
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన పర్సనల్ ఇన్సాల్వెన్సీ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఒక సంచలన రీపేమెంట్ ప్లాన్కు ఆమోదం తెలిపింది. ఆయనపై నమోదైన రూ. 22,006 కోట్ల అంగీకరించిన క్లెయిమ్లను కేవలం రూ. 6.25 కోట్లు చెల్లించడం ద్వారా సెటిల్ చేసుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించింది.
ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ తీర్పుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణదాతలైన బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించలేమని, ఇది ఎంతమాత్రం సరికాదని అంటున్నాయి. మరోవైపు, మీడియాలో ప్రచారమవుతున్న 99.97 శాతం రుణ మాఫీ వార్తలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు తనపై ఉన్న క్లెయిమ్ సైజ్ ఇంత పెద్దది కాదని సుభాష్ చంద్ర స్వయంగా వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఈ వివాదంపై ఢిల్లీలోని NCLT బెంచ్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అంతకుముందు ఇద్దరు సభ్యుల బెంచ్లో భిన్నాభిప్రాయాలు రావడంతో, ఈ కేసును మూడో జ్యుడీషియల్ మెంబర్ నీలేష్ శర్మకు బదిలీ చేశారు. ఆయన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (IBC) సెక్షన్ 114 కింద ఈ ప్లాన్ను క్లియర్ చేశారు.
ఈ ప్లాన్ ప్రకారం, సుభాష్ చంద్ర తన వ్యక్తిగత పూచీకత్తు హోదాలో రూ. 6.25 కోట్లు చెల్లిస్తారు. దీనితో పాటు, రుణం తీసుకున్న ప్రధాన సంస్థలు విడిగా సుమారు రూ. 1,494 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 80.8 శాతం ఓటింగ్ షేర్ ఉన్న రుణదాతలు ఈ ప్లాన్కు సపోర్టు ఇచ్చారు. అయితే LIC హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL), హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్లు మాత్రం ఈ రీపేమెంట్ ప్లాన్కు వ్యతిరేకంగా ఓటు వేశాయి.
రీజల్యూషన్ ప్రొఫెషనల్ అంచనా ప్రకారం.. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ ఈ రీపేమెంట్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న దానికంటే చాలా తక్కువగా ఉందని జ్యుడీషియల్ మెంబర్ నీలేష్ శర్మ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనను దివాళా తీసినట్లు ప్రకటించడం వల్ల వ్యతిరేకిస్తున్న బ్యాంకులకు ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
NCLT ఆమోదం తెలపడం అంటే బ్యాంకులు రూ. 22,000 కోట్ల రుణాలను వదులుకున్నట్లు కాదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. రూ. 22,006 కోట్ల అనేది సుభాష్ చంద్ర స్వయంగా తీసుకున్న రుణం కాదని, వివిధ ఎస్సెల్/జీ సంబంధిత కంపెనీలు తీసుకున్న రుణాలకు ఆయన 'పర్సనల్ గ్యారెంటర్'గా ఇచ్చిన గ్యారెంటీ క్లెయిమ్ల విలువ మాత్రమేనని తెలిపారు.
మొత్తం రూ. 22,006 కోట్ల క్లెయిమ్లలో కేవలం రూ. 2,574 కోట్లకు మాత్రమే రుణం తీసుకున్న ప్రారంభ సమయంలో సుభాష్ చంద్ర పర్సనల్ గ్యారెంటీ ఇచ్చారు. మిగిలిన గ్యారెంటీలన్నీ ఆ తర్వాత అదనపు సెక్యూరిటీగా ఇచ్చినవేనని వర్గాలు వెల్లడించాయి.
రుణం తీసుకున్న ప్రధాన కంపెనీలు (కార్పొరేట్ బోరోయర్స్) ఇప్పటికీ తమ బాకీలను తీర్చాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయి. సుభాష్ చంద్ర పర్సనల్ సెటిల్మెంట్తో సంబంధం లేకుండా, ఆ కంపెనీల ఆస్తులు, సెక్యూరిటీల నుంచి తమ బాకీలను వసూలు చేసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుంది. సుభాష్ చంద్ర రూ. 22,000 కోట్లు సొంతంగా అప్పు తీసుకోలేదని, ప్రచారంలో ఉన్న హెయిర్కట్ అనేది కేవలం ఒక గ్యారెంటర్గా ఆయన నుంచి వసూలు చేసే మొత్తానికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తీర్పును వ్యతిరేకించిన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL), తనకు రావాల్సిన సుమారు రూ. 22,006 కోట్ల క్లెయిమ్లకుగాను కేవలం రూ. 6.25 కోట్లు మాత్రమే కేటాయించడం చట్టవిరుద్ధమని, అంగీకరించలేనిదని వాదించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ ప్లాన్కు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు, తీర్పుపై అప్పీల్కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు, సుభాష్ చంద్ర వ్యక్తిగత నెట్ వర్త్ గతంలో చాలా ఎక్కువగా ఉండేదని బ్యాంకులు గుర్తు చేస్తున్నాయి. 2017లో ఆయన నికర ఆస్తుల విలువ రూ. 45,888 కోట్లుగా, 2018లో రూ. 40,562 కోట్లుగా నెట్ వర్త్ సర్టిఫికేట్లలో నమోదైంది. కానీ ఇప్పుడు ప్రకటిస్తున్న నెట్ వర్త్ కేవలం రూ. 31.79 కోట్లు మాత్రమే కావడంపై బ్యాంకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆస్తుల విలువ ఇంతగా ఎలా తగ్గిందో సమగ్రంగా విచారించాలని కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో LICHFL, హెచ్డిఎఫ్సి బ్యాంక్ NCLT తీర్పును నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT)లో సవాలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) జోక్యాన్ని కూడా కోరాలని LICHFL భావిస్తోంది.
