Franchise: జేబులో రూ. 5 వేలు ఉంటే చాలు.. మీ సొంత వ్యాపారానికి మీరు బాస్ అయిన‌ట్లే

Published : Jun 03, 2026, 06:09 PM IST

Franchise: భారత తపాలా శాఖ ప్రజలకు కేవలం పొదుపు పథకాలు మాత్రమే కాకుండా, స్వయం ఉపాధి అవకాశాలను కూడా అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో సొంత వ్యాపారం ప్రారంభించాలని భావించే వారికి ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీ స్కీమ్ 2.0 మంచి అవకాశంగా చెప్పొచ్చు. 

PREV
15
ఫ్రాంచైజీ 2.0 ఎందుకు తీసుకొచ్చారు?

ఈ-కామర్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తపాలా శాఖ తన సేవలను ఆధునీకరించేందుకు కొత్త మార్పులు చేపట్టింది. అందులో భాగంగా ఫ్రాంచైజీ విధానాన్ని మరింత సులభతరం చేసి "ఫ్రాంచైజీ 2.0"గా అందుబాటులోకి తీసుకొచ్చింది. అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ (APT) ఆధారంగా పార్సిల్, కొరియర్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం దీని ఉద్దేశం. దీనివల్ల స్థానికంగా వ్యాపారం చేసుకుంటూనే ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది.

25
ఏ సేవలు అందించవచ్చు?

ఫ్రాంచైజీ పొందిన వారు పలు పోస్టల్ సేవలను నిర్వహించవచ్చు. స్పీడ్ పోస్ట్ బుకింగ్, పార్సిల్ బుకింగ్, ఇండియా పోస్ట్ పార్సిల్ సేవలు, అంతర్జాతీయ EMS సేవలు, క్యాష్ ఆన్ డెలివరీ, ఇంటి వద్ద నుంచే పార్సిల్ సేకరణ, క్లిక్ అండ్ బుక్ వంటి సేవలను అందించవచ్చు. కొత్త విధానంలో అభ్యర్థులు తమకు అనుకూలంగా కేవలం డెలివరీ సేవలు, కేవలం పికప్ సేవలు, బుకింగ్, పికప్, డెలివరీ వంటి సేవ‌ల‌ను పొందొచ్చు.

35
అర్హతలు, అవసరమైన సదుపాయాలు

18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, చిన్న వ్యాపారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. బుకింగ్ సేవలు నిర్వహించాలనుకునేవారు కనీసం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. డెలివరీ సేవలకు 10వ తరగతి అర్హత సరిపోతుంది. అలాగే స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ వినియోగంపై ప్రాథమిక అవగాహన ఉండాలి. డెలివరీ సేవలు అందించేవారికి డ్రైవింగ్ లైసెన్స్, సొంత వాహనం అవసరం. పాన్ కార్డు తప్పనిసరి. అయితే పోస్టల్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఈ పథకానికి అర్హులు కారు.

45
ఎంత పెట్టుబడి? ఎంత ఆదాయం?

ఈ ఫ్రాంచైజీ కోసం భారీ పెట్టుబడి అవసరం లేదు. ఎంచుకునే సేవలను బట్టి భద్రతా డిపాజిట్ నిర్ణయించారు. డెలివరీ లేదా పికప్ సేవలకు రూ.5,000, బుకింగ్ సేవలకు రూ.10,000 అన్ని సేవ‌ల‌కు క‌లిపి రూ. 15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ డిపాజిట్ తిరిగి చెల్లించే విధంగా ఉంటుంది. ప్రతి పార్సిల్ బుకింగ్, డెలివరీ, పికప్‌పై కమీషన్ లభిస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ సేవలకు అదనపు కమీషన్ కూడా ఉంటుంది. వ్యాపారం పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది.

55
ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీ నోటిఫికేషన్లు సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో విడుదల అవుతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఒప్పందం పూర్తైన తర్వాత 30 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం కల్పిస్తారు. తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచే వ్యాపారం చేయాలనుకునే వారికి పోస్టాఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్ 2.0 మంచి స్వయం ఉపాధి అవకాశంగా నిలుస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు, నిరుద్యోగులకు ఇది అదనపు ఆదాయ మార్గంగా ఉపయోగపడే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories