
Cyclone Arnab : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... ఇది ఇవాళ (సెప్టెంబర్ 19, శనివారం) సాయంత్రానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (APSDMA) ప్రకటించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ పశ్చిమ వాయువ్య దిశగా కదిలి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అర్నబ్ తుపాను లోడింగ్..?
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం సెప్టెంబర్ 21, 22 తేదీలు అంటే వచ్చే సోమ, మంగళవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది. ఆ తర్వాత వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారవచ్చని అధికారులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తే తుపానుగా కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని కదలిక, తీవ్రత, తీరాన్ని దాటే ప్రాంతం వంటి అంశాలపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల రాబోయే రోజుల్లో వాతావరణ శాఖ విడుదల చేసే తాజా బులెటిన్లను ప్రజలు గమనించడం కీలకం.
ప్రస్తుత అల్పపీడనం రాబోయే రోజుల్లో తుపానుగా మారితే దానికి ‘అర్నబ్’ (Arnab) అనే పేరును ఉపయోగించే అవకాశం ఉంది. తుపాన్లకు పేర్లు పెట్టేందుకు WMO/ESCAP ప్యానెల్ దేశాలు ముందుగానే పేర్ల జాబితాను రూపొందిస్తాయి. ఆ జాబితాలో Arnab పేరును బంగ్లాదేశ్ ప్రతిపాదించింది... ఇదే ఇప్పుడు వచ్చే తుపానుకు పెట్టనున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి... ఇవాళ (సెప్టెంబర్ 19) కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నేడు పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు APSDMA తెలిపింది.
దర్శి, అద్దంకి, వినుకొండ, కురిచేడు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని APSDMA అధికారులు సూచిస్తున్నారు.
ఈ జిల్లాల్లోనూ వర్షాలు..
ఇక పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది. సెప్టెంబర్ 19, 20 తేదీలు అంటే ఈ రెండ్రోజులు ఏపీలో భారీ వర్షాలకు అవకాశం ఉందని... ఆ తర్వాతి రోజుల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.
తెలంగాణలో కూడా వాతావరణం చురుగ్గానే ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికల ప్రకారం... సెప్టెంబర్ 19 నుంచి 25 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
ఒక్కరోజులోనే భారీ వర్షపాతం
తెలంగాణలో నిన్న (సెప్టెంబర్ 18, శుక్రవారం) కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా కుల్చారం ప్రాంతంలో అత్యధికంగా 129.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం అంగడి కిష్టాపూర్లో 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిజామాబాద్, వనపర్తి, సంగారెడ్డి, మంచిర్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్లో ఎలా ఉంది?
తెలంగాణలోని పలు జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్లో వర్షపాతం తక్కువగానే ఉంది... భారీ వర్షాలేమీ లేవు. అయితే మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిశాయి.
నేడు (శనివారం) హైదరాబాద్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం ఉందట... దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరవాసులు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు.
తెలంగాణ వెదర్ అంచనాల ప్రకారం.. నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జనగాం, భూపాలపల్లి, జగిత్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నేడు (శనివారం) మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మహబూబ్నగర్, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ మధ్యాహ్నం లేదా రాత్రి వేళల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల సమయంలో వాగులు, కాలువలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లకూడదని... విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో సహాయం లేదా సమాచారం కోసం ఏపీ ప్రజలు 112, 1070 లేదా 18004250101 టోల్ఫ్రీ నంబర్లను సంప్రదించాలని APSDMA సూచించింది.