Gold Price Hike: దేశంలో బంగారం ధరలు మరోసారి ఎగబాకాయి. ఈ మధ్య కాలంలో మళ్లీ పసిడి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే కొనసాగితే రూ.లక్షా యాభైవేలు దాటే అవకాశం కనిపిస్తోంది.
దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు ఇప్పుడు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలోని అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలను మరింత పైకి తీసుకెళ్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర త్వరలోనే రూ.1.50 లక్షల మార్క్ను చేరుకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
24
రూ.1,45,750కు చేరిన బంగారం
ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,750 పెరిగి రూ.1,45,750కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,600 పెరిగి రూ.1,33,600 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు, కోల్కతా, తిరువనంతపురం వంటి నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ధరలకు అదనంగా జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుందని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కిలో వెండి ధర రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది.
34
అమెరికా-ఇరాన్ మధ్య తీవ్రరూపం దాల్చిన ఘర్షణలు
బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ తీవ్రరూపం దాల్చిన ఘర్షణలే. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్లోని కీలక విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తుండగా, ఇరాన్ కూడా తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్, ఒమన్ వంటి దేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అయితే పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉండటంతో బంగారం ధరలు భవిష్యత్తులో కూడా అధిక స్థాయిలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.