
బంగారం వ్యాపారంలో దేశంలోనే టాప్ పొజిషన్లో ఉంది జాయ్ అలుక్కాస్ జువెల్లర్స్... అయితే దీని సక్సెస్ వెనకున్నది ఓ స్కూల్ డ్రాపవుట్ కావడం ఆసక్తికరం. తన పేరునే బ్రాండ్ గా మార్చుకున్న జాయ్ అలుక్కాస్ సక్సెస్ స్టోరీ నేటితరం యువతకు స్ఫూర్తినిస్తుంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చే అనేది ఆయన జీవితపాఠాల నుండి నేర్చుకోవచ్చు.
కేరళ రాష్ట్రంలోని త్రిశూర్లో తండ్రి నడిపే చిన్న నగల దుకాణంతో మొదలైంది జాయ్ అలుక్కాస్ వ్యాపార ప్రస్థానం… ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఓ పెద్ద జువెల్లరి సామ్రాజ్యంగా మారింది. గల్ఫ్ దేశాలకు వ్యాపారాన్ని విస్తరించడం, టెక్నాలజీని వాడుకోవడం, సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. ఫోర్బ్స్ ప్రకారం… 2026 నాటికి ఆయన సంపద సుమారు 6 బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.48,000 కోట్ల రూపాయలు)
జాయ్ అలుక్కాస్ 1956లో త్రిశూర్ కు చెందిన వ్యాపార కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి అలుక్కా జోసెఫ్ వర్గీస్ త్రిశూర్లోనే ఒక నగల దుకాణాన్ని నడిపేవాడు. ఈ కుటుంబానికి జువెల్లరీ బిజినెస్ తో పాటు ఇతర వ్యాపారాలు ఉండేవి…. ఉమ్మడిగా ఉంటూనే వీటిని చూసుకునేవారు. ఇలా కుటుంబవ్యాపారంలో జాయ్ అడుగుపెట్టి అద్భుతాలు చేశాడు… కేవలం దుకాణంలో కూర్చొని అమ్మకాలు చూసుకోవడం కంటే ఏదైనా పెద్దగా సాధించాలనే తపనే ఈ స్థాయికి చేర్చింది. జాయ్ అలుక్కాస్ ఆయన స్కూల్ చదువును కూడా మధ్యలోనే ఆపేసి వ్యాపార రంగంలోకి దిగి సక్సెస్ అయ్యాడు.
1980లలో కేరళ నుంచి చాలామంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవాళ్లు. అక్కడ ఉన్న మలయాళీలకు బంగారంపై ఉన్న ఇష్టాన్ని జాయ్ గమనించారు. దీన్నే అవకాశంగా మార్చుకుని కుటుంబ వ్యాపారాన్ని మధ్యప్రాచ్యానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. 1986లో దుబాయ్ వెళ్లి అక్కడి గోల్డ్ మార్కెట్పై స్టడీ చేశారు. గల్ఫ్లో సొంతంగా మార్కెట్ సృష్టించుకోవడానికి పక్కా ప్లాన్ వేశారు.
1987-88 మధ్యకాలంలో అబుదాబిలో మొదటి విదేశీ స్టోర్ను ప్రారంభించి గల్ఫ్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. అక్కడ ఉన్న మలయాళీ వలసదారులే ఆయనకు ప్రధాన కస్టమర్లు అయ్యారు. వ్యాపారం వేగంగా పెరుగుతుండటంతో జాయ్ కేవలం కొత్త షాపులు తెరవడంపైనే కాకుండా, బిజినెస్ను ఒక సిస్టమ్ ప్రకారం నడపడంపై దృష్టి పెట్టారు. దీనికోసం కొత్త టెక్నాలజీ, ప్రాసెస్లను ప్రవేశపెట్టారు. ఇలా వ్యాపారాన్ని, టెక్నాలజీ మిక్స్ చేసి అద్భుతాలు చేశాడు.
జువెల్లరీ వ్యాపారం అంటే ఓనర్ కచ్చితంగా కౌంటర్లో కూర్చోవాలనే పాత పద్ధతిపై జాయ్కి నమ్మకం లేదు. అందుకే షాపుల్లో సాఫ్ట్వేర్, టెక్నాలజీ ఆధారిత పనివిధానం, స్టాండర్డ్ ప్రాసెస్లు, ఉద్యోగులకు యూనిఫాం, లాయల్టీ ప్రోగ్రామ్స్, అన్నిచోట్లా ఒకేరకమైన బ్రాండింగ్ వంటివి అమలు చేశారు. దీంతో ఓనర్ ప్రతి షాపులో ఉండాల్సిన అవసరం తప్పింది. వ్యాపార విస్తరణ, కొత్త వ్యూహాలపై పూర్తి దృష్టి పెట్టడానికి వీలు కలిగింది.
2000ల ప్రారంభంలో కుటుంబ వ్యాపారంలో వాటాలు పంచుకున్నప్పుడు, గల్ఫ్ వ్యాపార బాధ్యతలను జాయ్ అలుక్కాస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇండియాలో సొంతంగా బ్రాండ్ను విస్తరించడంపై ఫోకస్ పెట్టారు. 2005లో తన వ్యాపారానికి 'Joyalukkas' అని పేరు పెట్టారు. ఆ తర్వాత చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో స్టోర్లు తెరిచి భారత మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
భారతదేశంలో జువెల్లరీ మార్కెట్ అప్పుడప్పుడే ఆర్గనైజ్డ్ సెక్టార్గా మారుతున్న సమయంలో, జాయ్ అలుక్కాస్ ఫ్రాంచైజీ మోడల్కు బదులుగా సొంతంగా స్టోర్లు నడిపే పద్ధతిని ఎంచుకున్నారు. ప్రస్తుతం భారతదేశంలో 'Joyalukkas'కు 100కు పైగా స్టోర్లు ఉన్నాయి. విదేశాల్లో దాదాపు 60 స్టోర్లు ఉన్నాయి. యూఏఈ, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, సింగపూర్, మలేషియా వంటి అనేక దేశాల్లో ఈ బ్రాండ్కు ఉనికి ఉంది.
జాయ్ అలుక్కాస్ కంపెనీ భారతీయ వ్యాపారం కూడా భారీగా వృద్ధి చెందుతోంది. కొన్ని సంస్థల సమాచారం ప్రకారం... ఆర్థిక సంవత్సరం 2026లో జాయ్ అలుక్కాస్ కంపెనీ ఆదాయం రూ.24,439.45 కోట్లకు చేరుకుంది. FY25లో ఇది రూ.20,232.89 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.3,367 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.1,690.77 కోట్లు మాత్రమే.
బంగారం వ్యాపారంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాయ్ అలుక్కాస్ గ్రూప్ మరిన్ని రంగాల్లో అడుగుపెట్టింది. మనీ ఎక్స్ఛేంజ్, టెక్స్టైల్స్, మాల్స్, రియల్ ఎస్టేట్ వంటి అనేక ఇతర రంగాల్లోనూ ఈ గ్రూప్ విస్తరించింది. ఇలా స్కూల్ డ్రాపవుట్ అయిన ఓ వ్యక్తి ఇప్పుడు ఉన్నత చదువులు చదివినవారికి ఉద్యోగాలు ఇస్తున్నారు... వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. విజయం అంటే ఇలా ఉండాలి అనేలా జాయ్ అలుక్కాస్ ప్రస్థానం సాగింది.