తనపై వస్తున్న విమర్శలపై సుభాష్ చంద్ర స్పందించారు. "నేను ఏ బ్యాంక్ నుంచి కూడా సొంతంగా డబ్బులు అప్పుగా తీసుకోలేదు" అని అన్నారు. రీపేమెంట్ ప్లాన్ను వ్యతిరేకిస్తున్న బ్యాంకులు నాపై వేసిన క్లెయిమ్ విలువ కేవలం రూ. 3,992 కోట్లు మాత్రమేనని, రూ. 22,000 కోట్లు కాదని చెప్పారు.
ఈ రూ. 3,992 కోట్లలో ఇప్పటికే రూ. 620 కోట్లు సెటిల్ చేశామని, మరో రూ. 1,063 కోట్లు చెల్లించేందుకు రుణం తీసుకున్న కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. తాను గ్యారెంటీ ఇచ్చిన కంపెనీలు ఇప్పటివరకు రూ. 43,000 కోట్ల బాకీలను బ్యాంకులకు తిరిగి చెల్లించాయని, మిగిలిన బాకీలను కూడా ఆ కంపెనీలే చెల్లిస్తాయని సుభాష్ చంద్ర తెలిపారు.
సుభాష్ చంద్ర కేసు అనేది ఒక ప్రత్యేకమైన పర్సనల్ గ్యారెంటర్ రీజల్యూషన్ మాత్రమేనని, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (IBC) కింద జరిగే సాధారణ కార్పొరేట్ రికవరీలకు ఇది ప్రతిబింబం కాదని పీటీఐ వర్గాలు తెలిపాయి. దేశంలో IBC చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి మార్చి 2026 నాటికి రీజల్యూషన్ ప్లాన్ల ద్వారా బ్యాంకులు రూ. 4.32 లక్షల కోట్లను రికవరీ చేసుకున్నాయి. ఇది లిక్విడేషన్ విలువలో 116.85 శాతం కాగా, ఫెయిర్ వ్యాల్యూలో 94.56 శాతంగా ఉంది.
అంతేకాకుండా, ఇన్సాల్వెన్సీ ప్రక్రియలు అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే దాదాపు రూ. 14 లక్షల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన 32,000 కంటే ఎక్కువ కేసులు పరిష్కారమయ్యాయి. ఈ చట్టం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో ఇది తెలియజేస్తోందని అధికారులు వివరించారు.
బ్యాంకింగ్ రంగంలో నెట్ నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (NPAs) మార్చి 2018లో 5.94 శాతంగా ఉండగా, సెప్టెంబర్ 2025 నాటికి 0.48 శాతానికి పడిపోయాయి. నికర నిరర్థక ఆస్తులు రూ. 5.2 లక్షల కోట్ల నుంచి రూ. 94,000 కోట్లకు తగ్గాయి. ఐఐఎం అహ్మదాబాద్ అధ్యయనం ప్రకారం.. ఇన్సాల్వెన్సీ ద్వారా పునరుద్ధరించబడిన కంపెనీల సేల్స్ 76 శాతం, మొత్తం ఆస్తులు 50 శాతం, ప్రాజెక్టుల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 130 శాతం మేర పెరిగాయని వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసులో నెక్ట్స్ జరిగే పరిణామాలు ఏమిటి?
ప్రస్తుతం ఈ కేసు NCLT ఒరిజినల్ డివిజన్ బెంచ్కు తిరిగి వెళ్తుంది. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 419(5) ప్రకారం మెజారిటీ అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ బెంచ్ అధికారిక ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఆ తర్వాత LICHFL, హెచ్డిఎఫ్సి బ్యాంకులు NCLATని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ఎస్సెల్/జీ కంపెనీల ఆస్తులపై బ్యాంకులకు ఉన్న హక్కులు, రికవరీ ప్రక్రియలు విడిగా కొనసాగుతాయి.