సర్పంచులను నామమాత్రం చేసిన గత పాలకులు, వారి అనుచరులు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తమ ప్రభుత్వంలో పంచాయతీలను కచ్చితంగా బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు గ్రామ సర్పంచి బూదూరు లక్ష్మి బుధవారం పవన్ కళ్యాణ్ను కలిశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులు తనను బెదిరించి, కుల దూషణలు చేయడంతో పాటు తన సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర అసెంబ్లీలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ముత్తుకూరు సర్పంచి లక్ష్మి కలిశారు. తనకు ఎదురైనా ఇబ్బందులు, అవమానాలను వివరించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనపై వైసీపీ నాయకులు, ఉప సర్పంచి, పంచాయతీ కార్యదర్శి కుల దూషణకి పాల్పడుతున్నారని, ఊరి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు తెలిపారు.
సర్పంచి ఫిర్యాదుపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... ఆమెపై వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి సంతకాలు చేయించిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సంతకాలు ఫోర్జరీపై విచారణ చేపడతామని సర్పంచి లక్ష్మికి హామీ ఇచ్చారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళా సర్పంచి పట్ల కుల దూషణలకి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు.