్ వర్తిస్తుంది. మేనేజ్మెంట్ కోటాలో చేరిన వారికి ఈ లోన్ ఇవ్వరు.
ఈ ఎడ్యుకేషన్ లోన్ దేశంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చేసే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సులకు వర్తిస్తుంది. విదేశీ విద్యాసంస్థల్లో లేదా భారత సంస్థల విదేశీ క్యాంపస్లలో చదువులకు ఈ స్కీమ్ వర్తించదు.
ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో విద్యార్థుల కుటుంబ ఆదాయం ఆధారంగా చదువుకునే సమయంలో వడ్డీ రాయితీ ఇస్తారు. కుటుంబ ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉంటే టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులకు 100% వడ్డీ రాయితీ... ఇతర కోర్సులకు 3% వడ్డీ రాయితీ లభిస్తుంది.
కుటుంబ ఆదాయం రూ.4.5 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య ఉంటే… రూ.10 లక్షల వరకు ఉన్న లోన్లపై 3% వడ్డీ రాయితీ ఇస్తారు. ఈ సదుపాయం ప్రాధాన్య క్రమంలో ఏటా గరిష్ఠంగా లక్ష మంది విద్యార్థులకు అందిస్తారు. చదువుకునే సమయంలోనే వడ్డీని సరిగ్గా చెల్లిస్తే అదనంగా 1% వరకు వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంది. వడ్డీ రాయితీ మొత్తాన్ని నేరుగా 'పీఎం విద్యాలక్ష్మి డిజిటల్ రూపీ మొబైల్ యాప్' ద్వారా విద్యార్థుల లోన్ అకౌంట్లో జమ చేస్తారు.
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ కింద లోన్ పొందాలంటే దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దేశంలోని 860 నాణ్యమైన ఉన్నత విద్యాసంస్థల్లో, టాప్ 100 ర్యాంకుల్లో ఉన్న సంస్థల్లో లేదా 101 నుంచి 200 ర్యాంకుల మధ్య ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ పొంది ఉండాలి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా మార్కుల మెరిట్ ఆధారంగా అడ్మిషన్ పొంది ఉండాలి. మేనేజ్మెంట్ కోటా లేదా ఇతర మార్గాల్లో సీటు పొందిన వారు ఈ లోన్ పొందలేరు.
చదువు పూర్తయ్యాక ఒక సంవత్సరం వరకు లోన్ వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు, గ్రేస్ పీరియడ్ ముగిశాక గరిష్ఠంగా 15 ఏళ్లలో (180 నెలల వాయిదాల్లో) లోన్ తిరిగి చెల్లించడానికి సమయం ఇస్తారు. లోన్ను ముందుగానే చెల్లించాలనుకుంటే ఎలాంటి జరిమానా ఉండదు. దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 10వ, 12వ తరగతి మార్కుల షీట్లు, కాలేజీ అడ్మిషన్ ప్రూఫ్, కాలేజీ ఫీజుల వివరాలు, ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్, ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యార్థి, తల్లిదండ్రుల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరి.
ఈ పథకం పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థులు బ్యాంకు బ్రాంచ్కు నేరుగా వెళ్లడానికి ముందు ఆన్లైన్లో అప్లై చేయాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక పీఎం విద్యాలక్ష్మి పోర్టల్కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ ఉన్న 'కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్' నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, బ్యాంకుల జాబితాలో మీకు నచ్చిన బ్యాంకును ఎంపిక చేసుకోవాలి. మీ అర్హతకు సరిపోయే లోన్ స్కీమ్ను ఎంచుకుని అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక, సంబంధిత విద్యాసంస్థ లేదా మీ నివాసానికి దగ్గరలోని బ్రాంచ్ ద్వారా బ్యాంకు మీ లోన్ను వేగంగా పరిశీలించి ఆమోదం తెలుపుతుంది.
రూ.7.5 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకునేవారు స్థిర లేదా చర ఆస్తులను హామీగా చూపించాలి. స్థిరాస్తులు అయితే భూమి లేదా భవనంపై హక్కును నిరూపించే పత్రాలు ఇవ్వాలి. వ్యవసాయేతర భూమి వినియోగ పత్రం, సేల్ డీడ్, రిజిస్టర్డ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్, బిల్డింగ్ ప్లాన్ వంటివి అందించాలి. చరాస్తులు అయితే ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్లు, ఎల్ఐసీ పాలసీలు, ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను హామీగా పెట్టవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు దూరమవుతున్న విద్యార్థులకు ఈ స్కీమ్ మంచి అవకాశాన్ని అందిస్తోంది.