తిరుమల లడ్డూలో జంతు కొవ్వు: దేశమంతా కలిసి రావాలి.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

First Published Sep 20, 2024, 11:30 AM IST

తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందోళన రేపాయి. భక్తులతో పాటు హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ వ్యవహారంపై గతంలో టీటీడీ బోర్డు ఏర్పాటు చేసిన వైసీపీయే సమాధానం చెప్పాలననారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న విషయం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా సంచలనంగా మారాయి. ఏపీలో తీవ్రమైన రాజకీయ రచ్చకు దారితీశాయి. దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీ- వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా.. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరూ కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు చేసింది అన్నింటికన్నా పెద్ద తప్పు చేశారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసింది చాలా తప్పని.. శ్రీ వేంకటేశ్వర స్వామిని అన్నివిధాలా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తిరుపతి లడ్డూలు తింటున్నప్పుడు చెడు వాసన వస్తోందని అనేకసార్లు ఫిర్యాదులు వచ్చాయని... లడ్డు నాణ్యత లేదని, చర్యలు తీసుకోవాలని  చాలామంది టీటీడీ ఈవో, ముఖ్యమంత్రికి  ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఫోన్ ఇన్ ఈవో కార్యక్రమంలో చాలా మంది భక్తులు తిరుపతి లడ్డూలో నాణ్యత లేదని అనేకమంది ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 

Latest Videos


Tirumala Laddu

కాగా, తిరుపతి ప్రసాదాలు ఎందుకు బాగలేవో తేల్చాలని కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీని వేశారు. భోజనాలు కూడా ఎందుకు సరిగా లేవో తేల్చనున్నారు. ఇప్పటికే నాసిరకం నెయ్యి వినియోగం వల్ల శ్రీవారి ప్రసాదంలో నాణ్యత పడిపోయిందని నివేదికలో తేలింది. వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదంపప్పు, తదితర పదార్థాలు నాసిరకంవి ఉపయోగించడం వల్ల లడ్డూల్లో నాణ్యత పడిపోయిందని ఇప్పటికే భక్తులు, ఆధ్యాత్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ విషయంపై కూటమి నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకకు చెందిన నందిని కో- ఆపరేటివ్ డెయిరీ స్వామివారి మీద భక్తితో రాయితీపై తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేస్తున్నా.. కమిషన్లు రావనే ఉద్దేశంతో ఆ సంస్థను పక్కనపెట్టారని ఆరోపించారు. నందిని డెయిరీని పక్కనపెట్టి ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారన్నారు. కేజీ ఆవు నెయ్యి రూ.400 నుంచి రూ.1000 వరకు ఉంటుంది.. కానీ రూ.320కే సరఫరా చేస్తానంటూ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. వాటి గురించి ఎటువంటి విచారణ జరపకుండా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఆ సంస్థలు నాసిరకపు నెయ్యిని రూ.320కే సరఫరా చేశాయనేది వాస్తవమన్నారు. 

లడ్డూలు తయారుచేసేందుకు రోజుకు టీటీడీకి 15వేల కేజీల నెయ్యి అవసరం. దీని విలువ రూ.200 కోట్లు ఉంటుంది. కాగా, నాసిరకం నేతిని నిర్థారించిన ల్యాబ్ నేతి నాణ్యతను పరిశీలించేందుకు తేది 08.07.2024న NDDB CALF ల్యాబ్‌కు పంపించి పరిశీలించారు. 16.07.2024న నివేదిక విడుదల చేశారు. టీటీడీ పంపించిన నేతిని పరిశీలిస్తే... సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తిగింజలతోపాటు చేప నూనె కూడా ఇందులో వాడినట్లు స్పష్టమైంది. వీటితో పాటు బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారని నివేదికలో పేర్కొన్నారు. 

Tirupati Laddu

ఈ నివేదక బయటకు రావడంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. వైసీపీ ప్రభుత్వ నిర్వాంకపై మండిపడుతున్నాయి. తిరుపతి బాలాజీ పవిత్ర ప్రసాదం కల్తీ దేవస్థానం కమిటీ చేసిన ద్రోహం, అతి పెద్ద పాపమని హిందూ ఐటీ సెల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకుని దోషులను అరెస్టు చేయాలని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను డిమాండ్‌ చేసింది. హిందువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపింది. 

Deputy CM Pawan Kalyan

దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతు కొవ్వు (చేప నూనె, పంది మాంసం కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలపడంతో మనమందరం తీవ్రంగా కలత చెందామని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

మొత్తం భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మతపెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా ఇలా అన్ని రంగాల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 'సనాతన ధర్మాన్ని' ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడాన్ని అంతమొందించడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

కాగా, తిరుమలలో వినియోగించిన నెయ్యిలో S-value ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది. 95.68 నుంచి 104.32కు ఉండాల్సిన S-value 20.32కే ఉంది. ఇందుకు కారణం జంతువుల కొవ్వు కలవడమేనని ల్యాబ్ కూడా నిర్థారించింది. 

click me!