ఆంధ్రప్రదేశ్లో యువతకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ పాసైన వెంటనే ఐటీ రంగంలో కొలువు సాధించే అవకాశాన్ని తీసుకొచ్చింది. అత్యుత్తమ ఐటీ కంపెనీలో ట్రైనింగ్తో పాటు జాబ్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు..? ఎలా అప్లై చేసుకోవాలి? తదితర పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం...
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ విద్యను ఒక సంవత్సరం కాలం పాటు అందించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సీఈవో ఎన్.సుర్జీత్ సింగ్ తెలిపారు. విద్యార్థులకు భారత దేశంలో పేరొందిన ఐటీ కంపెనీల్లో ఒకటైన హెచ్సీఎల్ కంపెనీ డిజిటల్ విద్యను అందించి ఉపాధి కల్పించనుంది. అలాగే, ఉపాధి పొందుతూనే విద్యార్థులు ఉన్నత విద్యను కూడా పొందవచ్చు.
ఈ ఐటీ విద్యను పొందడానికి విద్యార్థులు ఇంటర్మీడియట్, తత్సమాన కోర్సును 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండాలి. విద్యార్థినీ విద్యార్థులు తప్పనిసరిగా ఒకేషనల్, సీఈసీ, హెచ్ఈసీ, బైపీసీ గ్రూప్లలో చదివి ఉండాలి. ఏడాది కాలం పాటు ‘టెక్బీ’ ప్రోగ్రాంకు ఎంపికైన అభ్యర్థులు.. శిక్షణ అనంతరం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధి పొందడానికి అర్హత సాధిస్తారు.
ఐటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట హెచ్సీఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇంటర్ వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్ వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రక్రియల్లో విజయం సాధించిన వారికి నియామకపత్రం అందిస్తారు.
అభ్యర్థులకు ఏడాదికాలం పాటు మధురై, చెన్నై నగరాల్లో నెలకొన్న హెచ్సీఎల్ కేంద్రాల్లో శిక్షణను అందిస్తారు. మూడు నెలల పాటు తరగతి గదుల శిక్షణ, మిగిలిన 9 నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది. అభ్యర్థులకు నెలకు రూ.10 వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఎంపిక అయిన వారికి సంవత్సరానికి రూ.1.70 లక్షల వేతనం ఉంటుంది. పనితీరు ఆధారంగా ప్రతి సంవత్సరం వేతనంలో పెంపు ఉంటుంది.
హెచ్సీఎల్లో ఉద్యోగం చేస్తూనే శాస్త్ర, అమిటీ, కేఎల్ యూనివర్సిటీలలో ఉన్నత విద్య చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం registrations.hcltechbee.com వెబ్సైట్ను వీక్షించాలి. 2024 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇతర వివరాలకు 9642973350, 7780323850, 7780754278, 6363095030 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా కృష్ణా జిల్లాలో ఆగస్టు 6న ఐటీ కోర్సుల్లో సెలక్షన్స్కు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. నెల్లూరులో ఆగస్టు 8న, గుంటూరు, ప్రకాశం, చిత్తూరులలో ఆగస్టు 9న, కడపలో ఆగస్టు 10న, కర్నూలులో ఆగస్టు 13న, అనంతపురం ఆగస్టు 17న, పశ్చిమ గోదావరి ఆగస్టు 19న, తూర్పు గోదావరి ఆగస్టు 20న, విశాఖలో ఆగస్టు 22న, విజయనగరంలో ఆగస్టు 23న, శ్రీకాకుళంలో ఆగస్టు 24 తేదీల్లో ఐటీ కోర్సులలో ఎంపికకు ప్రత్యేక డ్రైవ్లు జరుగుతాయి.
ఐటీ టెక్నికల్ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు కొర్నాని యామిని, షేక్ అర్షద్, పడవల వినోద్ రాజ్, ఉప్పల వెంకట కావ్య తమ అనుభవాన్ని పంచుకున్నారు. తాము హెచ్సీఎల్లో ఉద్యోగం చేస్తూనే ఉపాధి పొందడంతో పాటుగా ఉన్నత విద్యను సైతం అభ్యసిస్తూ జీవితంలో రాణించామని తెలిపారు. ఈ కోర్సును పూర్తి చేయడం వల్ల మెరుగైన ఫలితాలను పొందడంతో పాటుగా ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగంతో ఎక్కువ వేతనం పొంది జీవితాన్ని సార్థకత చేసుకున్నామని చెప్పారు.