సొంతింటి కోసం 3 సెంట్ల స్థలం, రూ.4 లక్షల సాయం ... మీరు అర్హులేనేమో చెక్ చేసుకొండి.

First Published Sep 19, 2024, 11:22 AM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేద, మద్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు సిద్దమైంది. కాబట్టి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే సాయం పొందేందుకు మీరు అర్హులేనేమో చెక్ చేసుకొండి.

Nara Chandrababu Naidu

 Housing Scheme In Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. అధికారంలోకి వస్తూనే ఎన్నికల హామీల అమలును చేపట్టింది కూటమి సర్కార్... ఇందులో భాగంగానే పేద, మద్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన కింద భారీగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే... ఇందులో రాష్ట్ర వాటాను జోడించి మరింత నాణ్యతతో, సౌకర్యవంతంగా వుండే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఆంధ్ర ప్రదేశ్  లో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా కీలక ప్రకటన చేసారు.  

Housing Scheme In Andhra Pradesh

ఇంటి నిర్మాణానికి చంద్రబాబు సర్కార్ సాయం :

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి సొంతిల్లు వుండేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకోసమే నిరుపేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు భారీ సాయానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. అర్హులకు స్థలమే కాదు ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వమే ఆర్థికసాయం చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. 

గ్రామాల్లో అయితే 3  సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలాన్ని అర్హులకు అందిస్తామని తెలిపారు. అలాగే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు.  ఇక సొంత స్థలం వుండి అందులో ఇళ్లు నిర్మించుకోవాలని అనుకుంటే అందుకోసం కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. 

ఇలా ఈ ఐదేళ్లలో భారీగా గృహ నిర్మాణాలు చేపట్టాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఈ విషయాన్ని  తాజాగా మంగళగిరిలో టిడిపి, జనసేన, బిజెపి (కూటమి) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ఆయా నియోజకవర్గాల్లో ఇళ్లులేనివారు లేకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని కూటమి ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వెంటనే ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 

ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే రూ.4 లక్షల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా వుంటుంది... 60 శాతం కేంద్రం భరిస్తే 40 శాతం రాష్ట్రం భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంకోసం చేపట్టే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని... అవసరమైతే రాష్ట్రం వాటా పెంచాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో 2029 నాటికి రాష్ట్రంలో ఇళ్లులేని ప్రతి ఒక్కరు సొంతింటి కలను సాకారం చేసుకునేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.  
 

Latest Videos


Nara Chandrababu Naidu

'ఇది మంచి ప్రభుత్వం' : 

దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులే పూర్తయ్యింది... కానీ పాలనాపరంగా 1000 అడుగులు ముందుకు వేశామని చంద్రబాబు అన్నారు.కాబట్టి ఈనెల (సెప్టెంబర్) 20 నుండి 26 వరకు ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి... భవిష్యత్తులో చేపట్టబోయే వాటిని ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని... ఇందుకోసం ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.

ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే పాలన ఎలా ఉంటుందో ఈ 100 రోజులే ఒక ఉదాహరణ అన్నారు. ప్రజాప్రతినిధులంతా నెలకు పది రోజుల పాటు ప్రజల్లో ఉండాలని చంద్రబాబు సూచించారు. కూటమిలోని మూడు పార్టీలలో విభిన్న ఆలోచనలు ఉన్నా రాష్ట్రాభివృద్ధే తమ ధ్యేయమన్నారు. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. 

100 రోజుల పాలనలో మన ప్రభుత్వం ఏం చేసింది...ఏం చేయబోతోందో కూడా ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలన్నారు. మన ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం  కలిగించాలని కూటమి ప్రజప్రతినిధులకు చంద్రబాబు సూచించారు. 
 

Nara Chandrababu Naidu

ప్రతి ఇంటికీ సురక్షిత తాగు నీరు :

 నరేంద్ర మోదీ 3.O పాలనలో వికసిత్ భారత్-2047 లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయని చంద్రబాబు అన్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగాల కల్పనతో పాటు ఇంకా ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారన్నారు. ఇటివలే వృద్ధులకు కూడా ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబు గుర్తుచేసారు. 

ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రాబోయే 3 ఏళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసిందని చంద్రబాబు తెలిపారు. కాబట్టి ఎవరి నియోజకవర్గాల పరిధిలో వారు జాతీయ రహదారులను ఫాస్ట్ ట్రాక్ లో పెట్టుకునేలా కృషి చేయాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం 50 శాతం నిధులు ఇస్తోందన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే డబ్బులు సరిగా ఖర్చు చేయకుండా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు దీనిపై మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత నీళ్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.  
 

click me!